దుబ్బాక ఉప ఎన్నికల్లో హోరాహోరీ పోరు సాగుతోంది. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఇక పార్టీలన్నీ తమ అభ్యర్థి గెలుపుకోసం సమస్తశక్తులు ఒడ్డుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాక ముందు నుంచే పార్టీలన్నీ దుబ్బాకలో ఊరూరా తమ ప్రచారాన్ని మొదలు పెట్టాయి. ఇక నామినేషన్ సందర్భంగా తమ బలాన్ని ప్రదర్శించాయి పార్టీలు. నామినేషన్ల దాఖలు, స్క్రూటినీ, ఉపసంహరణ ప్రక్రియ పూర్తి కావడంతో ప్రచారంలో మరింత హీట్ పెంచాయి.
రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలు ప్రజలకు చేస్తున్న సంక్షేమ పథకాలే ప్రధాన ప్రచారాస్త్రంగా టీఆర్ఎస్ బీజేపీలు ప్రజల వద్దకు వెళ్తున్నాయి. ఇక ప్రచార కార్యక్రమాల్లో భాగంగా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు నేతలు.
టీఆర్ఎస్ పార్టీని ఒంటి చేత్తో నడిపిస్తున్నారు మంత్రి హరీష్ రావ్. ముఖ్యమంత్రి కేసీఆర్ , కేటీఆర్ లు ఇటువైపే చూడటం లేదు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యనేతలంతా ఎక్కడిక్కడ సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో బిజీ అయిపోయారు. దీంతో దుబ్బాక ఎన్నికల భారం మొత్తం హరీష్ తన భుజాల పై వేసుకున్నారు.
మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ బలగాలను పూర్తిగా దుబ్బాకలోనే ఉంచి ప్రచారం హోరెత్తిస్తున్నారు. టీఆర్ఎస్ టార్గెట్గా ప్రజల్లో ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా బీజేపీ, కేంద్ర ప్రభుత్వం అబద్దాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నాయని.. విద్యుత్ మీటర్లను బిగించి రైతులను ఇబ్బదులకు గురిచేసేందుకు చూస్తోందని హరీష్ రావ్ ప్రచారం చేస్తున్నారు. అయితే బీజేపీ నేతలు మండలానికో ఇన్చార్జ్ ను నియమించి టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రజల్లో ప్రచారం చేయిస్తోంది. దీంతో ఇరుజాతీయ పార్టీలను సమర్దవంతంగా ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నారు హరీష్ రావు.
హరీష్ కొత్త సవాల్
తాజాగా బీజేపీకి ఘాటైన సవాల్ విసిరారు హరీష్ రావు. బీడీ కార్మికులకు ఇచ్చే పెన్షన్ లలో 1600 కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చారు హరీష్ . అన్నీ అబద్దాలు చెబుతు ప్రజలను మోసం చేసేందుకు బీజేపీ నేతలు యత్నిస్తున్నారంటూ ఘాటుగా స్పందించారు. ఇక ఎక్కడో జరిగిన ఘటనలను సైతం ఇక్కడ ప్రచారం చేస్తూ ప్రజలను గందర గోళానికి గురిచేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు.
ప్రజలు ఇక్కడికి వచ్చి పోయే వారి మాటలు నమ్మి ఆయా పార్టీలను గెలిపిస్తే చేసేదేమీ లేదని.. టీఆర్ఎస్ పార్టీనే ప్రజలకు అండగా ఉండేదంటూ ప్రచారం చేస్తున్నారు. హరీష్రావు ఒంటి చేత్తో ఉప ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుండటం.. ఇతర పార్టీల ప్రధాన నేతలంతా అక్కడే ఉండి ప్రచారం చేస్తుండటంతో ఈ పోరులో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఉన్న టీఆర్ఎస్ ను ప్రజలు మరోసారి ఆదరిస్తారా.. టీఆర్ఎస్పై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న వార్తల నేపథ్యంలో మరో పార్టీని గెలిపిస్తారో చూడాలి.