ఐదు రోజుల పాటు కొనసాగిన ఏపీ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగిశాయి. సమావేశాల్లో 19 బిల్లులు చట్టరూపంలోకి వచ్చాయి. మరో మూడు బిల్లులు మండలిలో తిరస్కరణకు గురయ్యాయి. అయితే అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు ప్రతిపక్ష సభ్యులను అనరాని మాటలు అంటూ, అన్ పార్లమెంటరీ భాష వాడుతూ వైసీపీ నేతలు చేసిన అరాచకం మాత్రం దేశ వ్యాప్త చర్చకు దారి తీసింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతను వెక్కిరిస్తూ సీఎం చూపిన హావభావాలను ప్రఖ్యాత జాతీయ మీడియా సంస్థ సీఎం చిన్నపిల్లల చేష్టలుగా అభివర్ణించిందంటే ఏపీ పరువు ఏ స్థాయిలో దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.
అసెంబ్లీలో సభ్యులు వాడిన భాష దేనికి సంకేతం
అసెంబ్లీలో సరైన సమాధానాలతో ప్రతి పక్షాల నోళ్ళు మూయించాల్సిన అధికార వైసీపీ పంథా మార్చుకున్నట్టు కనిపిస్తోంది. ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బూతులతో ఎదురుదాడికి దిగిన సందర్బాలే ఐదు రోజుల్లో ఎక్కువగా కనిపించాయి. పంటల బీమా చెల్లించకుండా రైతులను ప్రభుత్వం మోసం చేసిందని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సభలో లేవనెత్తారు. దీనిపై సీఎం జగన్మోహన్ రెడ్డి సమాధానానికి ఆ పార్టీ మంత్రులకే ఫీజులు ఎగిరిపోయినంత పనైంది. మే పంటల బీమా ప్రీమియం చెల్లిస్తే మీకు ఎందుకు? చెల్లించకపోతే మీకు ఎందుకు అని సీఎం గట్టిగా అరవడంతో, ఆ సమాధానం వస్తుందని ఎవరూ అంచనా వేయలేదు. పంటల బీమా చెల్లించక పోయినా డిసెంబరు 15న ఒక్క బటన్ నొక్కి రూ.1225 కోట్లు రైతుల ఖాతాలో జమ చేస్తామని సీఎం సభలో గట్టిగా అరుస్తూ సమాధానం చెప్పారు. అయితే ప్రభుత్వం పంటల బీమా ప్రీమియం చెల్లించి ఉంటే నివర్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు రూ.12000 కోట్ల పరిహారం అంది ఉండేది. ఇదే విషయాన్ని ప్రతిపక్ష నేత సభలో ప్రస్తావిస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన సమాధానం రైతులంతా గమనిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం విడుదల చేసేది పంటల బీమా ప్రీమియం మాత్రమే, పంటల బీమా సొమ్ము కాదు. 20 లక్షల మంది రైతులకు ప్రభుత్వం రూ.1225 కోట్ల విడుదల చేస్తే ఒక్కో రైతుకు దక్కేది కేవలం రూ.2 వేలు మాత్రమే. అదే ప్రభుత్వం ముందే పంటల బీమా ప్రీమియం చెల్లించి ఉంటే నివర్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు ఒక్కొక్కరికి రూ.40 వేల నష్ట పరిహారం అందేది. ఈ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు సీఎం చేసిన ప్రయత్నం సభలో అందరూ ప్రత్యక్షంగా చూశారు.
Must Read ;- రచ్చ రాజేసిన టిడ్కో ఇళ్లుపై చర్చ
అంతా మీవల్లే..
పోలవరం ఎత్తు, నీటి నిల్వ, కేంద్రం నుంచి నిధుల విషయంపై ప్రతిపక్ష నేతలు అడిగిన ప్రశ్నలకు జలవనరుల మంత్రి చెప్పిన సమాధానాలకు ఎక్కడా పొంతనే కుదరలేదు. ప్రతిపక్షం ఏమి అడిగినా పాలక పక్ష సభ్యులు వారిష్టం వచ్చిన సమాధానాలు చెప్పారు. పోలవరం ఎత్తు అంగుళం కూడా తగ్గదు అని జలవనరుల మంత్రి అనిల్ యాదవ్ గట్టిగానే చెప్పారు. కానీ పోలవరంలో 41.15 మీటర్లు నీరు నిల్వ చేస్తే ఎంత పరిహారం చెల్లించాలనే దానిపై సాక్షాత్తూ సీఎం జగన్మోహన్రెడ్డి ఉన్నతాధికారులతో ఎందుకు సమావేశం నిర్వహించారో మాత్రం సమాధానం చెప్పలేక పోయారు. పోలవరం ఎత్తు అంగుళం కూడా తగ్గదని కావాలనే కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేశాయని సభలో మంత్రి మండి పడ్డారు. పోలవరం ప్రాజెక్టును వచ్చే 2022 ఖరీఫ్ నాటికి పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీరు విడుదల చేస్తామని మంత్రి సభలో ప్రకటించారు. అయితే పరిహారం విషయంలో కేంద్రం సహాయం చేస్తుందా? కేంద్రం హామీ ఇచ్చిందా? అనే ప్రశ్నలకు సభలో సమాధానం దొరకలేదు. 2014 ధరల ప్రకారం పోలవరం వ్యయం రూ.20 వేల కోట్లకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంగీకరించడం వల్లే సమస్య వచ్చిందని ప్రతిపక్షంపైనే నెట్టే ప్రయత్నం చేశారు. అసలు పోలవరం పనుల్లో చంద్రబాబునాయుడు ప్రభుత్వం చేసింది 12 శాతమేనని అడ్డంగా అబద్దాలు చెప్పగలిగారు. మిగిలిన 68 శాతం వైఎస్, జగన్మోహన్ రెడ్డి పాలనలోనే పూర్తి అయ్యాయని చెప్పుకొచ్చారు. వినేవారు ఉంటే చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్టుకు ఒక్క ఇటుక కూడా ఎత్తలేదని గట్టిగా చెబుతారనిపిస్తోంది. పోలవరం ఎత్తు తగ్గించాలని ప్రభుత్వం చేసిన ప్రయత్నంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో ఇది గ్రహించిన అధికార పార్టీ, అసెంబ్లీ వేదికగా పోలవరం ఎత్తు అంగుళం కూడా తగ్గదని మంత్రి అనిల్ యాదవ్ గొంతు చించుకుని మరీ చెప్పారు. అయినా పోలవరం విషయంలో జరగాల్సిన నష్టం జరిగి పోయింది. పోలవరం వ్యయం రూ.55 వేల కోట్లకు చేరింది. కేంద్రం మాత్రం రూ.20 వేల కోట్లు మాత్రమే ఇస్తానంటోంది. అయితే పోలవరం పరిహారం సగమే ఇస్తే ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటి నిల్వ చేయడం ఎలా సాధ్యం అవుతుందని సామాన్యులకు కూడా అనుమానం రాక మానదు.
సభలో ఇసుక తుపాన్
ఏపీ అసెంబ్లీలో ఇసుక అక్రమాలను ప్రతిపక్షాలు గట్టిగా నిలదీశాయి. టీడీపీ ప్రభుత్వం ఆనాడు ఉచితంగా ఇసుక సరఫరా చేసిందని టీడీపీ సభ్యుడు బుచ్చయ్య చౌదరి గుర్తు చేశారు. టన్ను రూ.50 నుంచి 525 రూపాయలు చేశారని సభలో గుర్తు చేశారు. ఇసుక ధరలు భారీగా పెంచడంతో పాటు, రవాణా పేరుతో వైసీపీ నేతలు దోచుకుంటున్నారని టీడీపీ చేసిన ఆరోపణలకు వైసీసీ సరైన సమాధానం చెప్పలేకపోయింది. టీడీపీ హయాంలో ఎమ్మెల్యేలు, మంత్రులు ఉచిత ఇసుక పేరుతో దోచుకున్నారని వైసీపీ సభ్యులు విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 17 నెలల్లో ఇసుక ద్వారా ఎంత ఆదాయం వచ్చిందో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని బుచ్చయ్య చౌదరి సభలో డిమాండ్ చేశారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.
ఇంటి గుట్టు రట్టు
వైసీపీ అధికారంలోకి రాగానే 300 చదరపు అడుగుల ఇళ్లు అన్నీ ఫ్రీగా ఇస్తామని, వాటిపై తీసుకున్న రుణాలు కూడా రద్దు చేస్తామని 2019 ఎన్నికల్లో ప్రచారం చేసిన ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సభలో లేవనెత్తిన ప్రశ్నలతో అధికార పార్టీ ఇరుకున పడిపోయింది. ఎంతసేపటికీ మా మ్యానిఫెస్టో మాకు బైబిల్ అంటూ పట్టణ గృహాలకు, అది కూడా 300 చదరపు అడుగులకు మాత్రమే మేము హామీ ఇచ్చామని, ప్రతిపక్ష నేతకు గుడ్డి వచ్చిందని, సీఎం చేసిన ఆరోపణలు సభా సాంప్రదాయాలను మంట గలిపేవిగా ఉన్నాయి. ఏదిముద్దు పేరుతో పేదల అభిప్రాయాలు తీసుకున్నామని, వారు చంద్రబాబు స్కీమ్ కన్నా జగన్ స్కీమ్ బాగుందంటున్నారని సీఎం జగన్మోహన్ రెడ్డి సభలో ప్రకటించారు. టీడీపీ పాలనలో నిర్మించిన 90 శాతంపైగా పూర్తి చేసిన 6 లక్షల ఇళ్లను పేదలకు ఇవ్వకుండా, 30 లక్షల ఇళ్లు నిర్మిస్తామని చెప్పడం చూస్తుంటే, రాజన్న జగనన్న కాలనీలను వైసీపీ ఓటు బ్యాంకులుగా మార్చుకోవాలనే కుట్ర దాగి ఉందేమో అనే అనుమానాలు వస్తున్నాయని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.
Also Read ;- స్పీకరు పోడియం ఎదుట చంద్రబాబు బైఠాయింపు
ఉపాధి హామీ బిల్లులు విడుదల చేయండి
టీడీపీ హయాంలో ఉపాధి హామీ పనులు చేసిన కాంట్రాక్టర్లకు నేటికీ బిల్లులు విడుదల చేయకపోవడంపై ప్రతిపక్షం, అధికార పక్షాన్ని గట్టిగా నిలదీసింది. నాణ్యత లేకుండా పనులు చేశారని అందుకే బిల్లులు నిలిపివేయాల్సి వచ్చిందని మంత్రి పేర్నినాని సభలో ప్రకటించారు నాణ్యత లేని పనులు చేసిన వారిని బాధ్యులను చేయాలి. అలాంటి వారికి భవిష్యత్తులో పనులు ఇవ్వకుండా చూడాలి. అంతేకాని రూ.2000 కోట్లు బిల్లులు నిలిపివేసి కాంట్రాక్టర్ల ఆత్మహత్యలకు ప్రభుత్వం కారణమవుతోందని ప్రతిపక్షనేత అచ్చెన్నాయుడు నిలదీశారు. దీనిపై సీఎం జగన్మోహన్రెడ్డి కల్పించుకుని, చంద్రబాబునాయుడు ఎన్నికలకు రెండు నెలల ముందు హడావుడి బడా కాంట్రాక్టర్లకు రూ.5 వేల కోట్లు చెల్లించారని స్లైడ్స్ వేసి మరీ చూపించారు. చిన్న చిన్న పనులు చేసిన వారి బిల్లులు ఎందుకు చెల్లించడం లేదని అడిగితే, ఆనాడు మీరు ఇలా చేశారని చెప్పడం సమాధానం అవుతుందా? ఉపాధి హామీ పనులు టీడీపీ సానుభూతి పరులు చేశారు కాబట్టి వారిని ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నమే కాని ఇది మరొకటి కాదని అర్థం చేసుకోవచ్చు.
అమూల్ను ఎందుకు తెచ్చినట్టు
రాష్ట్రంలో అనేక సహకార డెయిరీలు విజయవంతంగా నడుస్తున్నాయి. సంగం, విజయా డెయిరీలు లక్షలాది రైతుల గ్రూపులకు ఏటా రెండు సార్లు బోనస్ కూడా ఇస్తున్నాయి. అమూల్ ఇచ్చే ధరకన్నా సహకార డెయిరీలు ఎక్కువ ధర చెల్లిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా అమూల్ను తీసుకు వచ్చి, వేల కోట్లు ఖర్చు చేసి నిర్మించిన రైతు భరోసా కేంద్రాలను ఆ సంస్థకు అప్పగిండచం శోచనీయమని ప్రతిపక్ష సభ్యులు సభలో ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వం విచిత్రమైన సమాధానం చెప్పింది. ప్రైవేటు డెయిరీలు, సహకార డెయిరీలు ఇచ్చే ధర కన్నా పాడి రైతులకు లీటర్కు రూ.5 నుంచి రూ7 అధనంగా అమూల్ ఇస్తుందని ధరలు ప్రకటించారు. ఆ ధరలు పరిశీలిస్తే అమూల్ కన్నా సంగం డెయిరీ ఎక్కువ చెల్లిస్తోంది. ఈ విషయాన్ని సంగం మేనేజ్మెంట్ ప్రకటన ద్వారా వెల్లడించింది కూడా. అమూల్ విషయంలో స్వయంగా సీఎం జగన్మోహన్రెడ్డి కలుగజేసుకుని అక్కచెల్లెమ్మలకు గెదెలు కూడా ఉచితంగా ఇస్తున్నామని, వారు అమూల్కు పాలు పోసి మంచి ఆదాయం గడిస్తారని చెప్పారు. ప్రతిపక్ష నేత కుటుంబానికి చెందిన హెరిటేజ్ డెయిరీ కోసమే చిత్తూరు డెయిరీని నష్టాల్లోకి నెట్టారని సీఎం సభలో ప్రకటించారు. అంతే కాని అమూల్ సంస్థ రావడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి, పాడి రైతులకు కలిగే ప్రయోజనం ఏమిటి? అంటే కొత్తగా ఏమీ లేదు. ప్రస్తుతం సహకార రంగంలోని డెయిరీలు కూడా సంవత్సరానికి రెండు సార్లు బోనస్ చెల్లిస్తున్నాయి. అమూల్ డెయిరీ వచ్చిన లాభాలను పాడి రైతులకు ఏటా రెండు సార్లు బోనస్ గా ఇస్తుందని సీఎం గట్టిగా చెప్పారు. అంటే అమూల్ ఒక్కటే ఈ పని చేస్తున్నట్టు ఆయన అభిప్రాయపడుతున్నట్టు ఉంది. సహకార డెయిరీలు ఏటా రెండు సార్లు బోనస్ చెల్లించడమే కాదు, పశువైద్యం ఉచితంగా అందిస్తున్నాయి. పాడి రైతులకు బీమా ప్రీమియం చెల్లిస్తున్నాయి. రాయితీ ధరలపై దాణా సరఫరా చేస్తున్నాయి. పాడి రైతులు గేదెలు కొనుగోలు చేసుకునేందుకు రుణాలు కూడా ఇస్తున్నాయి. ఇన్ని సేవలు అందిస్తుంటే అమూల్ వస్తే రాష్ట్రంలో పాడి రైతుల జీవితమే మారిపోతుందన్నట్టు సీఎం చెప్పడం చూస్తుంటే ఏపీలో సహకార, ప్రైవేటు డెయిరీలు నడవడం వారికి ఇష్టం లేదనట్టుగా అనిపిస్తోందని ప్రతిపక్షాలు ఎండగట్టాయి.
ఐదు రోజుల పాటు సాగిన అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. అసెంబ్లీలో ప్రజల సమస్యలపై చర్చించేందుకు ప్రతి పక్షం పట్టుబట్టింది. అయితే ప్రతిపక్ష సభ్యులపై కక్ష తీర్చుకునే ధోరణిలో అధికార పార్టీ సభ్యులు వ్యవహిరించినట్టు అర్థం అవుతోంది. శాసనసభా ప్రతిపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు 24 అంశాలపై చర్చకు అనుమతించాలని బీఏసీలో కోరినా ప్రయోజనం లేకుండా పోయింది. పొద్దంతా బిల్లులు పాస్ చేసుకోవడం, సాయంత్రం వివాదాస్పద అంశం ఒకటి తీసుకోవడం, ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేయడం, ఇదీ మొత్తంగా ఏపీ అసెంబ్లీ ఐదు రోజుల సమావేశాలు సాగిన తీరు.
Also Read ;- హెరిటేజ్ కు చెక్ పెట్టాలనుకుంటే.. బ్రేక్ పడింది