( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించిన తర్వాత నగరంలో వెలిసిన అక్రమ నిర్మాణాలు సంఖ్య సుమారు 4 వేలు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సుమారు యాభై రోజుల పాటు నిర్వహించిన సర్వేలో వెల్లడైన నిజం ఇది. మరి జీవీఎంసీ అధికారులు గత నెలన్నర వ్యవధిలో కూల్చిన అక్రమ నిర్మాణాల సంఖ్య ఎంతో తెలుసా? ముచ్చటగా మూడు. ఆ మూడు కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులవే.
కొత్త వాటిని వదిలేసి..
రాష్ట్ర రాజధానిగా వెలుగొందుతున్న విశాఖలో అధికారుల పనితీరుకు ఇంతకన్నా కారణాలు గొప్పగా చెప్పలేం. చట్టాన్ని పరిరక్షించాల్సిన అధికారులు, ప్రభుత్వ నిబంధనలు తు. చ. తప్పకుండా అమలయ్యేలా చూడాల్సిన వ్యవస్థలు అధికార పార్టీ నేతలు, మంత్రుల చల్లని చూపు కోసం తహతహలాడిపోతున్నారు. నిన్న కాదు.. మొన్న చేపట్టిన అక్రమ నిర్మాణాలను వదిలేసి 20 ఏళ్లు.. పాతికేళ్ల క్రితం నిర్మించిన భవనాలను, ఆక్రమణలను తొలగించడంలో అత్యుత్సాహం చూపుతున్నారు. “మేడం యు డన్ ఏ గుడ్ జాబ్”… “సార్ యు ఆర్ ఎస్టీమ్లీ గుడ్” లాంటి మొప్పులు వైఎస్సార్ సిపి నేతల నుంచి పొందేందుకు పగలు, రాత్రి నిద్రాహారాలు మాని బూజుపట్టిన రికార్డులను దులిపి, తమకు వచ్చిన ఎలర్జీలను సైతం పక్కన పెట్టి విపక్ష నేతల నిర్మాణాలపై విరుచుకు పడుతున్నారు.
అన్ని టీడీపీ నేతల ఆస్తులే..
కొద్ది రోజుల క్రితం మాజీ మేయర్, అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి ప్రభుత్వ భూమిని ఆక్రమించారంటూ కొన్ని తొలగింపులు చేశారు. అంతకు ముందు అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ ఇంటి ప్రహరీ కూల్చేందుకు ప్రయత్నం చేశారు. పాతికేళ్ళ క్రితం ఆయన ఆక్రమించారని తాజాగా చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు నియోజకవర్గంలోని ఫుట్ పాత్ ఆక్రమణల పేరిట టీడీపీ అనుకూల వర్గానికి చెందిన దుకాణాలను అడ్డగోలుగా తొలగించారు. తాజాగా గీతం డీమ్డ్ వర్సిటీ నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా తొలగించారు.
కోర్టు ఆదేశాలు ఉన్నా..
కోర్టు సెలవు రోజుల్లో, అర్థరాత్రి, తెల్లవారు జామున టీడీపీ నేతల ఆస్తులపై అధికారులు చట్టంలోని సెక్షన్లు అన్నింటినీ వర్తింప జేస్తున్నారు. కక్ష పూరితంగా, అధికార పార్టీ నేతల మెప్పు కోసం చేపడుతున్న తొలగింపులను నిలువరించడం తమ వల్ల కాక బాధితులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. అయినప్పటికీ అధికారులు తమ పంతం నెగ్గించుకునే ప్రక్రియలో కోర్టు స్టే లు విధించినా తొలగింపునకు నోటీసులు జారీ చేస్తున్నారు. సబ్బం హరి నిర్మాణాల తొలగింపుపై కోర్టు స్టే ఉన్నప్పటికీ తాజాగా ఆయన ఇంటి గోడపై జీవీఎంసీ నోటీసు అతికించింది. మూడు రోజుల్లోగా ఆక్రమించిన స్థలంలో నిర్మాణాలు స్వచ్ఛందంగా తొలగించుకోవాలి అన్నది నోటీసు సారాంశం.
వైసీపీ నేతల ఆక్రమణల చిట్టా చెప్పమంటారా?
టీడీపీ నేతల ఆస్తులపై వరుసగా చేస్తున్న దాడులపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు మండిపడ్డారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసులకు, దాడులకు భయపడబోమని స్పష్టం చేశారు. “ మీకు టీడీపీ నేతల ఆక్రమణలు మాత్రమే కనిపిస్తున్నాయా? వైసీపీ నేతల చిట్టా విప్పమంటారా?” అని ప్రశ్నించినా వైసీపీ నేతల నుంచి సమాధానం రాలేదు.
విశాఖలో కొనసాగేందుకే..
పరిపాలన రాజధాని విశాఖలో అధికారులుగా కొనసాగేందుకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఊడిగం చేస్తున్నారు. వారి మెప్పు కోసమే ఈ పనులన్నీ చేస్తున్నట్టు ప్రజలందరికీ స్పష్టమైంది. విశాఖ నుంచి బదిలీ కాకుండా ఇక్కడే కలకాలం కొనసాగేందుకు చేస్తున్న ఫీట్లలో ఇవి కూడా ఒకటి.