గ్రేటర్ హైదరాబాద్లో చెత్త తరలింపు కాంట్రాక్టు వివాదం రాజుకుంది. ఇప్పటి వరకు ఇంటింటి చెత్త సేకరణ, తరలింపు బాధ్యతలను జీహెచ్ఎంసీ నిర్వహిస్తోంది. దీని వల్ల 12 వేల మంది కార్మికులకు ఉపాధి లభిస్తోంది. వీటి నిర్వహణకు ఏటా జీహెచ్ఎంసీకి రూ.160 కోట్లు ఖర్చవుతోంది. తాజాగా చెత్త సేకరణ, తరలింపు పనులను కూడా ప్రభుత్వం రాంకీ సంస్థకు అప్పగించింది. దీంతో కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరానికి రూ.160 కోట్లు మాత్రమే ఖర్చయ్యే పనికి, ప్రభుత్వం రాంకీ సంస్థకు రూ.600 కోట్లు చెల్లించేందుకు ముందుకు వచ్చిందని వారు ఆరోపిస్తున్నారు. చెత్త సేకరణ, తరలింపు బాధ్యతలు రాంకీకి అప్పగించడం వల్ల నిర్వహణ వ్యయం భారీగా పెరగడమే కాకుండా, పన్ను చెల్లింపుదారులపై భారం పడుతుందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అంతా ప్రైవేటు పరం చేసేందుకే
గ్రేటర్ హైదరాబాద్లో చెత్త సేకరణ, తరలింపు, ప్రాసెస్ ఇలా అన్నీ పనులను ప్రైవేటు సంస్థ రాంకీకి అప్పగించడంపై కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పారిశుద్ధ్య కార్మికుల ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రభుత్వం, అసలు ఉద్యోగాలు లేకుండా చేసే నిర్ణయాలు తీసుకుంటోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అరకొర జీతాలతో బతకడం కష్టంగా మారిందని చెత్త సేకరణ, తరలింపులో రాంకీ అడుగు పెడితే కార్మికుల సత్తా చూపిస్తామని వారు హెచ్చరిస్తున్నారు. తక్కువ ఖర్చు అయ్యే విధానాలకు స్వస్తి చెప్పి, వందల కోట్లు రాంకీ సంస్థకు ధారపోయడంపై కార్మికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇంకా పెంచాలట
గ్రేటర్ హైదరాబాద్లో సేకరించిన చెత్తను జవహర్నగర్ డంపింగ్ యార్డులో వేరు చేసేందుకు టన్నుకు రూ.818 చెల్లిస్తున్నారు. ఇక రవాణా బాధ్యత కూడా రాంకీకి అప్పగిస్తే టన్నుకు అదనంగా రూ.409 ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మొత్తం ఇంకా పెంచాలని, డంపింగ్ యార్డు దూరం అయిపోయిందని రాంకీ వాదిస్తోంది. డంపింగ్ యార్డులో చెత్తను వేరు చేయడం, శాస్త్రీయంగా నిల్వ చేయడం మాత్రమే రాంకీ చూసుకుంటోంది. ఈ నెల నుంచి ఇంటింటి చెత్త సేకరణ, రవాణా, ప్రాసెస్ అంతా రాంకీ చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్దం అవుతున్నారు. ఉద్యోగ భద్రత లేకపోవడం, కనీసం ఆరోగ్య బీమా లేకపోవడంతో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వేలాది మంది పారిశుద్య కార్మికులు అవుట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్నారు. రాంకీకి అన్నీ పనులు అప్పగిస్తే జీహెచ్ఎంసీకి ఖర్చు పెరిగిపోవడంతో పాటు, వేలాది కార్మికులు రోడ్డున పడతారని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Must Read ;- బ్యాంకుల ముందు చెత్త పోయించిన అధికార్లు
రద్దు చేసుకోకపోతే సత్తా చాటుతాం
గ్రేటర్ హైదరాబాద్లో 12 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో పది వేల మంది అవుట్ సోర్సింగ్ ఏజన్సీల కింద ఉద్యోగం చేస్తున్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి వారి ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తామని అన్నీ పార్టీలు హామీ ఇచ్చాయి. అయితే ఎవరూ హామీని నిలబెట్టుకోలేదు. తాజాగా ఇంటింటి చెత్త సేకరణ, రవాణా కూడా ప్రైవేటు కంపెనీకి అప్పగిస్తే ఇక పారిశుద్య పనుల్లో 60 శాతం రాంకీ చేతుల్లోకి వెళ్లిపోతుందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు కార్మికులు 20 సంవత్సరాలుగా జీహెచ్ఎంసీ పారిశుధ్య పనులు చూస్తున్నారు. అయితే వారిని నేటికీ పర్మినెంట్ చేయలేదు.
ఉద్యోగ భద్రత లేదు. ఈఎస్ఐ సదుపాయాలు కానీ, ఆరోగ్య బీమా కానీ లేదు. దీంతో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. ఇక చెత్తసేకరణ, రవాణా కూడా రాంకీకి అప్పగిస్తే కార్మికుల ఉద్యోగాలు పోతాయని వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది.
Also Read ;- రూ.3లక్షల నగలున్న పాత హ్యాండ్ బ్యాగ్..చెత్త కుప్పలోకి