డిసెంబరు 15వ తేదీకీ బాలూకూ అవినాభావ సంబంధం ఉంది. అదే పాటల బంధం. ఆయన తొలిపాట ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’లో పాడిన సంగతి తెలిసిందే. ఈ పాటను రికార్డు చేసిన రోజిది.
‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’ సినిమా 1967లో విడుదలైంది. బాలు మన మధ్య లేకపోయినా ఆయన తొలిపాటను మనం ఈ సందర్భంలోనైనా గుర్తు చేసుకుందాం. 1964లో మద్రాస్ సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ నిర్వహించిన లలిత సంగీత పోటీల్లో పాల్గొన్న బాలు సంగీత దర్శకుడు కోదండ పాణి దృష్టిలో పడటం, ఆ పరిచయం కాస్తా ఆయనకు పాట పాడే అవకాశం ఇచ్చే దాకా వెళ్లింది. హాస్య నటుడు పద్మనాభం తన కుమారుడు మురళి పేరు మీద, మరో నటుడు వల్లం నరసింహారావు కుమార్తె రేఖ పేరు మీద రేఖా అండ్ మురళి కంబైన్స్ స్థాపించి సినిమాలు తీయడం ప్రారంభించారు. అలా వారు కొన్ని సినిమాలు తీశాక జానపద కథను ఎంచుకుని ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’ సినిమా నిర్మాణం చేపట్టారు. దీనికి కోదండపాణి సంగీత దర్శకుడు. హేమాంబధరరావు దీనికి దర్శకుడు.

బాలుతో పాట పాడిస్తానని కోదండపాణి హామీ ఇచ్చి ఉన్నారు కాబట్టి పద్మనాభంతో ఆ మాట చెప్పడం, దానికి పద్మనాభం అంగీకరించడం జరిగింది. ఆ పాటే ‘ఏమి ఈ వింత మోహమూ’. వీటూరి ఈ పాట రాశారు. ఈ పాటను ఆ సినిమా ఆఫీసులో కోదండపాణి వారం రోజులపాటు బాలు తో ప్రాక్టీసు చేయించారట. అది బాలు ఒక్కడే పాడే పాట కాదని, నలుగురు కలిసి పాడేదని తెలిసింది. ప్రాక్టీసు కోసం ఓ రోజు వెళ్లిన బాలుకు ఆ ఆఫీసులో పి.సుశీల, ఈలపాట రఘురామయ్య, పి.బి. శ్రీనివాస్ కనిపించారు. కంగారులో ఉన్న బాలును కోదండపాణి వారికి పరిచయం చేశారు. మొత్తానికి బాలుతో ఆ పాట పాడించి వినిపించారు.
ముగ్గురు గాయకులతో కలిసి బాలు పాడిన ఈ తొలిపాట 15 డిసెంబరు 1966న విజయా గార్డెన్స్లో రికార్డిస్ట్ స్వామినాథన్ నేతృత్వంలో రికార్డు చేశారు. జూన్ 2, 1967లో ఈ సినిమా విడుదలైంది. అసలీ పాటను ఘంటసాల, పి.బి.శ్రీనివాస్, రఘురామయ్య కాంబినేషన్లో మొదట అనుకున్నారు. పాట రికార్డ్ చేసే సమయానికి ఘంటసాల ఊరు వెళ్లాల్సి వచ్చింది. వచ్చాక వారితో తిరిగి పాడిద్దామనుకొని మొదట బాలుతో పాడించారట. బాలు 20 కేవలం 20 నిమిషాల్లో ఈ పాటను అద్భుతంగా పాడారు. ఘంటసాల వచ్చాక ఆ పాట విన్నారు. ‘వద్దు ఈ అబ్బాయి చక్కడా పాడారు అదే ఉంచండి’ అని ఘంటసాల వారు కూడా అన్నారట.
ఆ పాటకు బాలుకు లభించిన రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?.. 300 రూపాయలు. తన తొలి పాట అవకాశం ఇచ్చిన కోదండపాణిను బాలు గురువుగా భావించి ఆయన పేరుతోనే రికార్డింగు థియేటర్ ను నెలకొల్పారు. అలాగే తన తొలి నిర్మాత పద్మనాభంను కూడా బాలసుబ్రహ్మణ్యం మరచిపోలేదు. అనేక సభలలో కృతజ్ఞతలు తెలిపారు. అందుకే బాలు లాంటి మర్యాదరామన్న ఇంకెవరూ ఉండరు. పాటల ప్రపంచానికి కూడా ఆయన మర్యాదరామన్నే.
Also Read: బాలు ప్రస్థానంలో.. శ్రీకాళహస్తిలో చదువు, సింహాచలంలో వివాహం..











