(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న ఏపీ ప్రభుత్వానికి కోర్టులో వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నా ప్రభుత్వ పెద్దల తీరులో మార్పు రావడం లేదు.తాజాగా సింహాచలం ట్రస్టు బోర్డు సభ్యురాలి నియామకంపై కూడా ఏపీ సర్కారుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
ఒకరిని తొలగించి మరొకరి నియామకం..
సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ ఆళ్ల భాగ్యలక్ష్మి నియామకంపై ప్రభుత్వ జీవోను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది.గతంలో నియమించిన దాడి దేవిని తొలగించడం చట్టవిరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది పూర్తి వాదనలు వినిపించారు.వాదనలు విన్న న్యాయస్థానం భాగ్యలక్ష్మి నియామకాన్ని సస్పెండ్ చేసింది. ఎనిమిది వారాల పాటు నియామకాన్ని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి వరకు దాడి దేవిని కొనసాగించాలని,కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని అంటూ..
సింహాచలం ట్రస్టు బోర్డు ఏర్పాటులో నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయింది.“ ఇష్టానుసారంగా సభ్యులను నియమిస్తున్నారు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.వీటిపై కూడా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ అడ్వేకేట్ జనరల్ను హైకోర్టు ఆదేశించింది.
శనివారం కొత్తగా నియామకం..
సింహాచలం దేవస్థానం పాలకమండలిలో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.వాణీమోహన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.గత ఏడాది ఫిబ్రవరిలో నియమించిన పాలక మండలిలో సభ్యురాలైన విజయవాడకు చెందిన దాడి దేవిని తొలగించారు.ఆమె స్థానంలో విశాఖ నగరానికి చెందిన ఆళ్ల భాగ్యలక్ష్మీని నియమిస్తూ జీవో 255ను విడుదల చేశారు.భాగ్యలక్ష్మీ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని దేవాదాయశాఖ ప్రత్యేక కమిషనర్కు ఉత్తర్వులు జారీ చేశారు. పాలకమండలికి మిగిలిన ఉన్న గడువు మేరకు ఆమె ట్రస్టీగా కొనసాగనున్నారు. కాగా దాడి దేవి తొలగింపునకు కారణాలను జీవోలో పేర్కొనలేదు.అక్కడ జిల్లా మంత్రితో విభేదాలే కారణమని ప్రచారం జరిగింది. విజయవాడకు చెందిన దాడి దేవి భర్త దాడి జగన్ అక్కడ నగర వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు.ఆ నేపథ్యంలోనే దేవికి బీసీ కోటాలో సింహాచలం దేవస్థానం ట్రస్టుబోర్డులో స్థానం లభించింది. దాడి జగన్కు, ఓ మంత్రికి మధ్య ఉన్న విభేదాలే ట్రస్టుబోర్డు నుంచి దేవి తొలగింపునకు కారణమని ప్రచారం జరుగుతోంది.ఇటీవల అప్పన్నస్వామి పూలతోట అభివృద్ధి పనుల్లో దాడి దేవి, జగన్ దంపతులు చురుగ్గా పాల్గొన్నారు.మొక్కల పంపెకంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి తమవంతు సహకారం అందించారు. అనూహ్యంగా ఆమెను ట్రస్టీగా తొలగించడం దేవస్థానంలో చర్చనీయాంశమైంది. కొత్తగా నియమించిన భాగ్యలక్ష్మీ, తొలగింపునకు గురైన దాడి దేవి ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం.కాగా సోమవారం ఆళ్ల భాగ్యలక్ష్మీ దేవస్థానంలో ప్రమాణ స్వీకారం చేశారు.అనంతరం జిల్లా ప్రముఖులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.అయితే భాగ్యలక్ష్మి భర్త మద్యం వ్యాపారి కావడంపై భక్తుల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. ఈ వ్యవహారం రానున్న రోజుల్లో మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
చైర్మన్ నియామకం ఇలాగే..
ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అశోక్ గజపతిరాజును అర్థంతరంగా తొలగించి సంచైత గజపతిరాజును చైర్ పర్సన్గా నియమించిన విషయం తెలిసిందే.ఈ వ్యవహారంపై హైకోర్టులో వివాదం నడుస్తోంది.ప్రస్తుతం హైకోర్టు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే చైర్ పర్సన్ నియామకం పైన కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అకారణంగా ఎందుకు తొలగించావు జగనన్న
సింహాచలం దేవస్థానంలో పాలక మండలి సభ్యురాలు పదవి నుంచి నన్ను ఎందుకు తొలగించారు చెప్పండి జగనన్న…? అంటూ విజయవాడకు చెందిన దాడి దేవి సీఎం జగన్ మోహన్రెడ్డిని ప్రశ్నించారు.ఈ మేరకు ఆమె ఒక వీడియో విడుదల చేశారు. వైసీపీ బలోపేతానికి శ్రమించిన తన భర్త దాడి జగన్ సేవలను గుర్తించి అడగకుండానే తనను 2020 మార్చి నెలలో సింహాచలం దేవస్థానం పాలక మండలి సభ్యురాలుగా నియమించారని పేర్కొన్నారు. పదవీకాలం రెండేళ్లు.ఇంకా పది నెలల సమయం ఉండగానే ఇప్పుడు ఎందుకు తొలగించారో చెప్పాలన్నారు.తొలగిస్తున్నట్టు వ్యక్తిగతంగా ఎటువంటి సమాచారం లేదని, ఇటు దేవాదాయ శాఖ నుంచి గాని, అటు దేవస్థానం నుంచి గాని ఎటువంటి సమాచారం లేకుండా తొలగించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఈ చర్యతో తాను మనస్తాపానికి గురయ్యానని దేవి పేర్కొన్నారు. భర్త కరోనాతో పోరాడుతూ ఉండగా ఒక మహిళ పట్ల ఇలా ప్రవర్తించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. గృహిణిగా ఉండే తాను కోరకుండానే పదవి ఇచ్చారని, అప్పన్న సేవ చేసుకుంటున్నామని, ఇద్దరు కుమార్తెలను ఇంట్లో వదిలి, స్వామి సేవ చేసుకుంటున్న సమయంలో ఇలా చేయడం వల్ల తన కుటుంబంపై మంత్రి కక్ష సాధించడం కాక మరి ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషయంపై ముఖ్యమంత్రి దృష్టి సారించాలని కోరారు.











