న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వారిపై కేసులను సీబీఐ వేగంగా విచారణ కొనసాగిస్తోంది. అయితే కేవలం సీఐడీ బదిలీ చేసిన 17 మందిపై ఉన్న 12 కేసులను మాత్రమే వారు విచారిస్తున్నారు. వైసీపీ నేతలు ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా జడ్జీలను ఏకిపారేసినా వారిపై కేసునమోదు కాలేదు. మొత్తం 93 మంది సోషల్ మీడియా, మీడియాలో న్యాయవ్యవస్థపై తిరుగుబాటు చేశారు. వీరందరిపై కేసులు నమోదు చేసి విచారించాల్సిన సీబీఐ, కేవలం సీఐడీ బదిలీ చేసిన 12 కేసులనే విచారించడంతో చేతులు దులుపుకుంటుందా అనేది తెలియడం లేదు.
కోర్టు తీర్పు నచ్చకపోతే తిరగబడతారా?
ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులిస్తున్నారనే ఉద్దేశంతో కొందరు వైసీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు న్యాయవ్యవస్థ, జడ్జీలపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై గుంటూరుకు చెందిన న్యాయవాది లక్ష్మీనారాయణ హైకోర్టులో మొదటగా పిల్ వేశారు. ఆ తరవాత హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. తరవాత ఈ కేసులను సీబీఐ విచారణ చేయాలని హైకోర్టు ఆదేశించింది. మొత్తం 17 మందిపై సీఐడీ పెట్టిన కేసులను సీబీఐకి బదిలీ చేశారు. 93 మంది సోషల్ మీడియా, మీడియాలో న్యాయవ్యవస్థ, జడ్జిలపై కామెంట్లు చేశారని న్యాయవాది లక్ష్మీనారాయణ సీబీఐ విచారణలో వెల్లడించారు.
కేసులో ఏముంది?
ఈ ఏడాది మార్చిలో న్యాయవ్యవస్థను, జడ్జీలను కించపరుస్తూ కొందరు వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. అనంతరం కొందరు వైసీపీ సానుభూతిపరులు సోషల్ మీడియాలో చెలరేగిపోయారు. జడ్జిలను కరోనా రోగులతో ఉంచాలని కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై న్యాయవాది లక్ష్మీనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఫిర్యాదుతో మొదట సీఐడీ కేసులు నమోదు చేసింది. అయితే ఒక్కరినీ అదుపులోకి తీసుకోలేదు. దీనిపై కోర్టు చాలా సీరియస్ అయింది. ప్రభుత్వాధినేతపై పోస్టులు పెడితే నిమిషాల్లో కేసులు పెట్టి వేధిస్తున్న పోలీసులు, న్యాయవ్యవస్థను కించపరిస్తే కేసులు నమోదు చేయరా? అంటూ ప్రశ్నించింది. వెంటనే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. దీంతో 2020 ఏప్రిల్ 16న నమోదైన తొలి కేసుతో సహా మొత్తం 12 కేసులు సీబీఐకి చేరాయి. తాజాగా ఈ నెల 9న సీబీఐ 12 కేసులను సీఐడీ నుంచి స్వీకరించింది. వెంటనే విచారణ ప్రారంభించింది. 2 నెలల్లోనే కేసు దర్యాప్తు పూర్తి చేయాలని కోర్టు ఆదేశాలతో విచారణ వేగంగా సాగుతోంది.
ఏ సెక్షన్లు పెట్టారు
సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వారిపై ఐపీసీ 153(ఏ), 504,504(2),506తో పాటు ఐటీ యాక్ట్ లోని సెక్షన్ 67ను ప్రయోగించారు. ఎఫ్ఐఆర్ RC03620202S0015lని ఈ నెల 11న నమోదు చేశారు. సీబీఐ డీఎస్పీ శ్రీనివాస్ ఈ కేసు విచారణ అధికారిగా వ్యవహరిస్తున్నారు.
విదేశాల్లోనూ నిందితులు
ఎఫ్ఐఆర్ లో నమోదు చేసిన సెక్షన్ల ప్రకారం ఉద్దేశపూర్వకంగా బెదిరించడం, ద్వేషంతో, శత్రుత్వంతో బెదిరించడంకోసం సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా పోస్టులు పెట్టారని నమోదు చేశారు. మొత్తం 17 మంది నిందితుల్లో 16 మందిని గుర్తించారు. వీరిలో కొందరు విదేశాల్లో ఉన్నారు. వైసీపీ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతూ ప్రభాకర్ రెడ్డి అనేవ్యక్తిపై కేసు నమోదు చేయాల్సి ఉంది. అయితే కేసులు నమోదు కాగానే 93 మందిలో చాలా మంది పోస్టులు డిలీట్ చేశారు. మరికొందరు ఎఫ్ బీ ఖాతాలను క్లోజ్ చేశారు. ఇవన్నీ సీబీఐ వెలికితీయగలదా? అనే అనుమానం వస్తోంది.
Must Read ;- జస్టిస్ రమణపై విషం: మోసగాడు, జైలుపక్షే దొరికాడా?
ప్రముఖులను పట్టించుకోరా?
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. వైసీపీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్, చీరాల వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మరో ఎంపీ పండుల రవీంద్ర వీరంతా ఎలక్ట్రానిక్ మీడియాలో న్యాయవ్యవస్థ, జడ్జీల తీర్పులపై రెచ్చిపోయారు. తొలుత కేసులో వీరి పేర్లు లేవు. అనుబంధ పిటిషన్ లో హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వీరి వ్యాఖ్యలను కూడా జత చేశారు. అయితే ఎఫ్ఐఆర్ లో మాత్రం ప్రముఖుల పేర్లు కనిపించడం లేదు. సీబీఐ ఆ 17మందిపై మాత్రమే విచారణ చేసేలా ఉంది. రెచ్చగొట్టిన వారిని వదిలేసి, రెచ్చిపోయిన వారిని అరెస్టు చేయడంపై గుంటూరుకు చెందిన న్యాయవాది లక్ష్మీనారాయణ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విచారణ సమయంలో సీబీఐ ఎలాంటి వివరాలు లీక్ కానీయడం లేదు. కేవలం హైకోర్టుకు మాత్రమే తాము విచారణ అంశాలను అందిస్తామని సీబీఐ డీఎస్పీ శ్రీనివాస్ వెల్లడించారు.
రాజ్యాంగం ఏమి చెబుతోంది?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)ఏ ప్రకారం పౌరులందరికీ భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంది. కానీ వారి అభిప్రాయాలు ప్రకటించడానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. భావ ప్రకటనా స్వేచ్ఛ ఉన్నా నిబంధనలు మీరకుండా అభిప్రాయాలు వెల్లడించాలి. ఎదుటివారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే రీతిలో భాష,రాత,ప్రవర్తన, వ్యాఖ్యలు ఉండరాదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం హద్దులు మీరుతున్నారు.
వీరికి ఎన్ని సంవత్సరాలు శిక్ష పడుతుంది?
జడ్జీలపై అనుచిత పోస్టుల కేసులో ఇటు సైబర్ క్రైం చట్టాలతో పాటు, కోర్టు ధిక్కరణ కిందకు కూడా వస్తుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో, మీడియా పలు రాజకీయ పార్టీల నేతలతోపాటు, కార్యకర్తలు కూడా ఒకరిపై ఒకరు తీవ్రమైన వ్యాఖ్యలు చేసుకోవడం మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే కోర్టులు, న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణం. తీర్పునచ్చనప్పుడు పై కోర్టుకు వెళ్లే అవకాశం రాజ్యాంగం కల్పించింది. అంతేగాని తీర్పు ఇచ్చిన వారిపై ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం శోచనీయం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000, సెక్షన్ 67 ప్రకారం ఇలాంటి వారిపై కేసు నమోదు చేయవచ్చు. అభ్యంతరకరంగా ఏదైనా ప్రచురించినా, ప్రసారం చేసినా ఈ చట్టం ప్రకారం శిక్షార్హులవుతారు. నేరం రుజువైతే తొలిసారి నేరం చేసిన వారికి మూడేళ్ల జైలు శిక్ష, ఐదు లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది. రెండోసారి ఇలాంటి నేరానికే పాల్పడితే ఐదేళ్లు జైలు, పది లక్షల జరిమానా విధించే అవకాశాన్ని ఈ చట్టం కల్పించింది.
Also Read జగన్కు వ్యతిరేకంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీర్మానం!