ఒక్కరి నిర్లక్ష్యం అనేక కుటుంబాల్లో విషాదానికి కారణమయ్యింది. ఒక తప్పిదం కొన్ని నిండు ప్రాణాలను బలగొంది. మితిమీరిన వేగానికి 9 మంది బలైన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా ఈ ఘటనకి డ్రైవరు నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని హసన్పల్లి గేటు వద్ద టాటా ఏస్ వాహనం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదం నింపింది.
పిట్లం మండలం చిల్లర్గికి చెందిన సౌదర్పల్లి మాణిక్యం గత వారం మృతి చెందారు. కాగా మాణిక్యం దశదినకర్మ నిర్వహించిన వారి కుటుంబ సభ్యులు , టాటా ఏస్ వాహనంలో ఎల్లారెడ్డి పట్టణంలోని వారపుసంతలో అంగడిదింపుడు కార్యక్రమానికి వెళ్లారు.సంత నుంచి తిరిగి వస్తుండగా హసన్పల్లి వద్ద ఎదురుగా వస్తున్న లారీని టాటా ఏస్ ఢీకొట్టింది.
అయితే టాటా ఏస్ వాహనం అతివేగంతో వస్తుండడంతో ప్రమాదం జరగవచ్చని అనుమానించిన లారీ డ్రైవర్ లారీని రోడ్డు కిందికి తీసుకెళ్లినా ప్రయోజం లేకపోయింది. టాటా ఏస్ డ్రైవర్ మితిమీరిన వేగమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రమాదంలో వాహనం నుజ్జునుజ్జు అవగా.. డ్రైవర్ సాయిలు (25), లచ్చవ్వ (45) అక్కడిక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వారిని బాన్సువాడ, ఎల్లారెడ్డి ఆసుపత్రులకు తలించారు.
ఈ క్రమంలో చికిత్స పొందుతూ మరో ఐదుగురు, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఇద్దరూ మరణించారు. మొత్తంగా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.ఇక ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.