ఏపీలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అటకెక్కేస్తూన్నాయా ? నిన్న మొన్నటి వరకు కోతలతో అమలైన పథకాలు ఇప్పుడు పూర్తిగా నిలిచిపోతున్నాయా ? కరోనా సమయంలో కూడా సమక్షేమ పథకాలు అందించాం అని చెప్పుకున్న వైసీపీ ప్రభుత్వం మాటలు ఉత్తి డబ్బాకొట్టుడేనా ? మైనారిటీలను జగన్ నిలువునా మోసం చేస్తున్నారా ? ప్రతిపక్షంలో జగన్ ఇచ్చిన హామీలకి, అధికారంలోకి వచ్చాక చేస్తున్న పనులకి పొంతన కుదరడం లేదా?
తాను అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం కంటే మిన్నగా, పారదర్శకంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తా.. ఇది 2019 ఎన్నికలకి ముందు తన పాదయాత్రలో జగన్ ఊరూరా చేసిన ఊకదంపుడు ఉపన్యాసం. అలాగే.. కులం చూడం,మతం చూడం, ప్రాంతం చూడం ఆఖరికి పార్టీ చూడం..వైసీపీకి ఓటు వేయని వారికి కూడా నవరత్నాల పేరిట తాను ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను అందిస్తా ఇదీ.. ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతూ జగన్ చెప్పిన మాటలు..కానీ అధికారంలోకి వచ్చాకా అవన్నీ గాలి మాటలుగా మారిపోతున్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్ని సంక్షేమ పథకాలు అటకెక్కిస్తున్నాయి.
ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఎన్నో హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన జగన్.. మొదటి రోజు నుంచే వారిపట్ల నిర్లక్ష్యం వహిస్తూ వస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ లకు 200 వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తానన్న మాట కనీసం కంటికి కూడా కనిపించడంలేదు. కోతల జాబితాలోకి చేరిన ఈ పథకం పై అనేక ఆంక్షలు కూడా విధించింది జగన్ సర్కార్.. మొదట అందరికీ ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పినప్పటికీ తరువాత దానికి ఒక్కో కుటుంబానికి ఒక కనెక్షన్ అని మెలిక పెట్టడం, ఆ తర్వాత కేవలం ఎస్సీ, ఎస్టీ కాలనీలు, తందాల్లో నివసించే వారికే ఈ పథకం వర్తిస్తుందని చెప్పడంతో రాష్ట్రంలో నిరూపేదలైన దళిత, గిరిజన కుటుంబాలపై ఏటా 600 కోట్ల రూపాయల మేరా భారం పడనుంది.
ఇక జగన్ మానస పుత్రికగా చెప్పుకుంటున్న అమ్మఒడి పథకం అమలు కూడా కోతలతో అంతంత మాత్రంగానే అమలవుతోంది. అధికారంలోకి రాకముందు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చాక మాట మార్చేశారు. కుటుంబంలో ఒకరికీ మాత్రమే ఈ పథకం అమలు చేస్తూ వస్తున్నారు. ఇక గడిచిన రెండేళ్లుగా లబ్ధిదారుల్లో సహానికి పైగా లబ్ధిదారులకు ఈ పథకం అందలేదు.కాగా ఈ పథకంలోనూ జగన్ సర్కార్ ఆంక్షలు విధించింది.కరెంట్ బిల్లు 300 యూనిట్ల దాటిన వారు అమ్మఒడికి అర్హులు కాదంటూ కొత్త కొర్రీ పెట్టింది. దీంతో రాష్ట్రంలో లక్షలాది మంది లబ్ధిదారులు ఈ పథకానికి దూరం అయ్యారు.
ఇక తాజాగా నిరూపేదలైన ముస్లిం యువతులకు గత ప్రభుత్వం నుంచి అందుతున్న దుల్హన్ పథకానికి ప్రభుత్వం మంగళం పాడేసింది.ఆర్ధిక ఇబ్బందులతో దుల్హన్ పథకాన్ని నిలిపివేస్తున్నట్లు హైకోర్టులో జగన్ ప్రభుత్వం నివేదించింది.దీంతో వైసీపీ ప్రభుత్వం మైనారిటీ లకు చేస్తున్న మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా అప్పటి టిడిపి ప్రభుత్వం దుల్హన్ పథకానికి 50 వేల రూపాయలు మాత్రమే ఇస్తోంది.అదీ సరిగ్గా అందె పరిస్థితి లేదని జగన్ ప్రచారం చేయడం మాత్రమే కాకుండా, తన అనుకూల మీడియా, పేటియం బ్యాచ్ ద్వారా విష ప్రచారం చేయించారు. అదేసమయంలో తాను అధికారంలోకి వస్తే దానికి లక్ష రూపాయలకు పెంచుతా అని పాదయాత్రలో హామీ ఇచ్చారు. కానీ మూడేళ్ళలో ఆ పథకాన్ని ఎక్కడా అమలు చేసిన దాఖలాలు లేవు.ఈ క్రమంలో ఇప్పుడు ఈ పథకాన్ని పూర్తిగా నిలిపివేయడం పై మైనారిటీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
దుల్హన్ పథకం కింద అందిస్తున్న 50 వేల రూపాయల ఆర్ధిక సాయాన్ని, తాను అధికారంలోకి వచ్చిన వెంటనే లక్ష రూపాయలకు పెంచుతామని ఎన్నికల సమయంలో జగన్ హామీ ఇచ్చారని, అయితే, ఆ హామీని వైసీపీ ప్రభుత్వం నెరవేర్చలేదంటూ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి నేత షిబ్లి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. పిటిషన్ విచారణ సందర్భంగా ప్రభుత్వ తరపు న్యాయవాది వాదిస్తూ… పథకం అమలుకు ప్రభుత్వం వద్ద నిధులు లేవని కోర్టుకు తెలిపారు. దీంతో, రిప్లై పిటిషన్ దాఖలు చేయాలని పిటిషనర్ తరపు న్యాయవాదికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలా ఉంటే జగన్ సర్కార్ ఈ ఒక్క పథకం విషయంలోనే కాదు ముస్లిం, మైనారిటీలను అన్ని విషయాల్లో మోసం చేస్తోందని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి పెద్దలు ఆరోపిస్తున్నారు. కేంద్రం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజ పథకం ద్వారా ముస్లిం విద్యార్ధులకు అందిస్తున్న భోజనాన్ని కూడా జగన్ సర్కార్ దారి మళ్లించేందుకు వినియోగించుకుంటోంది. కేంద్రం నిధులతో ముస్లిం విద్యార్ధులకు భోజనం అందిస్తూ, మళ్ళీ మైనారిటీ వెల్ఫేర్ బడ్జెట్ లో తప్పుడు లెక్కలు చూపెడుతోంది. ఇక మైనారిటీ విదేశీ విద్యకు నిధులు లేవని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అంతేకాదు మైనారిటీ వెల్ఫేర్ బడ్జెట్ కూడా ఇప్పటికే నవరత్నాలకు మళ్లించిన రాష్ట్ర ప్రభుత్వం అందులోనూ కోటలు విధిస్తూ మైనారిటీలను నిలువునా మోసం చేస్తోంది.2019- 2020 సంవత్సరానికి 1600 కోట్ల రూపాయలు నవరత్నాల ద్వారా కహరచు చేసిన ప్రభుత్వం, 2020 – 2021 సంవత్సరానికి దానిని 1100 కోట్లకు కుదించి అందులోనూ కోత విధించింది.ఇలా ఒకవైయపు కోతలు విధించుకుంటూ రాష్ట్రంలో 44 లక్షల మంది ముస్లిం లకు లబ్ధి చేకూరుస్తున్నామని జగన్ ప్రభుత్వం చెబుతున్న మాటలపై మైనారిటీలు మండిపడుతున్నారు.
మొత్తం మీద జగన్ పాలనలో మైనారిటీలకు తీవ్ర అన్యాయం జరుగుతుండగా , తాము సంక్షేమ పథకాలను నిష్పక్షపాతంగా అందిస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు చేసిన జగన్ మాటలు గాలి మాటలై, ప్రస్తుతం ఒక్కో సంక్షేమ పాఠ్యం అటకెక్కేస్తూన్న పరిస్థితి ఆంధ్ర ప్రదేశ్ లో నెలకొంది. మరి రానున్న రోజుల్లో ఇంకెన్ని పథకాలు ఇలా నిలిచిపోనున్నాయో వెహి చూడాలి మరి.