కొవిడ్ను ఎదుర్కొనేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ఓ వైపు జరుగుతుండగా మరోవైపు వ్యాక్సిన్ల వృథా కూడా ఆందోళన కలిగిస్తోంది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ల వృథా జరుగుతున్నాఏపీ,తెలంగాణతోపాటు కొన్ని రాష్ట్రాల్లో నిర్ణీత పరిమితి కంటే ఎక్కువగా వృథా అవుతుందని కేంద్రం ఇటీవల విడుదల చేసిన నివేదిక చెబుతోంది.వృథా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు వ్యాక్సిన్ల సరఫరాలోనూ అప్రకటిత కోత విధిస్తున్నారని,అందుకే ఏపీ, తెలంగాణతోపాటు పలు రాష్ట్రాలకు తక్కువగా వ్యాక్సిన్ల సరఫరా జరుగుతోందని livemint ఇటీవల సంచలన కథనం ప్రచురించింది.కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వ్యాక్సికేషన్కు సంబంధించి ఏర్పాటైన హైపవర్ కమిటీ ఇటీవలే నివేదిక విడుదల చేసిందని సదరు వెబ్ సైట్ వెల్లడించింది.
మొదట్లో ఇలా..
కాగా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైన కొద్ది రోజుల్లో వ్యాక్సిన్ల వృథా శాతం తెలంగాణలో 17.6 శాతం ఉండగా 11.6 శాతంతో ఏపీ రెండోస్థానంలో ఉంది.9.4 శాతంతో యూపీ మూడో స్థానంలో నిలిచింది.దేశవ్యాప్త సగటు వృథా 6.5 శాతంతో పోలిస్తే ఈ మూడు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ వృథా ఎక్కువగా ఉన్నట్లు తేలింది.అప్పట్లో సమాచార హక్కు చట్టం ప్రకారం ఈ విషయం బయటకు వచ్చింది.ఒక్కో సీసా ఓపెన్ చేశాక నాలుగైదు గంటల్లో ఆ సీసాను పూర్తిగా వినియోగించాల్సి ఉంటుంది.అయితే ఆయా రాష్ట్రాల్లో వ్యాక్సిన్ వేయించుకునేందుకు ప్రజలు ఆ మేరకు ముందుకు రాకపోవడంతో సీసాల్లో కొంతమేర మిగిలిపోయిన వ్యాక్సిన్ వృథా అయింది.తరవాతి కాలంలోనూ వృథా విషయంలో కొన్ని ప్రభుత్వాలు సీరియస్గా ఆలోచించలేదన్న విమర్శలు వచ్చాయి.తెలంగాణలో ఈ వృథా శాతం 7.55కి తగ్గగా ఏపీలో వృథా ఇంకా ఎక్కువగా ఉందని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, మిజోరమ్, గోవా, దమన్ దియూ, అండమాన్ నికోబార్ దీవుల్లో వ్యాక్సిన్ల వృథా తక్కువగా ఉంది.ఇక కేరళలో ఒక్క చుక్క వ్యాక్సిన్ కూడా వృథా కాకుండా అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో కేంద్రం అభినందించింది.కేంద్రం నుంచి కేరళకు 73,38,806 వ్యాక్సిన్ మోతాదులు అందాయి.అందులో 74,26,164 డోసులను ప్రజలకు ఇచ్చారు.అంటే అదనంగా 87,358 మందికి వ్యాక్సిన్ వేశారు.ఐదు సీసాల్లో 10 డోసులు ఉంటాయి.ఆ డోసులు కాకుండా 0.55 మి.లీ లేదా 0.6 మి.లీల ఔషధం అదనంగా ఉంటుంది. నైపుణ్యం ఉన్నవారు ఆ అదనపు వ్యాక్సిన్ను కూడా వినియోగిస్తున్నారు.కేరళలో అలాంటి నైపుణ్యం ఉన్నవారికి, ప్రత్యేక శిక్షణ తీసుకున్నవారికి వ్యాక్సిన్లు వేసే బాధ్యతలు అప్పజెప్పారు. ఒక్కో సీసా కనీసం 11మందికి వినియోగించారు.నిర్ణీత టార్గెట్ కంటే అదనంగా వ్యాక్సిన్లు వేశారు.
ఏపీలో ప్రత్యారోపణలతోనే సరి..
వ్యాక్సిన్ల వృథా విషయంలో కేంద్రం ఇప్పటికే పలు మార్గదర్శకాలు జారీ చేసింది.వృథా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు వ్యాక్సిన్ల సరఫరా తక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఏపీ వృథాని అరికట్టే చర్యలు లేకపోగా రాజకీయ విమర్శలకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం చర్చకు కారణమైంది.తెలంగాణలోనూ ఈ వృథా జరుగుతున్నట్లు చెబుతున్నా.. తెలంగాణ ప్రభుత్వం రాజకీయ విమర్శల కంటే వ్యాక్సిన్లు రాబట్టుకునేందుకు ప్రయత్నం చేస్తుంటే..ఏపీలో మాత్రం ప్రతిపక్షం వ్యాక్సిన్లు తెప్పించాలని ప్రభుత్వ పెద్దలు వ్యాఖ్యానించడం,సామాజిక కారణాలు, బంధుత్వాలను తెరపైకి తేవడం దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. సదరు వెబ్ సైట్ కథనం ప్రకారం ‘ప్రభుత్వ ఆసుపత్రుల కంటే ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ వృథా ఎక్కువగా చూపిస్తున్నారు.వాస్తవ వృథా 5శాతం ఉంటే వృథా అయిందని చెప్పే శాతం 10-15 శాతం ఉంటుందని,ఇందులో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.వ్యాక్సిన్ల వృథా ను అరికట్టాలని స్వయంగా ప్రధాని సూచించడంతో పాటు వృథా శాతం1గా ఉండేలా చూడాలని సూచించారు.
ఏపీలో 10 శాతానికి మించి..
ఏపీతో పాటు రెండు మూడు రాష్ట్రాల్లో 10 శాతానికి మించి వృథా జరుగుతోంది. మే మొదటి వారంలో కేంద్రం విడుదల చేసిన నివేదిక ప్రకారం తెలంగాణ, ఏపీ, యూపీల్లో వృథా ఎక్కువగా ఉంది. తమిళనాడు, అసోం, మణిపూర్, హర్యానాల్లో 10శాతం కంటే తక్కువగా ఉంది.వృథా ఎక్కువగా ఉన్న చోట్ల వ్యాక్సిన్లు దారి మళ్లినట్టు కూడా కేంద్రం భావిస్తున్న నేపథ్యంలో ధిల్లీ ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది.ఇలాంటి అవకతవకలకు పాల్పడిన వ్యాక్సినేషన్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. COVIN యాప్ నమూనా డేటాతో ఈ వివరాలను పరిశీలించినట్టు తెలుస్తోంది. వ్యాక్సిన్ల వృథాను అరికట్టడంతో పాటు దారి మళ్లింపు చర్యలను అడ్డుకునేలా COVIN యాప్లో మార్పులు చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది.ప్రతి వ్యాక్సిన్ వినియోగం అందులో రికార్డు అవుతుందని,అయినప్పటికీ వృథా పేరుతో పక్కదారి పట్టిస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు సదరు ఆసుపత్రి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చింది. మొత్తం మీద కొవిడ్ నియంత్రణ విషయంలో,వ్యాక్సిన్ల విషయంలో అసలు సమస్య ఎక్కడుందనేది బయటకు రాకుండా చేయడం కోసం ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందనే చర్చ మొదలైంది.అందులో భాగంగానే ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై కేసులు పెట్టేందుకు,ప్రతిపక్షంపై విమర్శలు చేసేందుకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, వెరసి వైసీపీ సర్కారు మరింత అప్రతిష్టను మూటగట్టుకుంటోందనే విమర్శలు మొదలయ్యాయి.