హైదరాబాద్ను వర్షం ఏమాత్రం వదలడంలేదు. ఏ సీజన్లో లేనంతగా ఈ సారి వర్షాలు హైదరాబాద్ను ముంచెత్తుతున్నాయి. మొన్న కురిసిన వర్షం నుంచి నగరవాసులు ఇంకా తేరుకోకముందే శనివారం రాత్రి భారీ వర్షం కురవడంతో జనం ఇబ్బందులు పడ్డారు. కాలనీల్లో వరద నీరు పోటెత్తింది. ఈ పరిస్థితులపైన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క టిఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
వర్షాలకు వెనిస్ నగరంలా హైదరాబాద్ కనిపిస్తోందని భట్టి విమర్శించారు. హైదరాబాద్ నగరాన్ని కేసిఆర్.. ఇస్తాంబుల్, డల్లాస్ నగరాలుగా అభివృద్ధి చేస్తామన్నారని తెలిపారు. కేటిఆర్ విశ్వనగరమన్నారు. మరీ ఏమైందని భట్టి ప్రశ్నించారు. టిఆర్ఎస్ పార్టీని దూరం పెట్టి నగరాన్ని కాపాడుకోవాలని ఆయన పేర్కొన్నారు. 72వేల కోట్ల అభివృద్ధి ఎటుపోయిందని ఆయన ప్రశ్నించారు.
కాంట్రాక్టర్ల లబ్దికోసమే..
పాలమూరు ప్రాజెక్టులో అండర్ గ్రౌండ్ పంప్ హౌజ్ నిర్మించొద్దని నిపుణుల కమిటీ తెల్పిందని, అండర్ గ్రౌండ్ పేలుళ్లతో కల్వకుర్తికి నష్టం జరుగుతుందని చెప్పారని భట్టి పేర్కొన్నారు. కంట్రాక్టర్లకు లబ్ది చేకూరడం కోసమే అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ నిర్మాణం చేపట్టారని మండిపడ్డారు. ఇరిగేషన్ శాఖను సర్వనాశనం చేస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టుల వద్దకు ప్రతిపక్షాలను ఎందుకు వెళ్లనీయడం లేదని, తాము తప్పకుండా వెళుతామని ఆయన ప్రశ్నించారు.