గుజరాత్ కు చెందిన గితేలి ఇమ్రాన్ (37 సంవత్సరాలు), గూఢచర్యం కార్యకలాపాలలో పాల్గొన్నందుకు, పాక్ ఐఎస్ఐ కోసం పనిచేసినందుకు అధికారిక రహస్యాలు చట్టం కింద అరెస్టు అయింది. పాకిస్తాన్ కు చెందిన గూఢచారులు భారత నావికాదళ ఓడలు, జలాంతర్గాములు, ఇతర రక్షణ సంస్థల స్థానాలు / కదలికలకు సంబంధించి సున్నితమైన సమాచారాన్ని సేకరించడానికి భారతదేశంలో ఏజెంట్లను నియమించారు. ఫేస్బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా కొద్దిమంది నావికాదళ సిబ్బంది పాకిస్తాన్ ఏజెంట్లతో సంప్రదింపులు జరిపినట్లు దర్యాప్తులో తేలింది.
విశాఖ నేవీ ఉద్యోగుల హనీట్రాప్ ఎపిసోడ్లో ఎప్పటికప్పుడు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశ రహస్యాలను చెప్పినందుకు ఏజెంట్ల ద్వారా బ్యాంకు ఖాతాలను బాగా నింపి నట్లు విచారణలో తేలింది. మరి ఆ ముడుపులు ఏ రూపంలో ఇచ్చారు…ఉద్యోగులను మగువ.. మనీతో ఎలా తమ ముగ్గులోకి దింపగలిగారు ? విషయాలను ఎన్ఐఏ ఒక్కొక్కటిగా వెలికి తీస్తోంది.
పాకిస్తాన్ భారత్ రహస్యాలను తెలుసుకునేందుకు నేవీ ఉద్యోగులను తమ ఉచ్చులో వేసుకుంది. కానీ అనుభవజ్ఞులైన ఆఫీసర్స్ జోలికి వెళితే వ్యవహారం బెడిసికొట్టే ప్రమాదం ఉంద నే ఆలోచనతో.. నేవీలో కొత్తగా చేరిన వారిపై వలపు వల విసరడం ప్రారంభించింది. అందరూ పాతికేళ్ల లోపు యువకులే కావడంతో తమ పని ఈజీగా అవుతుందని పాక్ ఊహించింది..అనుకున్నట్లే చేసింది. తన ప్లాన్ను అమలు చేసింది..ఎప్పటికప్పుడు నేవీ కదలికలకు సంబంధించిన సమాచారం తమకు అందేలా స్కెచ్ వేసింది. కానీ మన భద్రతా బలగాలు ఆదిలోనే పాక్ కుట్రలను గ్రహించి చెక్ పెట్టారు. హనీట్రాప్ ఉచ్చులో చిక్కుకున్నవారిని అదుపులోకి తీసుకుని విచారించారు.
మన దేశ భద్రతా రహస్యాలను చేరవేసినందుకు ఉద్యోగులకు పాక్ భారీగానే ముట్టజెప్పినట్లు సమాచారం . ఇందుకు నేవీ ఉద్యోగుల వేతన ఖాతాలు, వారి బంధువులు, సన్నిహితుల బ్యాంకు ఖాతాల్లో ఎప్పటికప్పుడు పెద్ద ఎత్తున నిధులు జమయ్యేవని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ఇందుకు ముంబైకి చెందిన హవాలా ఆపరేటర్లు ఇంతియాజ్ సయ్యద్, షేక్ సహిస్థాలు పాకిస్థాన్ హ్యాండ్లర్ల నుంచి వచ్చే ఆదేశాల మేరకు సంబంధిత నౌకాదళ ఉద్యోగుల ఖాతాల్లో ఈ సొమ్ములు వేసేవారని గుర్తించింది. ఉగ్రదాడుల సన్నాహాక కార్యక్రమాల్లో భాగస్వాములమవుతున్నామని నిందితులందరికీ తెలుసని నిగ్గు తేల్చింది.
ఈ నెల 18, 22 మధ్య ఎన్ఐఏ కస్టడీకి తీసుకుని విచారణ నిర్వహించిన సందర్భంలో ఈ కేసులో వారి ప్రమేయాన్ని, నేరపూరిత చర్యలను నిందితులే అంగీకరించినట్లు సమాచారం. నిందితులు ఫేస్బుక్, ఈ-మెయిల్ ఖాతాల ద్వారా పాక్కు చెందిన ఐఎస్ఐ ప్రతినిధులతో సంభాషణలు జరిపినట్లు ఎన్ఐఏ ఆధారాలు సేకరించింది.. సాంకేతిక నిపుణుల సాయంతో వారి ఖాతాల్లోకి లాగిన్ అయ్యి అందులోని సమాచారాన్ని విశ్లేషించింది. కొన్ని కీలక డాక్యుమెంట్లనూ డౌన్లోడ్ చేసుకుంది.
ఈ కేసులో ఇప్పటివరకూ 13 మంది నిందితులను ఎన్ఐఏ అరెస్టు చేసింది. వీరిలో ఇద్దరు హవాలా ఆపరేటర్లు, 11 మంది నౌకాదళ ఉద్యోగులున్నారు. వీరంతా పాతికేళ్లలోపు యువకులే. ఎన్ఐఏ అదుపులో ఏ1 అదాన్..ఇతను పాకిస్తాన్ నివాసి. ఐఎస్ఐ ఏజెంట్గా అనుమానిస్తున్నారు. ఏ2- ఇంతెజర్ సయ్యద్, ఏ6- స్వామికుమార్, ఏ7-అశోక్ కుమార్, ఏ8-సంజయ్కుమార్ డెగె, ఏ9-అశోక్ కుమార్, ఏ10-సంతోష్ సంజయ్ ఇకడే, ఏ11-సంజయ్ కుమార్, ఏ12- ఐకాస్ కుమార్, ఏ13- సోనుకుమార్, ఏ15-షేక్ సహిష్థ, ఏ16- అపర్ష్ సింగ్ రజ్వత్, ఏ17- కల్పవల్లి కొండబాబు, ఏ18- అవినాష్ సోనల్లు ఉన్నారు. వీరంతా వాట్సప్ ద్వారా యుద్ధనౌకలు, సబ్మెరైన్ల కదలికల సమాచారాన్ని, నౌకాదళ కార్యకలాపాల వివరాలను ఎప్పటికప్పుడు పాక్ నిఘా విభాగం అధికారులకు పంపించేవారని దర్యాప్తులో తేలింది. కీలక స్థావరాలకు సంబంధించిన చిత్రాలు, వీడియోలను పంపించినట్లు ఎన్ఐఏ గుర్తించింది.
ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరో వ్యక్తిని అరెస్ట్ చేయడంతో నిందితుల సంఖ్య 14కు చేరింది. 14 మంది నిందితులపై 15.06.2020 న చార్జిషీట్ దాఖలు చేశారు.సరిహద్దుల్లో వస్త్ర వ్యాపారం ముసుగులో సంచరిస్తున్న ఇమ్రాన్ ను అరెస్టు అరెస్టు చేయడంతో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
సోమవారం ఇమ్రాన్ గీతేలి ఇంట్లో నిర్వహించిన శోధనలో కొన్ని డిజిటల్ పరికరాలు , పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.











