పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీడ్ ఇప్పుడు మామూలుగా లేదు. ఆసక్తికరమైన కాంబోస్ ని వరుసగా అనౌన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ లిస్ట్ లో మల్టీస్టారర్ మూవీస్ కూడా ఉన్నాయి. వాటితో పాటు ఆయన ఎక్కువగా రీమేక్స్ కు కూడా మంచి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఆయన కమ్ బ్యాక్ మూవీ అయిన ‘వకీల్ సాబ్’ .. బాలీవుడ్ ‘పింక్’ మూవీకి రీమేక్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక రీసెంట్ గా అనౌన్స్ అయిన సితారా ఎంటర్ టైన్ మెంట్స్ వారి మల్టీస్టారర్ మూవీకూడా మలయాళ రీమేక్ అవడం విశేషం.
మాలీవుడ్ లో ఈ ఏడాది అత్యధిక వసూళ్ళు రాబట్టిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మూవీ రీమేక్ రైట్స్ సినిమా విడుదలై నెలరోజులకే సితారా వారు హస్తగతం చేసుకున్నారు. అప్పటి నుంచి హీరోల ఎంపికలో జాప్యం జరిగింది. ఈ క్రమంలో ఎందరో హీరోల్ని పరిశీలించారు నిర్మాతలు. ఫైనల్ గా ఇప్పుడు ఒక హీరో గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంపికవడం అభిమానుల్ని ఆశ్చర్యపరుస్తోంది. పవన్ కు సైతం ఆ సినిమా కథాంశం.. బలమైన పాత్రలు, కాన్ఫ్లిక్ట్ బాగా నచ్చాయట. ఇక ఇందులో పవన్ చేయబోయేది ఒరిజినల్ లో బిజు మీనన్ చేసిన పోలీస్ పాత్ర అని తెలుస్తోంది. అలాగే.. అందులోని పృధ్విరాజ్ ధరించిన కోషికురియన్ పాత్ర ను దగ్గుబాటి రానా చేయబోతున్నాడని తెలుస్తోంది.
ఇక ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ లో బిజు మీనన్ పాత్ర తర్వాత, మరో శక్తివంతమైన పాత్ర ఆయన భార్య కన్నమ్మ. ఆ పాత్రను గౌరీ నంద పోషించి మంచి పేరు తెచ్చుకుంది. మావోయిస్ట్ అయిన ఆమెను గిరిజన తెగకు చెందిన పోలీస్ ఆఫీసర్ అయ్యప్పన్ నాయర్ (బిజుమీనన్) పెళ్ళి చేసుకుంటాడు. అదే పాత్రను తెలుగు వెర్షన్ లో సాయిపల్లవి చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఆ పాత్రకు సాయిపల్లవే అన్ని విధాలా న్యాయం చేయగలదని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారట. సాయిపల్లవి ప్రస్తుతం నటిస్తోన్న విరాటపర్వం సినిమాలో కూడా నక్సలైట్ పాత్ర పోషించడం విశేషం. ఇంతకు ముందు ఫిదాలో వరుణ్ తేజతో నటించిన సాయిపల్లవి.. ఇప్పుడు మరో మెగా హీరో పవన్ తో నటించనుండడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది.అయ్యారే ఫేమ్ సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకి సాయి పల్లవి పాత్ర ఏ మేరకు హైలైట్ కానుందో చూడాలి.