కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారత్ అతలాకుతలం అవుతోంది.నిత్యం వేలాదిమంది చనిపోతున్నారు.లక్షలాది కేసులు నమోదు అవుతున్నాయి.లక్షల కోట్ల సంపద హరించుకుపోతోంది.కరోనా సెకండ్ వేవ్ను నియంత్రించడంలో కేంద్ర వైఫల్యాలు, లోపభూయిష్ట విధానాలని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.భారత్లోని పరిస్థితి దయనీయంగా ఉందని, మోదీ ప్రభుత్వం చెప్పేది ఎక్కువ..చేసేది తక్కువ అని అంతర్జాతీయ మీడియా ఇప్పటికే కథనాలు, సంపాదకీయాలు రాసింది. న్యూయార్క్ టైమ్స్, ఆస్ట్రేలియన్ టైమ్స్, స్కైన్యూస్ లాంటి దిగ్గజ మీడియాల్లోనూ ఇలాంటి సంపాదకీయాలే వచ్చాయి.అయితే భారత్లో మాత్రం కేంద్ర వైఫల్యాలపై పెద్దగా విమర్శలు చేసిన దాఖలాలు లేవు.ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయి.మీడియా ఎవరి నియంత్రణలో ఉందనే అంశాన్ని ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశంగా మారింది.తాజాగా ఇండియా టుడే సంచలన కథనాన్ని,సంపాదకీయాన్ని రాసింది.THE FAILED STATE శీర్షికతో ఇండియా టుడే ఎడిటర్ ఇన్ చీఫ్ అరుణ్ పూరి ఈకవర్ స్టోరీ రాశారు.ఈ సంపాదకీయంలో మోదీని పరోక్షంలో విఫల ప్రధానిగా అభివర్ణించారని చెప్పవచ్చు.ఇక ప్రముఖ మెడికల్ జర్నల్ THE LANCET కూడా మోదీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యమే కారణమని చెబుతూ..రానున్న కాలంలో తలెత్తే ప్రమాదకర పరిస్థితులపైనా హెచ్చరించింది.అంతర్జాతీయ మీడియా విషయం అటుంచితే.. జాతీయ మీడియాలో కొవిడ్ విషయంలో మోదీ ప్రభుత్వాన్ని డైరెక్ట్గా బోనులో నిలబెట్టేలా ఈ స్థాయిలో కథనం రావడం చర్చనీయాంశంగా మారింది.గతంలో BREATHLESS శీర్షికతో ఇండియా టుడే సంపాదకీయం వచ్చినా.. ఇప్పుడు వచ్చిన స్థాయిలో ఆ విమర్శలు లేవని చెప్పవచ్చు.
ఏకేసిన ఇండియా టుడే..
ఈ సంపాదకీయంలో ముందుగా అరుణ్ పూరి వివరణ కూడా ఇచ్చారు.తాము గతంలో మే 13, 2013 న ప్రధాని మన్మోహన్సింగ్ను ‘‘Dr Dolittle’ శీర్షికతో కథనం రాశామని, నవంబర్ 23, 1998 ఎడిషన్లో ‘Unfit to Govern’ శీర్షికతో అటల్ బిహారీ వాజ్పేయి ఏడు నెలలు పాలనలో రాజకీయ ప్రవాహం, ఆర్థిక స్తబ్దత మరియు పరిపాలనా విషయాలపై కథనం ఇచ్చామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో ఆక్సిజన్ అందక పౌరులు చనిపోతుంటే క్రూరమైన వైఫల్యంగా చెప్పదలుచుకున్నామని, ప్రజలు ఎంతో నమ్మకంతో మోదీకి ఓట్లు వేశారని,అయితే ఆ నమ్మకం వమ్ము అవుతోందని వివరించారు.చివరికి ఆసుపత్రి పడకలు,మందులు,ఆక్సిజన్ సిలిండర్లు, అంబులెన్సుల సమస్యలతో పాటు చనిపోయినవారిని దహనం చేసే స్థలం కూడా దొరకని పరిస్థితి దాపురించిందని పౌరుల ప్రాథమిక హక్కైన జీవించే హక్కును నిరాకరించిందని వ్యాఖ్యానించారు.కవర్ పేజీలో ఢిల్లీలో శ్మశాన వాటికలో అంత్యక్రియల కోసం మృత దేహాలు లైన్లో పెట్టిన ఫొటోను ప్రచురించింది.ఘాటైన పదజాలంతోపాటు పౌరుల హక్కులకు భంగం కలగడం, ప్రభుత్వ వైఫల్యాలు,రాజకీయ వ్యవస్థలోని లోటుపాట్లను ఎత్తి చూపింది.గత రెండు వారాలుగా సగటున రోజూ 3 లక్షల కేసులు నమోదు కావడం,సగటున 3,200 మంది మరణించడం, ప్రపంచంలోని కేసుల్లో భారత్ వాటా 46శాతం కాగా మరణాల విషయంలో 25శాతం భారత్లో చోటుచేసుకున్నవేనని ప్రస్తావించింది. గతంలో తాము కొవిడ్ను కట్టడి చేస్తామని ప్రకటించిన మోదీ..తరువాత ఎలా విఫలమయ్యారో వివరించింది.జనవరి 28, 2021 న ప్రపంచ ఆర్థిక ఫోరమ్లో ప్రధాని మోడీ గర్వంగా చెప్పిన మాటలను ప్రస్తావించింది.కోవిడ్ ప్రోటోకాల్ను పట్టించుకోకుండా భారీ ఎన్నికల ర్యాలీలు,ఆధ్యాత్మిక కార్యక్రమాలు, నిబంధనల ఎత్తివేసిన నేపథ్యంలో జాగ్రత్తలపై అవగాహన కల్పించకపోవడం,కనీస నియంత్రణ చర్యలు లేకపోవడాన్ని ప్రస్తావించింది.2021 మార్చి 1 నాటి మా కవర్ స్టోరీలోనూ తాము హెచ్చరికలు ప్రస్తావించామని వ్యాఖ్యానించింది. మొదటి వేవ్ను తట్టుకుని నిలబడిన భారత్ ఆ తరువాత నిర్లక్ష్యం కారణంగా రెండో వేవ్ ధాటికి విలవిలలాడుతోందని వ్యాఖ్యానించింది.ఈ విషయంలో ఎక్కువగా పాలకుల విధానాలే కారణమని తేల్చింది.కాగా తాము THE FAILED STATE కవర్ స్టోరీని అన్ని విధానాలను,అంశాలను పరిశీలించాకే రాశామని, ముందస్తు హెచ్చరికలను పట్టించుకోకపోవడం, వైద్య సిబ్బంది కొరత, వైద్య మౌలిక సదుపాయాల కొరత,కొవిడ్ టెస్టుల నిర్వహణ, రిపోర్ట్లో జాప్యం,ట్రేసింగ్ మరియు ట్రాకింగ్,మందుల కొరత,ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ పతనం,వ్యాక్సిన్ల కొరత, సూపర్-స్ప్రెడర్ సంఘటనలను అరికట్టడంలో నిర్లక్ష్యం ఈ కథనానికి మూలాలుగా మారాయని తేల్చింది. గతేడాది ఫిబ్రవరి నుంచి జూలై వరకు RT-PCR ల్యాబ్లను 14 నుంచి 1,600కు పెంచగా,డిసెంబర్ 2020 మరియు మే 2021 మధ్య ఆ సంఖ్య 241మాత్రమేనని, నిర్లక్ష్యంతో పాటు కొవిడ్ సెకండ్ వేవ్ను లైట్గా తీసుకోవడం కూడా కారణమని వ్యాఖ్యానించింది.రిపోర్టుల కోసం నాలుగైదు రోజుల సమయం పట్టడం ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టడం కష్టం అవుతోందని,కొవిడ్ బాధితులకు అత్యవసర పరిస్థితి తలెత్తుతోందని వ్యాఖ్యానించింది.
టెండర్ల రద్దు..
ఈ కథనంలో ఆక్సిజన్ టెండర్లను రద్దు చేసిన విషయాన్ని కూడా ఇండియా టుడే ప్రస్తావించింది.అక్టోబరులో లక్ష టన్నుల మెడికల్ ఆక్సిజన్ను నిల్వకు గ్లోబల్ టెండర్లను పిలిచి మళ్లీ రద్దుచేశారని, పరిస్థితి చేయి దాటాక ఏప్రిల్లో 50 వేల టన్నుల మెడికల్ ఆక్సిజన్ నిల్వకు టెండర్లు పిలిచారని పేర్కొంది.అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిందని చెప్పింది.ఇక కొందరు అధికారుల వైఖరి కారణంగా వినాశ్రాయాల్లోనూ ఆక్సిజన్ దిగుమతులు ఆలస్యం అవుతున్నాయని,చెత్త విధానాలని ఏకరవు పెట్టింది.కనీస ఆర్డర్లు లేకుండానే ప్రపంచంలో అతిపెద్ద టీకా డ్రైవ్ ప్రచారం మొదలు పెట్టడం హేయకరమని అభివర్ణించింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 330 మిలియన్ల జనాభాకు 650 మిలియన్ వ్యాక్సిన్ల కోసం ఆర్డర్ ఇస్తే, భారత్ మాత్రం1.3బిలియన్ల జనాభాకు 370 మిలియన్ల వాక్సిన్ ఆర్డర్ ఇచ్చిందని,రెండు కంపెనీలు ఎంత ఉత్పత్తి చేస్తాయో తెలిసినా ప్రభుత్వం చొరవ చూపలేదని వ్యాఖ్యానించింది.పరిస్థితి ఇలాగే కొనసాగితే వ్యాక్సినేషన్ పూర్తయ్యేందుకు రెండేళ్లు పడుతుందని తేల్చింది.మొదటి వేవ్ కొంచెం తగ్గగానే మందుల నిల్వను పట్టించుకోలేదని,ఔషధాల తయారీకి ముడిపదార్ధాల ఆర్డర్లనూ ఇవ్వలేదని, వెరసి బ్లాక్ మార్కెట్ పెరిగిందని విమర్శించింది.ధిల్లీతో సహా పలు రాష్ట్రాలు కొవిడ్ మొదటివేవ్ తగ్గగానే ఎమర్జెన్సీ విభాగాల విస్తరణను మర్చిపోయాయని తేల్చింది.
కనీస నైతికత పట్టించుకోరా..
కాగా ఈ కథనంలో మరో సంచలన వ్యాఖ్య కూడా చేసింది.కొన్ని ప్రమాదాలు, వైఫల్యాలు ఎదురైనప్పుడు నైతిక బాధ్యత ఉంటుందని, ప్రస్తుత మోదీ పాలనలో అదికూడా కనిపించలేదని పరోక్షంగా వ్యాఖ్యానించింది.గతంలో రైల్వే ప్రమాదం జరిగిన సమయంలో 1956లో రైల్వే మంత్రిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి,1962 చైనా యుద్ధంలో ఓడినందున వీకే మీనన్,ఓ కుంభకోణం బయటకు రావడంతో 1992 అప్పటి వాణిజ్య మంత్రి చిందంబరం,1987లో రక్షణ ఒప్పందాల విషయంలో ఆరోపణలు రావడంతో వీపీ సింగ్,1993లో విమాన ప్రమాదం విషయంలో మాధవరావు సింధియా..ఇలా చాలామంది నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామాలు చేశారని వ్యాఖ్యానించింది ఇండియా టుడే. ఈ ప్రభుత్వం ఆ విషయాలను మర్చిపోయినట్టుందని ఎద్దేవా చేసింది.ఇంతటి జాతీయ విషాదాన్ని బాధ్యతగా తీసుకునేందుకు ఒక్క తలకాయ కూడా ముందుకు రాలేదని వ్యాఖ్యానించింది.అంతా బాగానే ఉందని చెప్పడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని తేల్చింది.పరిస్థితిని ఎలా అదుపులోకి తెస్తారనే విషయంపై ప్రధాని ఇంకా దేశానికి హామీ ఇవ్వలేదని కూడా గుర్తు చేసింది.ఇందుకు మంత్రి వర్గంలో అస్పష్టతే కారణమని అభిప్రాయ పడింది. ఇప్పటికైనా మోదీ సర్కారు తక్షణ చర్యలకు పూనుకోకుంటే పరిస్థితి మరింత దిగజారుతుందని వ్యాఖ్యానించింది.
ది లాన్సెట్ ఎద్దేవా..
కరోనా నియంత్రణలో మోదీ సర్కారును తూర్పారాపట్టింది మెడికల్ జర్నల్ ది లాన్సెట్.ఆ మ్యాగజైన్ రాసిన సంపాదకీయంలో కరోనాపై గొప్ప విజయం సాధించే అవకాశాన్ని మోదీ ప్రధానిగా ఉన్న భారత్ చేజేతులా నాశనం చేసుకుందని వ్యాఖ్యానించింది.ఏప్రిల్ వరకు కేంద్ర ప్రభుత్వం కొవిడ్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ ఒక్కసారి కూడా సమావేశం కాకపోవడాన్ని ప్రస్తావించింది.ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ ఆగస్టు 1 కల్లా భారత్లో 10 లక్షల మరణాలు సంభవిస్తాయని అంచనా వేసిన నేపథ్యంలో అదే జరిగితే మోదీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది.ఇందుకు సంబంధించి కొన్ని సూచనలూ చేసింది. మొత్తం మీద అప్రకటిత జాతీయ అత్యవససర పరిస్థితులను డీల్ చేయడంలో మోదీ సర్కారు గతంలో ఎన్నడూ లేని రీతిలో విఫలమైందని ఆ కథనాలు చెబుతున్నాయి.











