ఏపీలో రోజు రోజుకు కరోనా రోగులు పెరిగిపోతూ ఉండటంతో జనంలో భయాందోళనలు మొదలయ్యాయి.వ్యాక్సిన్ వేయించుకుందామన్నా దొరకని పరిస్థితి నెలకొంది.అందుకే కరోనా తగ్గించేందుకు ఎలాంటి అవకాశం ఉన్నా జనం వదులుకోవడం లేదు.తాజాగా నెల్లూరు జిల్లాలో కరోనా రాకుండా,కరోనా వచ్చిన వారికి తగ్గించేందుకు ఆనంద్ అనే వ్యక్తి పెద్ద ఎత్తున ఆయుర్వేద మందులను ఉచితంగా పంపిణీ ప్రారంభించాడు.వివరాల్లోకి వెళితే…. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆనంద్ కరోనా రోగం తగ్గించడానికి అంటూ ఆయుర్వేద మందులను ఉచితంగా పంపిణీ మొదలు పెట్టాడు.మూడు రకాల మందులు తయారు చేస్తున్నాడు.కరోనా వచ్చిన వారికి తిప్పతీగతో వైద్యం చేస్తున్నాడు.ఇక కరోనా సోకకుండా వన మూలికలతో మందులు తయారు చేసి ఉచితంగా పంపిణీ ప్రారంభించారు.కరోనా పాజిటివ్ వచ్చిన వారు కూడా ఈ మందులు వాడితే ఐదు రోజుల్లో నెగటివ్ వస్తోందని చెబుతున్నారు.దీంతో నెల్లూరు జిల్లావారే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా కార్లు వేసుకుని మరీ పెద్ద ఎత్తున జనం తరలివస్తున్నారు.
నిజమెంత..?
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో పంపిణీ చేస్తున్న ఆయుర్వేద మందుల్లో శాస్త్రీయత ఎంత ఉందో తేలాల్సి ఉంది.జనం వేలంవెర్రిగా ఎగబడుతున్నారా? నిజంగానే కరోనా తగ్గుతోందా? అనేది పరిశీలించాలని జనం కోరుతున్నారు.ఆయుర్వేద మందులకు కరోనా తగ్గితే… పెద్ద ఎత్తున మందులు తయారు చేసుకోవచ్చని వారు సలహా ఇస్తున్నారు.అయితే కరోనా మందుల కోసం వచ్చే వారు పెద్ద ఎత్తున క్యూలైన్లలో సామాజిక దూరం పాటించకుండా తోసుకోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
Must Read ;- ఖ్యాతి కోసం పాకులాట.. వ్యాక్సిన్లపై అసలు విషయం వెల్లడించిన ‘నీతి’