దుబ్బాక విజయం తర్వాత భారతీయ జనతా పార్టీలో జోరు మరింత పెరిగింది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితిపై సాధించిన విజయంతో కమలనాథులు రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. ఆ ఉత్సాహంతోనే త్వరలో జరుగనున్న గ్రేటర్ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇంత వరకూ బాగానే ఉంది. అయితే, భారతీయ జనతా పార్టీలో అంతర్గత కుమ్ములాటలే ఆ పార్టీకి చేటు చేస్తాయనే భయం పార్టీ నాయకులను వేధిస్తోంది.
తెలంగాణ జిల్లాల కంటే పార్టీ చాలా పటిష్టంగా ఉన్నది రాజధాని హైదరాబాద్ లోనే. అలాగే గ్రూపుల కుమ్ములాటలు కూడా ఎక్కువగా ఉన్నది రాజధానిలోనే. గతంలో కూడా ఈ కుమ్ములాటల కారణంగానే పార్టీ తీవ్రంగా నష్టపోయిన సంఘటనలున్నాయి. అప్పట్లో పార్టీ సీనియర్ నాయకులు గ్రూపులుగా విడిపోయి అధిష్టానం వద్ద మెప్పు కోసం ప్రయత్నించే వారు. అప్పట్లో ఆ సీనియర్ నాయకులకు అనుంగు అనుచరులుగా ఉన్న వారు ఇప్పుడు పార్టీలో పెద్ద పదవుల్లో ఉన్నారు.
వారు పార్టీలో ఎదిగినట్లుగానే వారి గ్రూపులు కూడా ఎదిగాయన్నది పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న ప్రచారం. ముఖ్యంగా బీసీ వర్గాలకు చెందిన నాయకులకు, అగ్ర కులాలకు చెందిన కమలనాథులకు మధ్య ఈ గ్రూపు తగాదాలు ఎక్కువగా ఉన్నాయి. వాటి ప్రభావంతోనే గతంలో గ్రేటర్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా నష్టపోయింది.
బండి వచ్చినా.. ముఠాల్లో మార్పు లేదు..
తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయనొక్కరే జిల్లాల పర్యటనలు, పార్టీ పటిష్టం కోసం చర్యలు తీసుకోవడం చేశారు. ఆ సమయంలో పార్టీలో సీనియర్ నాయకులు ఎవ్వరూ ఆయనకి సహకరించలేదని వార్తలు వచ్చాయి. అయితే, అధిష్టానం అండదండలు పుష్కలంగా ఉన్న బండి సంజయ్ వారి అండదండలతోనే పార్టీని పటిష్ట పరిచే పని ప్రారంభించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై పాలనపై ఘాటైన విమర్శలు చేయడంతో పాటు దుబ్బాక ఎన్నికలను ఒంటి చేత్తో ఎదుర్కొన్నారు. దుబ్బాక ఎన్నికల ప్రచారంలో కూడా సీనియర్ నాయకులు పెద్దగా కనిపించలేదు. చివరి రెండు, మూడు రోజులు కేంద్ర హోం మంత్రి కిషన్ రెడ్డి ప్రచారంలో హడావుడి చేశారు. ఇదంతా గ్రూపుల ప్రభావమే అని పార్టీలో సీనియర్ల నుంచి ఇటీవల పార్టీలో చేరిన వారి వరకూ చెబుతున్నారు. మరి రానున్న గ్రేటర్ ఎన్నికలలో కమలనాథులు గ్రూపులు పక్కన పెట్టి అధికార పార్టీపై ఎలా విజయం సాధిస్తారో వేచి చూడాల్సిందే.