మొత్తానికి సీఎం జగన్ కి ప్రత్యేక హోదా అంశం గుర్తొచ్చింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా.. ఇప్పటివరకు ఆ పేరు పలికే సాహసం కూడా చేయని జగన్.. ఇప్పుడు ప్రత్యేకహోదా కావాలంటూ ఏకంకా ప్రధానికే విన్నవించారు. హైదరాబాద్ లాంటి మహా నగరాన్ని విభజనతో కోల్పోయిన రాష్ట్రం.. అభివృద్ధిని సాధించాలంటే.. ప్రత్యేకహోదా ఒక్కటే శరణ్యమని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. మోదీ అధ్యక్షతన శనివారం జరిగిన నీతిఆయోగ్ సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ మేరకు విన్నవించారు.
మీ మాటకు కట్టుబడి ఉన్నాం..
రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటులో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ప్రకటించాలని ఆయన కోరారు. ప్రధాని కాంక్షిస్తున్న ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదానికి రాష్ట్రం కట్టుబడి ఉందని, తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తూ నూతన పారిశ్రామిక విధానాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 10,731 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటుచేశామని, విద్యుత్తురంగంలో వినూత్న విధానాలకు నాంది పలికామని జగన్ వివరించారు. పోలవరం సాగునీటి ప్రాజెక్టుకు సవరించిన అంచనాలను ఆమోదించాలని ప్రధానిని ఈ సందర్భంగా ఆయన కోరారు.
గట్టిగా అడిగేంత ధైర్యం ఎక్కడిది?
ఇలా అందరి సమక్షంలో గుంపులో గోవిందాగా ప్రత్యేక హోదా గురించి ఒక మాట అనేసి.. మేమూ హోదా గురించి అడిగాం చూడండి అనిపించుకోవడమే కానీ.. ప్రత్యేక హోదా గురించి జగన్ ఏనాడు గొంతెత్తిన దాఖలాలు లేవు. అందుకోసం ప్రత్యే్కంగా మోడీని అడిగిన సందర్భాలు లేవు. కానీ, మీ పనులకు జై కొడుతున్నాం చూడండి అని మాత్రం ఎంతో ఆనందంగా వివరించారు మన ముఖ్యమంత్రి గారు. మన సీఎం ఇలా ఉంటే.. ఇక మన రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం కాల రాస్తుందని అనుకోవాల్సిన పనేమి లేదు. కేంద్రం ముందు కనీసం నోరెత్తలేని సీఎంకు అధికారాలు అప్పజెప్పిన ఫలితమే నేడు ప్రజలు అనుభవిస్తున్నారు.