జీహెచ్ఎంసీ ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వేడిని రగిల్చాయి. పార్టీ లు బల ప్రదర్శనకు సిద్ధం అవుతున్నాయి. అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కు పలు సానుకూల అంశాలు కనిపిస్తున్నాయి. లాజికల్ గా చూస్తే.. పరోక్ష పద్ధతిలో జరిగే మేయర్ ఎంపికలో.. టీఆర్ఎస్ పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కార్పొరేటర్ల గెలుపు విషయంలో మరీ దారుణ ఫలితాలు వచ్చేంత అద్భుతం జరిగితేనే.. టీఆర్ఎస్ నుంచి మేయర్ పీఠం దూరం చేయడం సాధ్యం అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఇందుకు కారణం ఒక్కటే.. మేయర్ల ఎన్నికలో పాల్గొనే ఎక్స్ అఫిషియో మెంబర్ల బలం టీఆర్ఎస్ కు ఎక్కువగా ఉండడం. ఆ ఓట్లతో టీఆర్ఎస్ మేయర్ పీఠం దక్కించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరోవైపు తాము 100కుపైసా డివిజన్లలో గెలుస్తామని టీఆర్ఎస్ చెబుతోంది. అందులో సగానికంటే కొంచెం ఎక్కువగా అంటే 54 సీట్లు గెలిచినా.. బల్దియాపై గులాబీ జెండా ఎగురడం ఖాయంగా కనిపిస్తోంది.
అవసరం ఎంతంటే..
జీహెచ్ఎంసీలో 150 డివిజన్ల ఉన్నాయి. వాటితోపాటు మరో 52 మంది ఎక్స్ అఫిషియో మెంబర్లుగా ఉన్నారు. అంటే జీహెచ్ఎంసీ పరిధిలో 52మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. మొత్తం కలిపితే (150+52) 202 అవుతాయి. ఇక రాజ్యసభకు చెందిన వారు ఇక్కడ ఓటు వేస్తామని ఆప్షన్ ఇస్తే ఆ సంఖ్య పెరగొచ్చు. ప్రస్తుతం 52మందికి జీహెచ్ఎంసీలో ఓటువేసే వీలుంది. నిబంధనల ప్రకారం ఆ 202లో.. 50% పైగా అంటే.. 102 ఓట్లు సాధించిన వారు పరోక్ష పద్దతిలో మేయర్ గా ఎన్నిక అవుతారు.
ఆ 102ఓట్ల విషయం పరిశీలిస్తే.. రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ కు ఇక్కడ 38 (ప్రభుత్వ సిఫారసుతో గవర్నర్ ఎంపిక చేసిన ముగ్గురితో కలిపి) ఓట్లు ఉన్నాయి. వీరితోపాటు ఎంఐఎం వారూ 10మంది ఉన్నారు. టీఆర్ఎస్ 38, ఎంఐఎం 10..మొత్తం కలిపితే 48 మంది అవుతారు. అంటే 102లో 48 ఓట్లు టీఆర్ఎస్+MIMవే ఉన్నాయి. వాటిని మినహాయిస్తే.. మేయర్ పీఠం దక్కించుకునేందుకు 54 ఓట్లు మాత్రమే టీఆర్ఎస్ కు, ఎంఐఎంకి అవసరం అవుతాయి. ఇక గత ఎన్నికల్లో టీఆర్ఎస్ 99 గెలవగా ఎంఐఎం 44 గెలిచింది. వీరు ఉమ్మడిగా 143 గెలిచారు. అందులో ఇప్పుడు 54 డివిజన్లలో గెలుపు పెద్ద కష్టం కాదని విశ్లేషకులు చెబుతున్నారు.
ఎంఐఎంని కలుపుకోకుండా..
ఇక ఎంఐఎంని కలుపుకోకుండా టీఆర్ఎస్ బలం లెక్కిస్తే.. టీఆర్ఎస్ కు 38 ఎక్స్ అఫిషియో ఓట్లు ఉండనే ఉన్నాయి. నిర్ణీత మెజార్టీకి కావాల్సిన 102ఓట్లలో ఆ 38 ఓట్లను మినహాయిస్తే ఇంకా 64 ఓట్లు అవసరం అవుతాయి. అంటే మొత్తంమీద 64 డివిజన్లలో గెలిస్తే.. టీఆర్ఎస్ సింగిల్ గా మేయర్ పీఠం దక్కించుకోవచ్చు. ఎంఐఎం మద్దతు కూడా తీసుకుటే 54 గెలిస్తే సరిపోతుంది. ఎంఐఎంతో కలిస్తే 54, కలవకుంటే 64 చోట్ల విజయం సాధిస్తే..టీఆర్ఎస్ మేయర్ పీఠం దక్కించుకుంటుందని చెప్పవచ్చు.
ఇక డివిజన్ల వారీగా వస్తే.. 150 డివిజన్లలో 2016లో టీఆర్ఎస్ 99, ఎంఐఎం 44, కాంగ్రెస్ 2, బీజేపీ 4, టీడీపీ 1 గెలిచాయి. టీఆర్ఎస్ గెలిచిన 99, ఎంఐఎం గెలిచిన 44 కలిపితే 143 అవుతుంది. వాటిల్లో ప్రస్తుతం సగం గెలిచినా.. 72 సీట్లు అవుతాయి. మేయర్ పీఠం కోసం కావాల్సిన 54 కంటే మరో 18 సీట్లు ఎక్కువ సాధించినట్లు భావించవచ్చు. ఇక టీఆర్ఎస్ ఒక్కపార్టీ గెలవాల్సిన సీట్లను పరిశీలిస్తే ప్రస్తుతం ఉన్న 99 సిట్టింగ్ స్థానాల్లో 64 గెలిచినా పీఠం దక్కించుకోవచ్చు.
100 పక్కా అని చెబుతున్న TRS
2016లో ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున 99 మంది కార్పొరేటర్లు ఎన్నికయ్యారు. ఇతర పార్టీల నుంచి మరో ముగ్గురు TRSలో చేరారు. దీంతో TRS బలం 102కి చేరింది. ఈసారి 100 పక్కా అని అధికార టీఆర్ఎస్ చెబుతోంది. అయితే అంచనా మేరకు సీట్లు గెలవకపోయినా, ఊహించని పరిణామాలు ఎదురైనా.. ఎక్స్ అఫీషియో ఓట్లతోనైనా మేయర్ పదవిని వశం చేసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
DS ఓటు ఎక్కడ..
TRSకి చెందిన పలువురు లోక్ సభ, రాజ్యసభ, శాసనమండలి, శాసన సభ సభ్యులు ఇక్కడే ఓటు వేయనున్నారు. 35మంది ఇలా నమోదుచేయించుకున్నారు. అయితే ఆ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న డి. శ్రీనివాస్ ఎక్కడ ఆప్షన్ ఇస్తారనేది చర్చనీయాంశంగా మారింది. కొన్నాళ్లుగా ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన కుమారుడు ధర్మపురి అర్వింద్ బీజేపీనుంచి ఎంపీగా గెలిచారు. ఈ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ కూడా డీఎస్ ను దూరంగా పెట్టినట్టు చర్చ నడుస్తోంది. అయితే ఆయన తన ఓటును ఎక్కడ నమోదుచేసుకుంటారనేది తేలాల్సి ఉంది.