దేశంలో ఓవైపు కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని చెబుతున్నా భారీగానే కొత్త కేసులు నమోదు అవుతున్నాయి.మరోవైపు వ్యాక్సిన్ కొరత కూడా ఆందోళనకు గురి చేస్తోంది.ఈ తరుణంలో తెలంగాణ,ఏపీలు తాము సొంతంగా వ్యాక్సిన్ల సేకరణకు సిద్ధమని ప్రకటించాయి.గ్లోబల్ టెండర్ల ప్రక్రియను మొదలు పెడుతున్నట్టు చెప్పాయి. ఏపీలో కోవిషీల్డ్,కొవాగ్జిన్ రెండూ కలిపి కేంద్రం ఇవ్వాల్సినవి,రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి కొనుగోలు చేయాల్సిన 11.9లక్షల వ్యాక్సిన్లు ఇంకా రావాల్సి ఉంది.ఇక తెలంగాణలో కొన్ని రోజుల క్రితం మొదటి డోసు వ్యాక్సిన్ను తత్కాలికంగా నిలిపివేసి రెండో డోసుకు ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది.అయితే రెండో డోసు కొవాగ్జిన్ కొరత కారణంగా శని, ఆదివారాల్లో ఆ వ్యాక్సిన్లు నిలిపి వేశారు.ఆ వ్యాక్సిన్ల లభ్యతను బట్టి మళ్లీ ఎప్పుడు వేస్తామనే తేదీలు ప్రకటిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.ఈ రెండురాష్ట్రాల్లోనే కాదు..దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ల కొరత నెలకొన్నందున కేంద్రంపై విమర్శలు పెరిగాయి.అదే సమయంలో ఏపీ ప్రభుత్వం నుంచి వస్తున్న స్పందనలపై జాతీయస్థాయిలో చర్చ నడుస్తోంది.వెరసి అధికార పార్టీపై సోషల్ మీడియాలో సెటైర్లు నడుస్తున్నాయి.
ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ట్వీట్పై..
కొన్నాళ్ల క్రితం ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ (ఝార్ఖండ్ ముక్తి మోర్చా) మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్వీట్ చేశారు.ఈ ట్వీట్ పై ఏపీ సీఎం జగన్ స్పందిస్తూ ‘మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. దేశంలో ఎన్ని విభేదాలున్నా ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేవడం తగదు.అందరం ఐక్యంగా కోవిడ్పై పోరాడాలి.విమర్శల కారణంగా జాతి బలహీనం అవుతుంది’ అని ట్వీట్ చేశారు.దీంతో జేఎంఎం ఘాటుగా స్పందించింది.మీ నిస్సహాయత గురించి దేశమంతా తెలుసు అని,మీరు ఎల్లకాలం సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నామని ట్వీట్ చేయడంతో పాటు జగన్ బెయిల్ రద్దుకు పిటిషన్ దాఖలైన వార్తకు సంబంధించిన న్యూస్ను కూడా ట్యాగ్ చేసింది.ఆ అంశం అక్కడితో అయిపోయినా ఏపీలో చర్చ నడిచింది.ప్రతిపక్ష పార్టీలు ఈ ట్వీట్లను రీట్వీట్ చేశాయి.
తాజాగా మరో అంశంపై..
ఇక తాజాగా మరో అంశంపైనా చర్చ నడుస్తోంది.ఏపీకి వ్యాక్సిన్లు తీసుకొచ్చే విషయంలో వైసీపీ ప్రభుత్వం చొరవ చూపిందని,ఏపీ సీఎం జగన్ రాసిన లేఖలతోనే కేంద్ర స్పందించిందని,వెరసి దేశ వ్యాప్తంగా వైఎస్ జగన్ తీసుకున్న చొరవ ప్రశంసిస్తున్నారని అధికార వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో హడావుడి చేశారు.అయితే వారం వ్యవధిలో రెండుసార్లు ఈ అంశంపై నీతి ఆయోగ్ స్పష్టత ఇచ్చింది.వ్యాక్సిన్ల సేకరణ అంశంపై కేంద్రం ముందు నుంచే కార్యాచరణ మొదలు పెట్టిందని,ధిల్లీ, ఏపీలు అడిగితేనే ఈ కార్యాచరణ మొదలు పెట్టలేదని వ్యాఖ్యానించింది.ఎవరో చెప్పడంవల్లే కొవాగ్జిన్ తయారీకి ఒప్పందాలు జరిగినట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని,నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ వ్యాఖ్యానించారు.రాష్ట్రాలు చెప్పినంత మాత్రాన,అడిగినంత మాత్రాన సాంకేతిక పరిజ్ఞానం అంత సులువుగా బదిలీకాదని,ఇందుకు 70-75 రోజులు పడుతుందని వ్యాఖ్యానించారు.తాము ఈ కార్యాచరణను ఎప్పటి నుంచో మొదలు పెట్టామని,ఆ కార్యాచరణతోనే పలు ప్రభుత్వరంగ సంస్థలతో భారత్ బయోటెక్ ఒప్పందం చేసుకుందని వ్యాఖ్యానించారు.ఆ ఒప్పందం జరిగాకే తాము మూడు ప్రభుత్వ రంగ సంస్థలకు నిధులు కేటాయించామని వ్యాఖ్యానించారు.నెల కిందటే ఈ ప్రక్రియ పూర్తయి బిబ్కోల్, ఐఐఎల్, హాఫ్కిన్ సంస్థల్లో కోవాగ్జిన్ ఉత్పత్తి మొదలైందన్నారు.దీంతోపాటు అన్ని వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలు భారత ప్రభుత్వాన్ని భాగస్వామిగా భావించి సానుకూలంగా ఉన్నాయని,ఇలాంటి సంస్థలు,శాస్త్రవేత్తల నైతిక స్థైర్యం దెబ్బతీసేలా వ్యవహరించడం మంచిది కాదు అని వ్యాఖ్యానించారు.భారత్ బయోటెక్ బెంగళూరు యూనిట్లో ఉత్పత్తి ప్రారంభించేందుకు రూ.65 కోట్లు, ముంబైలోని మహారాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘హాఫ్కిన్ బయో ఫార్మాస్యూటికల్’కు రూ.65 కోట్లు,హైదరాబాద్లోని ఇండియన్ ఇమ్యూనలాజికల్స్ లిమిటెడ్కు రూ.60 కోట్లు,ఉత్తర్ప్రదేశ్లోని బులంద్షహర్లోని భారత్ ఇమ్యూనలాజికల్స్ అండ్ బయోలాజికల్స్ లిమిటెడ్కు రూ.30 కోట్లు ఇచ్చామని వెల్లడించారు.అంతేకాకుండా తమ ప్రభుత్వానికి కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి రేణూస్వరూప్ (బయోటెక్నాలజీ)నుంచి లేఖ వచ్చిన విషయాన్ని మహారాష్ట్ర సీఎం ఏప్రిల్ 16న వెల్లడించిన అంశాన్ని కూడా కొందరు సోషల్ మీడియాలో ప్రస్తావిస్తున్నారు.
ఏప్రిల్ 15నే ఒప్పందాలు..
కాగా కొవాగ్జిన్ టెక్నాలజీని ఇతర సంస్థలకు బదిలీచేస్తే గత 11వ తేదీన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారని, అందుకే కేంద్ర స్పందించిందని వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో, మీడియాలో ప్రచారం చేయడంతో ఇంత చర్చ నడుస్తోంది. వాస్తవానికి ఏప్రిల్ 15నే ఒప్పందాలు జరిగిందని మీడియాలో వచ్చిన వార్తలను మరికొందరు ట్వీట్ చేస్తున్నారు.ఇక్కడే మరో అంశంకూడా ఉంది.కొవాగ్జిన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్ అధినేత సామాజికవర్గాన్ని ప్రస్తావిస్తూ ఏపీ ప్రతిపక్ష నేతతోపాటు మరికొందరికి బంధుత్వం ఉందని చెబుతూ వైసీపీ నేతలు కొన్నాళ్ల క్రితం పలు వ్యాఖ్యలు చేశారు.ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు తన బంధువులతో మాట్లాడి వ్యాక్సిన్లు తెప్పించాలని కూడా వ్యాఖ్యానించారు.ఈ పరిణామాల నేపథ్యంలో నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.భారత్ బయోటెక్కు వ్యతిరేకంగా ఏపీలో వైసీపీ చేస్తున్న ప్రచారానికి పరోక్షంగా కౌంటర్ ఇచ్చినట్టుకూడా సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
Must Read ;- నేను వ్యాక్సిన్ తెప్పిస్తే సీఎంగా మీరెందుకు : చంద్రబాబు











