కొండ నాలుక్కి మందేస్తే.. ఉన్న నాలుక ఊడినట్లు అయింది టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిస్థితి. ధాన్యం కొనుగోళ్లలో వైస్సార్సీపీ నేతలు, మంత్రులు రైతుల్ని దోచుకుతింటున్నారని అత్యుత్సాహంతో వైస్సార్సీపీని ఇరుకున పెట్టబోయి ఆయన ఇరుక్కుపోయారు. దీనిపై నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఘాటుగా సోమిరెడ్డిపై విరుచుకుపడ్డారు. ఇంకా అధికారంలో ఉన్నామని ఆయన భ్రమలో ఉన్నారని, సోమిరెడ్డి చెప్పిన ధాన్యం కొనుగోళ్ల అక్రమాలపై విచారణకు ఆదేశించామని , నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. జీవితంలో సోమిరెడ్డి మళ్లీ ఎమ్మెల్యేగా గెలవలేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
సోమిరెడ్డి తప్పులో కాలేశారా..
కొన్ని రోజుల క్రితం సాక్షి పత్రికలో ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై కథనం ప్రచురితం అయింది. దీనినే ఆయుధంగా చేసుకుని టీడీపీ నేతలు వైస్సార్సీపీపై విరుచుకుపడ్డారు. ఓ దశలో దీనిపై మాట్లాడటానికి వైస్సార్సీపీ నేతలకు సైతం ఏమి అర్ధం కాక మౌనం దాల్చారు. ఇదే అదనుగా సోమిరెడ్డి జిల్లా కలెక్టర్కి లేఖ రాశారు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ చేయించాలని, దళారులతో అధికార పార్టీ నాయకులు కుమ్మక్కై పుట్టి రూ.8 వేల నుంచి రూ.9 వేలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. తక్కువ ధరకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైతుల పేరుతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా మిల్లులకు తరలిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఇంతటితో ఆగకుండా సోమిరెడ్డి అనుచరులు జైపాల్ అనే దళారీ అక్రమాలపై సాక్ష్యాలతో టీడీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇక్కడే వారు బొక్కబోర్లా పడ్డారు. జైపాల్ అని ఎవరినైతే వారు చెప్పారో..? అతను టీడీపీ మద్దతుదారుడు. సోమిరెడ్డి అనుచరుడిగా గతంలో అతను దిగిన ఫోటోలు వైస్సార్సీపీ నేతలకు చిక్కాయి. అప్పటి నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డితో మెదలు పెట్టి.., మంగళవారం బాలినేనితో సహా సోమిరెడ్డిని టార్గెట్ చేస్తున్నారు.
టీడీపీ నేతలు ఆరోపించినతను ఆ పార్టీ వ్యక్తే కావడం, జైపాల్కు ఉన్నది 3 ఎకరాలైతే, 18 ఎకరాలు లీజుకు తీసుకుని 50 పుట్ల ధాన్యం అమ్మినట్లుగా పౌరసరఫరాల వెబ్సైట్లో పేరు నమోదు అయ్యింది. నమోదైన ధాన్యానికి సంబంధించిన డబ్బులు అతని బ్యాంకు ఖాతాలో జమవ్వడంతో టీడీపీ అడ్డంగా బుక్కైంది. గాలి జైపాల్ కొనుగోలు కేంద్రం ద్వారా ధాన్యాన్ని అమ్మినట్లు ట్రిప్ షీట్, కౌలు ధ్రువీకరణ పత్రం మొదలైన డాక్యుమెంట్ల వైస్సార్సీపీ నేతలు మీడియా ముందు పెట్టడంతో , కేసు నమోదుచేసి ఎస్పీ ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించారు. దీంతో సోమిరెడ్డి ఇరుక్కుపోవడమే గాకుండా? టీడీపీ మద్దతు దారుడు గాలి జైపాల్ని ఇరికించారని తెలుగు తమ్ముళ్లు మదనపడుతున్నారు.
కులం కార్డుతో బయట పడాలని ..
గాలి జైపాల్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినని, తనకు చదువు రాదని, దళారులు మోసం చేశారని, తన పేరును 50 పుట్ల ధాన్యం అమ్మినట్లు తనకు తెలియదని మీడియా ముందుకు వచ్చాడు. కానీ, ఆ తర్వాత పోలీసులు జైపాల్ని అరెస్ట్ చేశారు. అతన్ని అరెస్ట్ చేసే సమయంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని కుటుంబ సభ్యులు మీడియా ముందుకు రావడంతో దళితులపై దాడి అని టీడీపీ అధినేత చంద్రబాబు, నెల్లూరు పార్లమెంట్ ఇంచార్జి అజీజ్ వైస్సార్సీపీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. మీరే ప్రెస్ మీట్ పెట్టి మీడియా ఎదుట గాలి జైపాల్ పేరు బయటపెట్టినప్పుడు అతను దళితుడని మీకు తెలియదా? అని వైస్సార్సీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.