(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
విశ్వకవిగా ఘనతకెక్కిన గురజాడ మాట నేటి తరానికి బాట వేసింది. ఆయన రచనలు ప్రపంచానికి ఆదర్శమయ్యాయి. సామాజిక సృహతో నాటి సాంఘిక దురాచారాలపై ఆయన తన రచనల ద్వారా పోరాటం చేశారు. ఆనాడే మహిళల ఇబ్బందులను అర్ధం చేసుకొని స్త్రీ పాత్రలను ఉదాత్తంగా తీర్చిదిద్దారు. అటువంటి మహనీయుని 105వ వర్థంతి సందర్భంగా .. లియో పాఠకులకు అందిస్తున్న ప్రత్యేక కథనం ..
విజయనగరంతో మమేకం
గురజాడ పుట్టింది విశాఖ జిల్లాలో అయినప్పటికీ చదువు, ఉద్యోగం, ఆవాసం అంతా విజయనగరం జిల్లాలోనే .. అందువల్ల ఆయన విజయనగరం అడుగుజాడగానే ప్రపంచం మదిలో నిలిచారు. విజయనగరం ప్రజలతో మమేకం అయ్యారు. నేటికీ విజయనగరం పేరు చెబితే గురజాడ గుర్తుకు వచ్చేలా సముచిత స్థానం పొందారు. గురజాడ అప్పారావు 1862 సెప్టెంబర్ 21వ తేదీన విశాఖ జిల్లా యలమంచిలి తాలూకా రాయవరం గ్రామంలో జన్మించారు. తల్లి కౌశల్యమ్మ, తండ్రి వెంకటరామదాసు. తండ్రి విజయనగరం సంస్ధానంలో పేష్కారుగాను, రెవెన్యూ సూపర్వైజర్గాను, ఖిల్లేదారుగాను పని చేశారు. తండ్రి చీపురుపల్లిలో ఉద్యోగం చేస్తున్నపుడు అంటే సుమారు 1872 వరకు అప్పారావు విద్యాభ్యాసం చీపురుపల్లిలోనే జరిగింది. ఆ తరువాత బి.ఏ. వరకు విజయనగరం మహారాజా కళాశాలలో చదువుకున్నారు. గిడుగు రామమూర్తి పంతులు ఆయనకు ప్రాణ మిత్రుడు. అప్పారావు 1882లో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. హైస్కూల్లో చదివే రోజుల్లోనే అప్పారావు శ్లోకాలు రాసే స్ధాయికి ఎదిగారు. ఆయన ఆంగ్లంలో రాసిన ‘‘కుక్కు” అనే పద్యం 1882లో పత్రికల్లో ప్రచురితమయ్యింది.
ప్రిన్సిపాల్ ఇంట్లో వసతి
పేదరికంలో ఉన్న అప్పారావుకు మహారాజా కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర శాస్త్రి తన ఇంట్లో వసతి కల్పించడమే గాక భోజనం కూడా పెట్టి ఆదుకున్నారు.1882 నుండి రెండేళ్ళ పాటు ఎఫ్.ఏ. కోర్సు అభ్యసించారు.1883 లో ఆయన రాసిన సారంగధర అనే ఇంగ్లీషు పద్యకావ్యం ప్రచురితమయ్యింది. అప్పారావు తన సోదరుడు శ్యామలరావుతో కలిసి విజయనగరంలో గల ఇండియన్ లీజర్ అవర్, తెలుగు హార్స్ అనే పత్రికలకు ఇంగ్లీషు పద్యాలను రాసి పంపించేవారు.ఆయన రచనలను మెచ్చుకుని కలకత్తాకు చెందిన ‘‘రీన్ అండ్ రయ్యత్ ” (రాజు, రైతు ) అనే పత్రిక సంపాదకులు శంభుచంద్ర ముఖర్జీ తన పత్రికలో పునర్ముద్రించారు. ఆ తరువాత అప్పారావు రాసిన చంద్రహాస అనే ఇంగ్లీషు కావ్యాన్ని ఇండియన్ లీజర్ అవర్ సంపాదకులు గుండుకుర్తి వెంకటరమణయ్య ఎంతో మెచ్చుకుని ప్రచురించారు.1884 నుండి 1886 వరకు బి.ఏ. ఫిలాసఫీ అభ్యసించారు.ద్వితీయ భాషగా సంస్కృతాన్ని తీసుకుని ఆ భాషపై చక్కటి పట్టు సాధించారు.
ఎమ్మార్లో ఉపాధ్యాయునిగా..
చదువు పూర్తయిన వెంటనే మహారాజా పాఠశాలలో ఉపాధ్యాయునిగా ఉద్యోగంలో చేరారు. 1885 లో దేవరాపల్లిలోని యల్లాప్రగడ సన్యాసిరాజు గారి కుమార్తె అప్పల నరసమ్మతో వివాహమయ్యింది. 1886లో ఆ పాఠశాలకు సెలవు పెట్టి డిప్యూటీ కలక్టర్ ఆఫీసులో హెడ్ క్లర్క్ ఉద్యోగంలో చేరారు.1887 లో విజయదశమి నాడు మహారాజా కళాశాలలో నాల్గవ గ్రేడు లెక్చరర్గా చేరారు. ఆ ఏడాదే ఆయనకు మహారాజు ఆనంద గజపతి రాజుతో పరిచయమైంది. ఆయన కాంగ్రెస్ సభలో ఇచ్చిన ఉపన్యాసం అప్పారావుకు గొప్ప గుర్తింపు తెచ్చిపెట్టింది. 1892 ఆగస్టు 13వ తేదీన ” కన్యాశుల్కం ” తొలికూర్పును ప్రదర్శించారు. 1915 నవంబరు 30న గురజాడ తన తుదిశ్వాస విడిచారు.
ఘన నివాళి
గురజాడ వర్థంతి సందర్భంగా సోమవారం స్థానిక అధికారులు, పట్టణ ప్రముఖులు మహాకవికి ఘనంగా నివాళులర్పించారు. గురజాడ స్వగృహంలో ఆయన చిత్రపటానికి, విగ్రహానికి జాయింట్ కలెక్టర్ జె. వెంకటరావు, మాజీ ఎంపి బొత్స ఝాన్సీలక్ష్మి, డిపిఆర్ఓ డి.రమేష్, సాయిఫౌండేషన్ ప్రతినిధి కోలగట్ల శ్రావణి, గురజాడ సాంస్కృతిక సమాఖ్య ప్రతినిధులు పి.వి.నర్సింహరాజు, డాక్టర్ ఏ.గోపాలరావు, కె.ప్రకాష్ తోబాటు, భీశెట్టి బాబ్జి తదితర పలువురు ప్రముఖులు, కవులు, గురజాడ కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గురజాడ రోడ్డులోని గురజాడ విగ్రహం వరకూ మహాకవి వినియోగించిన వస్తువులతో ర్యాలీ నిర్వహించారు. అక్కడి గురజాడ కాంస్య విగ్రహాం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా జెసి వెంకటరావు మాట్లాడుతూ సాహిత్యాన్ని పండిత భాష నుంచి పామరుల చెంతకు తెచ్చిన ఘనత గురజాడ అప్పారావుకే దక్కుతుందన్నారు. మాజీ ఎంపి బొత్స ఝాన్సీలక్ష్మి మాట్లాడుతూ గురజాడ విశ్వకవి అని, ఆయన రచనలు ప్రపంచానికి ఆదర్శమని పేర్కొన్నారు. గురజాడ స్ఫూర్తిని కొనసాగించేందుకు, ఆయన రచనలను కళాశాల విద్యార్థులకు సైతం మరింత చేరువ చేయాలని సూచించారు. గురజాడ రచనలపై లేజర్ షో ఏర్పాటు చేయాలని ఇప్పటికే సాంస్కృతిక శాఖకు ప్రతిపాదనలు పంపించామని ఝాన్సీ తెలిపారు.











