(విజయనగరం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
జాతీయస్థాయిలో ప్రధాన భూమిక పోషిస్తున్న భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్ లోను పాగా వేయాలని శతవిధాల ప్రయత్నిస్తోంది. అందుకోసం జిల్లా స్థాయి నుండి రాష్ట్రం వరకు పార్టీని పటిష్టం చేస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజును నియమించింది. అదేతరుణంలో విజయనగరం జిల్లాలో ఆ పార్టీ పరిస్థితి ‘మూడు గ్రూపులు .. ఆరు వర్గాలు’గా తయారైంది. పార్టీ జిల్లా నాయకుల్లో ఒకరంటే మరొకరికి అస్సలు పొసగడం లేదు. నాయకులు, కార్యకర్తలు పైకి కలిసి ఉన్నట్టు నటిస్తున్నారే గానీ వాస్తవానికి కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకున్న చందంగా వ్యవహరిస్తున్నారు.
పార్టీ నాయకుల మధ్య సమన్వయం, సఖ్యత దుర్భిణితో వెతికినా సూది మొనంత కూడా కనిపించడం లేదు. వీళ్ళ మధ్య కార్యకర్తలు నైరాశ్యంతో విసిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో పార్టీ పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ అనే చందంగా తయారైంది. జిల్లాలో బీజేపీ బతికి బట్టకట్ట లేకపోవడానికి కూడా అనేకానేక కారణాలున్నాయి. దరిమిలా రాజకీయంగా ఆ పార్టీ జిల్లాలో సత్తా చూపించే పరిస్థితి కనుచూపు మేరలో కనిపించడం లేదు. కనీసం పార్టీ అనేది ఒకటుందని కూడా అగుపించడం లేదు.
ఎవడికి వాడు రాజకీయంగా కాషాయం కండువా మెళ్ళో కప్పుకుంటూ వ్యక్తిగతంగా తమ ఉనికిని చాటు కోవడానికి తాపత్రయపడుతున్నారే తప్ప పార్టీ కోసం ఎవడూ ఆలోచించడం లేదు. పార్టీని ఉద్ధరించే దిశగా ప్రయత్నమూ చెయ్యడం లేదు. ఇందుకు పూర్వాశ్రమంలో జరిగిన, ప్రస్తుతం జరుగుతుతున్న పరిణామాలే నిదర్శనం. జిల్లా కేంద్రంలోని నాగవంశం వీధిలో కాళ్ళ నారాయణ రావు అంశంలో పార్టీ ఏం చేసింది? ఏం చెయ్యగలిగింది? అప్పట్లో ఒకరిద్దరు స్పందించారే గానీ మిగతా వాళ్ళు ఏమయ్యారు? ఆ రోజు తర్వాత నారాయణ రావును పట్టించుకున్న నాథుడే లేడు.
మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు మృతికి జిల్లా నేతలంతా కలిసి ఒకే వేదిక పై చేరి సంతాపం ప్రకటించలేక పోయారు. దివంగత నేతకు కలసికట్టుగా ఓ దండ వేయలేకపోయారు. కనీసం తామైనా ఏదో చేద్దామని వెళ్ళిన కార్యకర్తలను పార్టీ ఆఫీసులో తాళాలు వెక్కిరించాయి. దివంగత నేతకు నివాళులు అర్పించి వెళ్ళిపోతామని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంత బతిమాలినా, కార్యాలయం తాళం తియ్యకుండా అక్కడి కాపలాదారు ససేమిరా అన్నాడని సదరు కరడు గట్టిన బీజేపీ వాళ్ళంతా వాపోతున్నారు. జిల్లా అధ్యక్షులు కార్యాలయం తాళాలు ఎవరికీ ఇవ్వొద్దన్నారని, తలుపు తెరిచే ప్రసక్తే లేదని కాపలాదారు చెబితే వాళ్ళంతా ఎవడికీ చెప్పుకోలేక ఆఫీస్ గేటుకే మాణిక్యాల రావు ఫొటో తగిలించి, దానికే ఓ దండేసి, ఓ దణ్ణం పెట్టి వెనుదిరిగారు. జిల్లా బీజేపీలో బవిరెడ్డి ప్రసాద రెడ్డి, పాకలపాటి సన్యాసి రాజు, కుసుమంచి సుబ్బారావు, రెడ్డి పావని, రామకృష్ణ రాజు, దేవర ఈశ్వరరావు సహా సీనియర్లు వృద్ధులు చాలా మందే ఉన్నారు. కానీ ఎవరి దారి వాళ్ళదే -ఎవడి గోల వాడిదే.
బవిరెడ్డి శివప్రసాద్ దివంగత పైడికొండల మాణిక్యాలరావుకి పార్టీ ఆఫీస్లో కాకుండా తన స్వంత కార్యాలయంలో నివాళులు అర్పించారు. జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని ఒక రోజు గడిచిపోయాక గజపతినగరంలోని తన స్వగృహంలో పైడికొండల మాణిక్యాల రావుకి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పట్టుమని పది మంది కూడా లేరు. పది మంది సంగతి దేవుడెరుగు.. కనీసం అదే నియోజకవర్గంలో ఉండే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దేవర ఈశ్వరరావు సహా పార్టీకి చెందిన వాళ్ళెవరూ లేరు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణ పనుల శంఖుస్థాపన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలు కూడా ఇలాగే జరిగాయి.
బవిరెడ్డి రామతీర్థంలోను, రెడ్డి పావని తన గృహంలోనూ తమ తమ వందిమాగధులతో కార్యక్రమాలు నిర్వహించారు. పాకలపాటి సన్యాసిరాజు ఇవేమీ పట్టనట్టు పూర్వాశ్రమంలో జరిగిన సంఘటనలు, సన్నివేశాలను అనుసరిస్తూ పార్టీ హై కమాండ్ ఆదేశించిన ప్రకారం భవన నిర్మాణ పనుల్లో మునిగిపోయారు. వీళ్ళంతా పార్టీ కార్యాలయంలో కాకుండా ఎవరికి వాళ్ళుగా తమ తమ ఇళ్ళల్లోనో, ఆఫీసుల్లోనో కార్యక్రమాలు ఎందుకు నిర్వహిస్తున్నారో, పార్టీ కార్యాలయం అసలు ఎవడి కోసం ఎందుకు కట్టారో ఎవడికీ అర్ధం కావడం లేదు. ఏమైనా అంటే కరోనా అంటున్నారు.
సునీల్ దియోధర్ జిల్లాకి వచ్చినప్పుడు పార్టీ కార్యాలయం తెరిచారు. అక్కడే మీటింగ్ పెట్టారు. అప్పుడు రాని కరోనా, జిల్లా కేంద్రంలోని పెద్దలకు రాఖీ కట్టినప్పుడు రాలేని కరోనా దివంగత మాణిక్యాల రావుకు నివాళి అర్పించేప్పుడు, అయోధ్య కార్యక్రమానికి సంఘీభావం ప్రకటించేప్పుడు మాత్రమే వస్తుందా, వచ్చేస్తుందా? తగిన జాగ్రత్తలతో కార్యక్రమాలు చేసి ఉండొచ్చు కదా? ఇలాంటి వాటన్నింటినీ బలపరుస్తూ కోట జంక్షన్ లో ఓ ఫ్లెక్సీ వెలిసింది. దీనిలో జాతీయ నేతల ఫోటోలు పెట్టారు గానీ కనీసం ప్రోటోకాల్ కోసమైనా జిల్లాకు చెందిన ఓ ఇద్దరు ఫొటోలు ఓ మూలైనా పెట్టలేదు.
జిల్లాలో బీజేపీ పరిస్థితిని పరిశీలిస్తే సాధారణ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలుపుకునే స్థాయి కూడా లేదు. దీనంతటీకీ జిల్లా పార్టీ సీనియర్ల పోకడే కారణమని కార్యకర్తలు వాపోతున్నారు. అలానే ఎవరికి వారుగా ఒకరిపై ఒకరు రాష్ట్ర అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకుంటున్నారు. అధిష్టానం కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో తమ గోడు ఎవరికి వెళ్లబుచ్చుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో జిల్లా కేడర్ కొట్టుమిట్టాడుతోంది. ఇలా గ్రూపు తగాదాలతో కొట్టుకుంటున్న పార్టీ నాయకులతోనే.. సోము వీర్రాజు తాను డాంబికంగా ప్రకటిస్తున్నట్టుగా.. పార్టీని 2024లో అధికారంలోకి ఎలా తీసుకువస్తారో తెలియని సంగతి.