జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొని కొన్నాళ్లు జైలు శిక్ష తరువాత బయటపడిన ఐఏఎస్ అధికారిణి ఎర్ర శ్రీలక్ష్మి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రేసులోకి రానున్నారనే చర్చ మొదలైంది. గత మూడు నెలల్లో శ్రీలక్ష్మికి వరుసగా రెండో పదోన్నతి లభించింది. గతంలో వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో ఉమ్మడి ఏపీలో కమిషనర్ హోదాలో ఉన్న సమయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలపై ఆమె ఆరోపణలు ఎదుర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో క్విడ్ ప్రొ కో ఆరోపణలపై సీబీఐ విచారణ జరుగుతున్న తెలిసిందే. ఇదే కేసులో శ్రీలక్ష్మి ఆరోపణలు ఎదుర్కొని జైలుకి వెళ్లారు. తరువాత విడుదలయ్యారు. రాష్ట్ర విభజన తరువాత శ్రీలక్ష్మిని తెలంగాణకు కేటాయించారు. గత ఏడాది తెలంగాణ నుంచి ఏపీ కేడర్కు కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం శ్రీలక్ష్మిని పురపాలక శాఖ కార్యదర్శిగా నియమించారు. తరువాత కొంతకాలానికే శ్రీలక్ష్మికి పదోన్నతి లభించింది. కార్యదర్శి హోదాను ముఖ్య కార్యదర్శి హోదాకు పెంచుతూ గత జనవరి 18న ఉత్వర్తులు జారీ చేశారు. తాజాగా శ్రీలక్ష్మికి తత్కాలిక పదోన్నతి ఇస్తూ జగన్ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ పదోన్నతితో శ్రీలక్ష్మి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదా పొందారు. అయితే కోర్టు కేసులు ఉన్న నేపథ్యంలో తీర్పునకు లోబడి ఈ పదోన్నతులు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సీఎస్ రేసులోకి వచ్చేశారా..
కాగా ఈ పదోన్నతితో శ్రీలక్ష్మి 2024లోపే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యేందుకు అవకాశం ఉందని చర్చ నడుస్తోంది. ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ పదవీ కాలం ఈ ఏడాది జూన్తో ముగియనుంది. సీఎస్ ఆధిత్యనాథ్ దాస్ తోపాటే సీనియార్టీలో అజయ్ సాహ్ని, రెడ్డి సుబ్రమణ్యం, త్రిపాఠి, సతీష్ చంద్ర, సమీర్ శర్మ, జేఎస్వీ ప్రసాద్, నీరబ్ కుమార్ ప్రసాద్లు ఉన్నారు. వీరిలో అజయ్ సాహ్ని, సమీర్ శర్మ, రెడ్డి సుబ్రమణ్యంలు కేంద్ర సర్వీసులో ఉండడంతో ఆదిత్యనాథ్ దాస్ను సీఎస్గా నియమించారు. అయితే ఆదిత్యనాథ్ దాస్ పదవీకాలం పూర్తయ్యే సమయానికే ఒకరిద్దరు మినహా వీరిలో చాలామంది పదవీకాలం కూడా పూర్తవుతుంది. అదే సమయంలో శ్రీలక్ష్మి పేరు సీనియార్టీ జాబితాలో, హోదా జాబితాలోనూ ముందంజలో ఉంటుందని, ఆ పరిణామాలే చోటుచేసుకుంటే శ్రీలక్ష్మి సీఎస్ అవుతారనే చర్చ కూడా నడుస్తోంది. 2026 జూన్ 30 వరకూ శ్రీలక్ష్మి సర్వీసులో ఉండనున్నారు.
పట్టుబట్టి మరీ..
రాష్ట్ర విభజన తరువాత ఆమెను కేంద్రం తెలంగాణకు కేటాయించింది. శ్రీలక్ష్మి స్వస్థలం విశాఖపట్నం. జైలు నుంచి విడుదలయ్యాక పాలనాపరమైన, చట్టపరమైన క్లియరెన్స్లు వచ్చాక.. తన కేడర్ను తెలంగాణ నుంచి ఏపీకి మార్చాల్సిందిగా కోరారు. జగన్ని కూడా కలిసినట్టు వార్తలు వచ్చాయి. అయితే కేంద్రం జాప్యం చేసింది. వైఎస్ జగన్ కూడా కేంద్రంతో ఈ అంశంపై మాట్లాడినట్టు ప్రచారం జరిగింది. చివరకు క్యాట్ అదేశాలతో తెలంగాణ కేడర్ ఐఏఎస్గా ఉన్న ఆమె ఏపీకి బదిలీ అయ్యారు. ఏపీకి వచ్చిన కొద్దికాలానికే వరుస పదోన్నతులు రావడంపై భిన్న కోణాల్లో చర్చ నడుస్తోంది.