జీహెచ్ఎంసీలో ఫిబ్రవరి 11న నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారంతోపాటు మేయర్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే బల్దియా కమిషనర్ లోకేష్కుమార్ అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించి నిబంధనలు వివరించారు. సమావేశం ఏర్పాటుకి కోరమ్ అవసరం ఉండగా, సమావేశం మొదలయ్యాకా మెజార్టీ మద్దతు ఉన్న వ్యక్తిని మేయర్గా ఎన్నుకోనున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు ప్రిసైడింగ్ ఆఫీసర్గా హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి ఉండనున్నారు. పార్టీల వారీగా వస్తే.. టీఆర్ఎస్కి 56 కార్పొరేటర్లు, 32 ఎక్స్ ఆఫీషియో సభ్యులు ఉండగా బీజేపీకి 47 కార్పొరేటర్లు, 2 ఎక్స్ ఆఫీషియో సభ్యులు, MIM కి 44మంది కార్పొరేటర్లు, 10 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు, కాంగ్రెస్కు మొత్తం ఇద్దరు సభ్యులు ఉన్నారు.
టీఆర్ఎస్కే అవకాశాలెక్కువ
కాగా ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం ప్రకారం టీఆర్ఎస్కే ఎక్కువ అవకాశాలున్నాయి. బీజేపీకి, ఎంఐఎంకి తక్కువ అవకాశాలున్నాయి. రెండు రోజుల క్రితం నిర్వహించిన పార్టీ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ..జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పేర్లను పార్టీ అన్ని కోణాల్లో ఆలోచించి ఎంపిక చేస్తుందని, ప్రమాణ స్వీకారం రోజున సీల్డు కవర్లో పేర్లు వెల్లడిస్తామన్నారు. ఇక బీజేపీ కూడా మేయర్, డిప్యూటీ మేయర్ రేసులో నిలిచింది. రెండు నామినేషన్లను దాఖలు చేయనున్నారు. అందులో భాగంగా బీజేపీ కార్పొరేటర్లతో ఆ పార్టీ ముఖ్య నేతలు బుధవారం అల్పాహార సమావేశం నిర్వహించారు. మేయర్ ఎన్నికలో అమలు చేయనున్న వ్యూహం, ప్రణాళికపై చర్చించారు. తాము ఎవరితో పొత్తుపెట్టుకునేది లేదని చెప్పడంతో పాటు టీఆర్ఎస్-MIM లోపాయకారీ పొత్తుపై ప్రజలకు చెప్పేందుకు తాము మేయర్, డిప్యూటీ మేయర్ రేసులో నిలిచామని బీజేపీ నేత రామచంద్రరావు వ్యాఖ్యానించారు.
రేసులో వీరు..
గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండడంతో పాటు సీనియర్లు ఎక్కువ మంది గెలిచిన నేపథ్యంలో టీఆర్ఎస్లో మేయర్ రేసులో చాలామంది ఉన్నారు. కేకే కుమార్తె విజయలక్ష్మి, పీజేఆర్ తనయ విజయారెడ్డి, కనకారెడ్డి కోడలు విజయశాంతిలతో పాటు కవితారెడ్డి, మోతె శ్రీలత, సింధురెడ్డి, పూజిత గౌడ్, బొంతు శ్రీదేవిల పేర్లు వినిపిస్తున్నాయి. సామాజిక వర్గాల వారీగా పార్టీ నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. ఆ ప్రకారం చూస్తే.. శ్రీదేవి, పూజిత, విజయలక్ష్మి ముందుండే అవకాశం ఉంది. అయితే, ఇందంతా పార్టీలో జరుగుతున్న ప్రచారమే. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీని ఢీకొట్టడం, సమావేశాలు సాఫీగా నిర్వహించడం, ప్రతిపక్షాల వ్యూహాలను ఎదుర్కోవడం లాంటి సామర్థ్యం అవసరమని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కోణంలో వేరే వ్యక్తిని ఎంపిక చేసి కేసీఆర్ అందరికీ షాక్ ఇచ్చినా ఇవ్వచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నారు. కాగా టీఆర్ఎస్ కీలక నేత కేకే కుమార్తె విజయలక్ష్మి బుధవారం టీఆర్ఎస్ భవన్కు వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. మేయర్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు విజయలక్ష్మి.
డిప్యూటీ రేసులోనూ..
మేయర్ పదవికి తీవ్ర పోటీ ఉండగా డిప్యూటీ మేయర్ పదవి కోసం కూడా భారీగానే ప్రయత్నాలు చేస్తున్నారు ఆశావహులు. సిట్టింగ్ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్తో పాటు, జగదీశ్వర్గౌడ్, షేక్ హమీద్, సబీహాబేగం, ఎం.నరసింహయాదవ్ తదితర పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం కార్పొరేటర్ల స్థానాలతోపాటు ఎక్స్ అఫిషియో సభ్యుల సంఖ్య కలిపి 202 స్థానాలున్నట్లు చెప్పినా..తుది లెక్కల ప్రకారం 193గా తేలింది. సమావేశం నిర్వహించేందుకు కోరం (సగం) ఉంటే సరిపోతుంది. మేయర్ ఎన్నికలకు కోరమ్, మేజిక్ ఫిగర్ అవసరం లేదు.
విప్ జారీ చేసిన టీఆర్ఎస్..
కాగా తమ అభ్యర్థులకు టీఆర్ఎస్ విప్ జారీ చేసింది. కేకే, తలసానిలను పరిశీలకులుగా నియమించింది టీఆర్ఎస్ పార్టీ. పార్టీ లిఖితపూర్వంగా ఇచ్చిన ఆదేశాలను విస్మరించి వ్యవహరిస్తే విప్ దిక్కరించినట్టు భావిస్తారు. మరో వైపు బీజేపీ కూడా తమ అభ్యర్థులు బషీర్ బాగ్ ముత్యాలమ్మ ఆలయంలో పూజల అనంతరం జీహెచ్ఎంసీకి వెళ్లేందుకు ప్రణాళిక వేసింది. ఆ పార్టీ మేయర్ అభ్యర్థిగా ఆర్కేపురం కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Must Read ;- చక్రం తిప్పిన కేకే.. మేయర్ అభ్యర్థి ఆయన కుమార్తె విజయలక్ష్మి










