జగన్ పాలనలో సొంత పార్టీ నేతలకే అవమానాలు తప్పడం లేదు.మూడవ విడత జగనాన్న అమ్మఒడి పథకం నిధుల విడుదల కోసం సిక్కోలు పర్యటనకు సిఎం జగన్ హాజరయ్యారు.అందులో భాగంగా ఆయన శ్రీకాకుళం చేరకముందే చోటు చేసుకున్న ఘటన ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జగన్కు స్వాగతం పలికేందుకు శ్రీకాకుళం ఆర్అండ్బీ అతిథి గృహం వద్దకు చేరుకున్న వైసీపీ సీనియర్ నేత,శ్రీకాకుళం జిల్లా వైసీపీ మాజీ అధ్యక్షురాలు, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి అలిగి వెళ్లిపోయారు.
శ్రీకాకుళం ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద జగన్కు స్వాగతం పలికే వారికి సంబంధించిన ప్రోటోకాల్ లిస్టులో పేర్లను అధికారులు ఖరారు చేశారు. అయితే అందులో కృపారాణి పేరు లేదు.ఆమె జగన్ కు స్వాగతం పలికేందుకు వెళుతుండగా , లిస్టులో పేరు లేదంటూ అధికారులు ఆమెను నిలిపివేశారు.తన పేరు ప్రోటోకాల్ జాబితాలో లో పొందుపరచకపోవడం పై ఆగ్రహానికి గురైన కృపారాణి.. తన పేరు లేనప్పుడు తాను ఇక్కడ ఎందుకు ఉండాలంటూ ఆవేశంతో ఊగిపోతూ తన కారు వద్దకు వెళ్లిపోయారు.
విషయం తెలుసుకున్న మాజీ డిప్యూటీ సిఎం, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మనా కృష్ణదాస్, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్లు ఆమెకు సర్దిచెప్పే యత్నం చేశారు. అయినా కూడా కృపారాణి శాంతించలేదు. పార్టీలో తనకు జరుగుతున్న అవమానాలు చాలంటూ, ఇంకా ఇలాంటివి భరించే ఓపిక తనకు లేదంటూ భావోద్వేగానికి గురయ్యారు. కృష్ణదాస్ కృపారాణి కారు దగ్గరకు వెళ్ళి ఆమెకు సర్దిచెప్పే యత్నం చేస్తున్నా కృపారాణి ససేమిరా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కాగా, కృపారాణి ఉదంతం పై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నెలకొంది. జగన్ రెడ్డి పాలనలో బీసీలకు దక్కుతున్న గౌరవం ఇదేనా అంటూ ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.