2019 ఎన్నికలకు ముందు.. అధికారం చేజిక్కించుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జనాలకు లెక్కలేనన్ని హామీలు ఇచ్చారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న కృష్ణా జిల్లాలో తన యాత్ర ప్రవేశించిన తర్వాత ఆ హామీల వరద మరింతగా ఎక్కువైందనే చెప్పాలి. టీడీపీ వ్యవస్థాపకుడు, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారకరామారావు సొంతూరు నిమ్మకూరులో పర్యటించిన సందర్భంగా జగన్ ఓ భారీ హామీని ఇచ్చారు. తాను అధికారంలోకి వస్తే.. కృష్ణా జిల్లా పేరును నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) జిల్లాగా మారుస్తానని జగన్ ఘనంగానే ప్రకటించారు. అనుకున్నట్టుగానే జగన్ సీఎం అయ్యారు గానీ.. కృష్ణా జిల్లా పేరు మాత్రం ఎన్టీఆర్ జిల్లాగా మారలేదు. అంటే.. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు ప్రజలకు ఇచ్చిన హామీని జగన్ నెరవేర్చలేదన్నట్లే కదా.
పీకే డిమాండ్ ఇదీ!
తాజాగా పవన్ కల్యాణ్ మచ్చ లేని రాజకీయ నేతల గురించి జనానికి చెప్పే యత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా వ్యవహరించిన దామోదరం సంజీవయ్య ఘనతను చాటుతూ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కర్నూలు జిల్లా పరిధిలోని కల్లూరు మండలం పెద్దపాడులోని దామోదరం ఇంటిని స్మారకంగా ఏర్పాటు చేస్తున్నట్లుగా, అందుకోసం రూన.1 కోటి నిధిని ఏర్పాటు చేస్తున్నట్లుగా కూడా ప్రకటించారు. అదే సమయంలో కర్నూలు జిల్లా పేరును దామోదరం సంజీవయ్య జిల్లాగా మార్చాలని కూడా పవన్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దామోదరం సంజీవయ్య చేసిన మంచి పనులను వివరిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఏపీకి కేవలం రెండేళ్ల పాటు సీఎంగా సాగిన సంజీవయ్య.. రాష్ట్రంలో నాలుగు ప్రధాన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారని, 6 లక్షల ఎకరాలను పేద, బడుగు, బలహీన వర్గాలకు పంపిణీ చేశారని తెలిపారు. ఇక కేంద్ర మంత్రిగా వృద్ధాప్య, విభిన్న ప్రతిభావంతుల ఫింఛన్లకు శ్రీకారం చుట్టారని పవన్ తెలిపారు. ఇంతటి మహోన్నత నేతకు గుర్తింపుగా కర్నూలు జిల్లా పేరును దామోదరం సంజీవయ్య జిల్లాగా మార్చాలని పవన్ డిమాండ్ చేశారు.
పవన్ది అత్యాశేగా
జగన్ తాను ఇచ్చిన హామీలనే అమలు చేయకుండా సాగుతుంటే.. ఇక కొత్తగా వినిపించే డిమాండ్లను ఎలా పట్టించుకుంటారన్న వాదనలు వినిపిస్తున్నాయి. సొంత పార్టీ నేతలు వినిపించే డిమాండ్లను అయినా పరిశీలిస్తారేమో గానీ.. తనకు బద్ధ విరోధిగా కనిపిస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్ నోట నుంచి వచ్చే డిమాండ్ను జగన్ పట్టించుకుంటారా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. అయినా జగన్ తత్వం తెలిసి కూడా పవన్ ఈ డిమాండ్ చేయడం నిజంగానే విడ్డూరమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు ఉండరాదని, ఉన్నా నోరు మెదపరాదన్న కోణంలో సాగుతున్న జగన్.. విపక్షానికి చెందిన పవన్ చెప్పే మాటను వింటారని అనుకోవడమే దండగ అన్న వాదనలూ లేకపోలేదు. ఈ కారణంగానే కర్నూలు జిల్లా పేరును దామోదరం సంజీవయ్య జిల్లాగా మార్చాలన్న పవన్ డిమాండ్ అత్యాశేనన్న విశ్లేషణలు సాగుతున్నాయి.