(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
గిరిజన ప్రాంతాల్లో రహదారులకు నిధులు మంజూరు చేస్తున్నామని ఏటా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రసంగాలు చేస్తున్నారే తప్పా ఆచరణలో నిజం కావడం లేదు. తమ కష్టాలకు తామే ‘మార్గం’ చూడాలనుకున్న గిరిజనులు.. తలా కొంత చందాల రూపంలో పోగేసుకున్నారు. అవసరమైన చోట జేసీబీలను అద్దెకు తెచ్చుకుని.. శ్రమశక్తినే నమ్ముకున్నారు. గ్రామస్తులందరూ చేయి చేయి కలిపి రహదారి కలను సాకారం చేసుకున్నారు.
కొండకోనల్లో ..
తూర్పు కనుమల్లో ఆంధ్రా – ఒడిశా సరిహద్దుల్లో విజయనగరం జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన కొండకోనల్లో.. దూరంగా విసిరేసినట్లు ఉండే మారుమూల గిరిజన గ్రామాలవి.. ఒకటి కాదు, రెండు కాదు. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని ఎనిమిది మండలాల్లోని దాదాపు 217 వరకు ఇలాంటి గ్రామాలున్నాయి. అత్యవసర సమయాల్లో కి.మీ. మేర రాళ్లు, రప్పలను దాటుకుంటూ కాలినడకన దిగాల్సిన పరిస్థితి. ఆపద వేళ డోలీలను ఆశ్రయించాల్సిన దుస్థితి.. రహదారి సౌకర్యం కల్పించాలని ఏళ్ల పాటు ప్రజాప్రతినిధులకు, అధికారులకు వినతులు ఇస్తూనే ఉన్నారు. ఎవరూ స్పందించకపోవడంతో .. ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని ఎదురుచూడకుండా వారి దారిని వారే నిర్మించుకునేందుకు శ్రీకారం చుట్టారు. గిరిజనుల సంకల్పానికి కొండలు కరిగాయి.. బండలు రహదారులయ్యాయి.
శ్రమశక్తితో ..
గుమ్మలక్ష్మీపురం మండలంలోని కీసర నుంచి కేదారిపురం కూడలి వరకు సుమారు 8 కిలోమీటర్ల మేర ఘాట్ రోడ్డును గ్రామస్థులు బాగు చేశారు. ఇరువైపులా తుప్పలను తొలగించి రహదారిని శుభ్రం చేశారు. సాలూరు మండలం గిరిజన ప్రాంతమైన బట్టివలస నుంచి రూఢి వరకు రహదారి నిర్మాణానికి గ్రామస్థులు, యువకులు శ్రీకారం చుట్టారు. బట్టివలస, పుల్లమామిడి, రాంపాడు, గాలిపాడు, సలపరబంద, మర్రివలస, కాగిరూఢి, ఎగువరూఢి, దిగువరూఢి తదితర గ్రామాల గిరిజనులంతా ఈ రహదారి నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యారు. ఇంటికి రూ.2 వేల చొప్పున నిధులు సేకరించారు. అవసరం ఉన్న చోట యంత్రాలను వినియోగిస్తూ.. సాధ్యమైనంత వరకూ తమ కష్టాన్నే నమ్ముకుని శ్రమదానం చేస్తున్నారు. ఇదే మండలం చింతామల, గిరిశిఖర గ్రామాలు సిరివర, నారింజపాడు గిరిజనులు సైతం సొంతంగా రహదారిని అభివృద్ధి చేసుకుంటున్నారు.
కేసలి పంచాయతీ షేరుగుడ్డి నుంచి కాట్రగుడ్డి వరకు సరైన రహదారి సౌకర్యం లేదు. దీంతో ఏడు గ్రామాల గిరిజనులు విద్య, వైద్యానికి దూరమవుతున్నారు. స్వయంకృషినే నమ్ముకున్నారు. తలా కొంత మొత్తం పోగు చేసుకున్నారు. ఇలా రూ.80 వేలు సమకూరింది. ఆ మొత్తంతో జేసీబీని ఏర్పాటు చేసుకుని, శ్రమదానం చేసి మట్టి రహదారిని నిర్మించుకుంటున్నారు. షేరుగుడ్డి నుంచి ఇప్పలగుడ్డి, కాట్రగుడ్డి వరకు సుమారు రెండున్నర కిలోమీటర్ల మేర మార్గాన్ని వేసుకున్నారు. సాలూరు మండలం జాతీయ రహదారి-26 నుంచి ఏడు కిలోమీటర్ల మేర కరడవలస గిరిజనులు కూడా దారి నిర్మాణం చేపట్టారు. ప్రతి కుటుంబానికీ రూ.3 వేలు చొప్పున నిధులు సమకూర్ఛి. మూడు రోజులపాటు శ్రమించి కరడవలస, కొత్తకరడవలస గిరిజన గ్రామాలకు బాటను నిర్మించుకున్నారు. గుమ్మలక్ష్మీపురం మండలం ఓండ్రుబంగి గ్రామానికి రహదారి సౌకర్యం లేదు. దీంతో సుమారు 85 కుటుంబాల వారు ఇంటికి రూ.3,500 చొప్పున సేకరించారు. జేసీబీతో కొండను తవ్వించగా.. గ్రామస్తులంతా శ్రమదానంతో రహదారిని బాగు చేసుకుని స్ఫూర్తిని రగిలించారు.