వ్యవసాయ చట్టాల విషయంలో ప్రధాని మోడీ, కేంద్రమంత్రుల మాటలను రైతులు పట్టించుకోలేదు. వేలాదిగా తరలివచ్చిన రైతులు చలిలో వణుకుతూ ఢిల్లీ చుట్టూ మోహరించి.. తమ ఆవేదనను తెలియజెబుతోంటే.. ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరించడాన్ని కూడా వారు సహించలేకపోతున్నారు. చర్చల పేరిట తమ ముందరికాళ్లకు బంధం వేసే పన్నాగాలను సహించలేకపనోతున్నారు. అందుకే డిసెంబర్ 19 లోపు తమ డిమాండ్లను అంగీకరించకపోతే నిరవధిక నిరాహార దీక్ష చేపడతామంటూ కేంద్రాన్ని హెచ్చరించారు.
సిఖ్లు గురునానక్ తర్వాత అంత ఉన్నతంగా భావించే గురు తేజ్ బహదూర్ వర్ధంతి నుంచే నిరవధిక నిరాహారదీక్షలు ప్రారంభిస్తామంటూ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. కేంద్రాన్ని హెచ్చరించే క్రమంలో భాగంగా.. ఆదివారం ఉదయం 11 గంటలకు రాజస్థాన్లోని షాజహన్పూర్ నుంచి వేలాది మంది రైతులు ట్రాక్టర్ మార్చ్ నిర్వహించనున్నారు. జైపూర్- ఢిల్లీ జాతీయ రహదారిని రైతులు దిగ్బంధిస్తారు. పంజాబ్ నుండి ట్రక్కులు ట్రాక్టర్లలో వస్తున్న రైతులను ఢిల్లీ వైపు అనుమతించాలని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
రైతు ఉద్యమాన్ని విఫలం చేయడానికి కేంద్రం చేసే ఏ ప్రయత్నాన్నయినా మేము విఫలం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. రైతులను విభజించడానికి, ఉద్యమం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ప్రభుత్వం కొన్ని చిన్న ప్రయత్నాలు చేసినా వెరవకుండా, రైతు ఉద్యమాన్ని విజయవంతంగా, శాంతియుతంగా నిర్వహిస్తున్నామన్నారు. వ్యవసాయ చట్టాలను పూర్తిగా రద్దు చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని, కేంద్రంతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని.. కానీ కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేశాకే కేంద్రంతో చర్చిస్తామని వారు అంటున్నారు.
Must Read ;- ‘ఒకే రాష్ట్రం ఒకేరాజధాని’ : మహాపాదయాత్రకు భారీ స్పందన
అదే జరిగితే ప్రమాదమే
ఇంత పెద్ద సంఖ్యలో రైతులు నిరవధిక నిరాహార దీక్షకు పూనుకుంటే గనుక.. ప్రభుత్వం పరువు పోవడం మాత్రం గ్యారంటీ. నిరవధిక దీక్షకు రైతులు దిగిన తర్వాత.. అనుకోని ఏ అవాంఛనీయ సంఘటన జరిగినా.. ఏ రైతుల బాగుకోసం తాము అద్భుతమైన చట్టాలను చేశాం అంటూ మోడీ సర్కారు డప్పు కొట్టుకుంటున్నదో.. అదే రైతుల బలిదానాలు జరిగితే గనుక.. ఇక సర్వభ్రష్టత్వం చెందుతుంది. ఇవాళ ఇది రెండు మూడు రాష్ట్రాల రైతులకు మాత్రమే పరిమితమైన ఉద్యమంగా బీజేపీ రంగుపూసి మాయ చేయడానికి ప్రయత్నిస్తుండవచ్చు. కానీ.. ఏ అవాంఛనీయ సంఘటన జరిగినా.. దేశమంతా పోటెత్తుతుందని వారు తెలుసుకోవాలి.
Also Read ;- అంబానీ, అదానీలపై అన్నదాత ఆగ్రహం











