దుర్బర పరిస్థితులు ఎదురుకుంటూ కష్టాలు పడుతున్న రైతులకు అండగా నిలిచేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ మంచి ఉద్దేశంతో ‘ఉచిత విద్యుత్’ పథకాన్ని ప్రకటించాడు. 2004 మే 14 సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రోజే తొలి సంతకంగా ‘ఉచిత విద్యుత్’ ఫైలుపై సంతకం పెట్టారు. రాష్ట్ర విభజన జరిగినా వైఎస్ఆర్ తీసుకువచ్చిన ఈ పథకం రైతులకు సంజీవనిగా పని చేస్తుంది. కానీ తాజాగా కేంద్రం తీసుకున్న ఓ నిర్ణయం రైతులకు శాపంగా మారింది. పథకాలకు అకౌంటబిలిటీ ఉండాలనే ఉద్దేశంతో ఉచిత విద్యుత్ కనెక్షన్లకు మీటర్లను బిగించాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. ఈ మీటర్లను ఏర్పాటు చేస్తే అందుకు ప్రతిగా డబ్బులు ఇస్తామని కేంద్రం చెప్పింది. కేంద్రం తెచ్చిన ఈ విధానాన్ని తెలంగాణ రాష్ట్రంతో బాటు చాలా రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఏపీ సీఎం జగన్ మాత్రం కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆమోదం తెలిపారు.
జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై విపక్షాల నుంచి తీవ్రమైన విమర్శలు ఎదురయ్యాయి. వైఎస్ఆర్ అమలు చేసిన ఉచిత విద్యుత్ పథకానికి ఈ నిర్ణయం తిలోదకాలు ఇస్తుందని నిరసనలు తెలియచేశారు. రైతుల నుంచి కూడా ప్రతిఘటన ఎదురుకావడంతో ప్రభుత్వం తరుపున మంత్రులు బాలినేని. పేర్ని నాని, కన్నబాబు సలహదారు అజేయ కల్లం భరోసా ఇచ్చారు. కేంద్రం ఆదేశాలతో ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయవలసి వచ్చిందని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ మేరకు రైతులకు కొత్త అకౌంట్స్ ఓపెన్ చేయించాలని బ్యాంకర్లకు కూడా ప్రభుత్వం సూచించింది. ఇంత ప్రతికూలతలు ఎదురైనా జగన్ కేంద్ర నిర్ణయానికి మద్దతు తెలుపుతుండటంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
సీక్రెట్ చెప్పిన హరీష్ రావు
ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు అసలు సీక్రెట్ బయటపెట్టేశారు. ఉప ఎన్నికల ప్రచారానికి దుబ్బాక వచ్చిన ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఉచిత విద్యుత్ మీటర్లపై ఎదురైన ప్రశ్నకు ఆయన ఇంట్రస్టింగ్ నిజాన్ని తెలియచేశారు. ప్రతి కనెక్షన్ కు మీటర్ బిగిస్తే తెలంగాణకు 2500 కోట్లు, ఏపీకి 4000 కోట్లు ఇస్తామని కేంద్రం ఆఫర్ ఇచ్చినట్లు హరీష్ రావు తెలిపారు. రైతులకు నష్టం కలిగించే నిర్ణయాన్ని తమ ప్రభుత్వం తీసుకోదని అందుకే ఆఫర్ కు నో చెప్పామని స్పష్టం చేశారు. అయితే ఏపీ మాత్రం ఈ ఆఫర్ ను స్వీకరించి అమలు చేస్తోందని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఏపీ సర్కార్ ది అత్యుత్సాహం అని అన్నారు.
నెటిజన్స్ కామెంట్స్
హరీష్ రావు చెప్పిన ఈ విషయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. తన తండ్రి ఆశయాలకు వ్యతిరేకంగా జగన్ నడుచుకుంటున్నాడని కామెంట్స్ పడుతున్నాయి. 4000 కోట్లకు ఆశపడి ఉచిత విద్యుత్ పథకానికి జగన్ మంగళం పాడినట్లే అంటూ ట్రోలింగ్ జరుగుతూ ఉంది. దీంతో వైసీపీ అభిమానులు కూడా ఎదురుదాడి చేస్తూ కామెంట్ చేస్తున్నారు. ప్రీ పెయిడ్ అకౌంట్ ద్వారా ప్రభుత్వం రైతులకు ముందే డబ్బులు ఇస్తుందని ఉచిత విద్యుత్ కొనసాగుతోందని కామెంట్ చేస్తున్నారు. మొత్తం మీద హరీష్ రావు చెప్పిన ఈ నిజం రాష్ట్ర రాజకీయాలలో వేడిని రాజేశాయి.










