గోల్కొండ కోటకు చరిత్ర పుటల్లో ఎంతో ప్రాముఖ్యత ఉంది. కాకతీయులు, కుతుబ్షాహీయులు, మహ్మదీయులు, బహమనీ సుల్తానులు.. ఇలా ఎంతో మంది రాజ వంశీయులు గోల్కొండ కోటను కేంద్రంగా చేసుకుని పాలించిన చరిత్ర ఆ కోటకు ఉంది. శతాబ్దాల చరిత్ర గల ఈ కోటకు బీటలు వారుతున్నాయి. ఈ కోట హైదరాబాద్కు ఒక ఐకాన్గా ఉంటూ వస్తుంది. నిత్యం వందలాది మంది పర్యాటకులు ఈ పురాతన కోటను సందర్శించేందుకు దేశ, విదేశాల నుంచి వస్తుంటారు. ఇంత ప్రాముఖ్యం, చరిత్ర ఉన్న ఈ కోట ప్రహరీ గోడ కుప్ప కూలింది.
అక్కడ ఆ కోట..ఇక్కడ ఈ కోట..
హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పురాతన కట్టడాలు వర్షానికి నానిపోయి వాటి కట్టడాలు కూలిపోతున్నాయి. జనగామ జిల్లా, రఘునాథపల్లి మండలంలోని ఖిలాషపురం గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న కోట ఉంది. రెండు రోజుల క్రితం ఈ కోట గోడ కూలి పక్కన ఉన్న ఇళ్లపై పడింది. దీంతో అక్కడికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెళ్లి కోటను పరిశీలించిన విషయం తెలిసిందే. ఈ కోటకు 400 ఏళ్ల చరిత్ర ఉంది. అలాగే గోల్కొండ కోట ప్రహరీ గోడ కూడా ఈ మధ్యనే కుప్పకూలింది. గోల్కొండ కోటలోని శ్రీజగదాంబ అమ్మవారి ఆలయం ముందున్న సుమారు 20 అడుగుల ఎత్తైనా గోడ కూలిపోయింది. వర్షాలు, కోవిడ్ నేపథ్యంలో కోటకు సందర్శకుల తాకిడి తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. కోటలోని మరికొన్ని నిర్మాణాలకు కూడా బీటలు వారుతున్నాయి.
మరమ్మతులు చేయాలి…
కోట డోడపైన ధ్వంసమైన కొన్ని బురుజులను పది నెలల క్రితమే పురావస్తుశాఖ అధికారులు మరమ్మతులు చేపట్టారు. కానీ ప్రహరీ కింద భాగంలో పగుళ్లు వచ్చినా పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈక్రమంలోనే గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆ గోడ నాని కుప్పకూలినట్లు తెలుస్తోంది. ఒక్క గోల్కొండ కోటే కాదు తెలంగాణ ప్రాంతంలోని చాలా కోటలు కొన్ని శిథిలావస్తకు చేరి బీటలు వారుతున్నాయి. దాంతో వాటి నిర్మాణాలు కూలే ప్రమాదం కూడా ఉందంటున్నారు. కాగా, చరిత్రకు ఆనవాలుగా ఉన్న గోల్కొండ కోటకు పగుళ్లు ఏర్పడ్డాయని దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి నెటిజన్లు స్పందిస్తున్నారు.
ఇప్పటికైనా శతాబ్దాల చరిత్ర గల కోటలను పరిరక్షించేందుకు అధికారులు నడుంబిగించి, అవి కాల గర్భంలో కలిసిపోకుండా వాటి చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలని ప్రజలు కోరుతున్నారు.