రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు ఎడాపెడా ఇసుక దందాలు, లిక్కర్ స్మగ్లింగ్ చేస్తున్నారనే ఆరోపణలు తరచూ వినవిస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి ప్రచారం మొత్తం.. కిట్టని వాళ్లు చేస్తున్న వ్యాఖ్యలుగా అధికార పార్టీ ప్రముఖులు కొట్టి పారేస్తుంటారు. చాలా సందర్భాల్లో వైఎస్సార్సీపీ పార్టీ కేడర్, ఎమ్మెల్యేల అనుచరులు దందాలు సాగిస్తూ దొరికిపోతే.. అప్పుడు కూడా అధికార పార్టీ వారు ఏదోక రీతిగా మాటల గారడీ చేస్తుంటారు. కానీ తాజా ఘటనలో ఇసుకను రాష్ట్రం సరిహద్దులు దాటి స్మగ్లింగ్ సాగిస్తున్న వారు పోలీసులకు చిక్కారు. వారు అధికార పార్టీ ముద్ర ఉన్న వారు మాత్రమే కాదు.. సాక్షాత్తూ మంత్రి గారికి అత్యంత సన్నిహితులు. సదరు మంత్రిగారు కూడా.. అవినీతి ఆరోపణలతో గతంలో బహుముఖంగా రచ్చకెక్కిన చరిత్ర ఉన్నవారు.
వివరాల్లోకి వెళితే..
మద్యం విషయంలో అసామాన్యంగా ధరలు పెంచేసిన తర్వాత.. ఇతర రాష్ట్రాల నుంచి స్మగ్లింగ్ పెరిగింది. ఈ స్మగ్లింగ్ తో పాటు, నాటు సారా తయారీని కూడా అడ్డుకోడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఎక్సయిజు శాఖకంటె భిన్నంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్)ను ఏర్పాటు చేసింది. వారు కొన్నాళ్ల వరకు మద్యం విషయాలు మాత్రమే పట్టించుకున్నారు గానీ.. వారి పరిధిని పెంచుతూ సర్కారు ఇసుక అక్రమ రవాణా తదితర వ్యవహారాలను కూడా అప్పగించింది. సదరు సెబ్ అధికారులు జరిపిన తనిఖీల్లో ఆంధ్ర కర్ణాటక సరిహద్దులో ఇసుక దోపిడీకి వ్యవహారాలు కొన్ని పట్టుబడ్డాయి. ఈ మేరకు అనంత పురం జిల్లా పరిధిలోని హోలగుండ పోలీసు స్టేషన్ పరిధిలో దొరికిన ఇసుక రవాణాకు సంబంధించి విక్రాంత్ రెడ్డి ఏ1 గా కేసు నమోదు చేశారు. సదరు విక్రాంత్ రెడ్డి మంత్రి జయరాంకు అత్యంత సన్నిహితులనే ప్రచారం ఉంది.
ఏ1 విక్రాంత్ రెడ్డి వైఎస్సార్ సీపీ నేత కావడంతో.. మంత్రి జయరాంతో ఆయనకున్న సాన్నిహిత్యాన్ని తెలియజెప్పే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Must Read ;- సవరించిన నిబంధనలతో అక్రమార్జన.. లంక గ్రామాల్లో రెచ్చిపోతున్న ఇసుకాసురులు
ఎఫ్ఐఆర్ ప్రకారం..
అనంతపురం జిల్లా హోలగుండ మండలం మర్లమడికి గ్రామ సమీపంలోని వేదవతి నుంచి ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అయితే ఈ ఇసుకకు సంబంధించి ఒక్కో ట్రాక్టరుకు లోడింగ్ చార్జీల నిమిత్తం రూ.450 మాత్రం వసూలు చేయాల్సి ఉండగా.. నిందితులు ఏ1 విక్రాంత్ రెడ్డి, ఏ2 జి.రామిరెడ్డి.. ట్రాక్టరు డ్రైవర్లనుంచి బలవంతంగా.. రూ.900 వంతున వసూలు చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. చాలా రోజుల నుంచి ఇదే తరహాలో ట్రాక్టరు డ్రైవర్లనుంచి బలవంతంగా రెట్టింపు సొమ్ము లోడింగ్ ఛార్జీల నిమిత్తం వసూలు చేస్తున్నారనేది ఆరోపణ!
తమాషా ఏంటంటే..
ఇసుక విషయంలో ప్రభుత్వం నిబంధనలు మార్చింది. కొత్త విధానంలో ఎలాంటి అవకతవకలు ఉండవని ప్రకటించారు. అయినా సరే.. దోచుకోడానికి తెగించిన వారికి ఎన్నెన్ని వక్రమార్గాలైనా అందుబాటులో ఉంటాయనడానికి ఇది నిదర్శనం. లోడింగ్ కాంట్రాక్టు ఇప్పించుకుంటే చాలు.. లోడింగ్ ఖర్చుల కింద ఒక్కో ట్రాక్టరుకు ప్రభుత్వం నిర్దేశించే మొత్తం ఎంతఅయినా సరే.. రాజకీయ అండదండలు తమకు పుష్కలంగా ఉంటే.. రెండు రెట్లు మూడు రెట్లు అయినా సరే.. అడ్డగోలుగా దండుకోవచ్చునని ఈ దృష్టాంతంతో తెలుస్తోంది.
జయరాంకు ఎంత సన్నిహితుడంటే..
ఇసుక లోడింగ్ ఛార్జీల రూపేణా అక్రమ దందా సాగిస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ1 విక్రాంత్ రెడ్డి, మంత్రి జయరాంకు చాలా సన్నిహితుడు. వీరి సాన్నిహిత్యాన్ని తెలిపే ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జయరాం ఇప్పటికే పలు వివాదాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తన కొడుకు ఈశ్వర్కు బెంజికారు కానుకగా తీసుకున్న వ్యవహారం ఆయన అవినీతి బాగోతాల గురించి ఎంతగా రచ్చకీడ్చిందో ఎవ్వరికీ తెలియని సంగతి కాదు.
అంతకంటె తమాషా ఏంటంటే.. డిసెంబరు 11 వ తేదీన విక్రాంత్ రెడ్డిపై కేసు నమోదు అయింది. డిసెంబరు 13వ తేదీన.. జయరాం కొడుకు ఈశ్వర్ పుట్టిన రోజు జరిగింది. ఈ పుట్టినరోజు వేడుకల్లో కూడా మంత్రి జయరాంతో పాటు, అత్యంత కీలకంగా.. విక్రాంత్ రెడ్డి కూడా పాల్గొనడం విశేషం. అధికార పార్టీ నాయకుల, ఏకంగా మంత్రుల అండదండలు ఉండేట్లయితే.. ఒకవైపు పోలీసు కేసులు నమోదు అవుతూనే ఉన్నప్పటికీ.. ఎంత ఘాటుగా అయినా చెలరేగిపోవచ్చుననే తీరులో.. వీరు బరితెగించినట్లుగా ప్రజలు అనుకుంటున్నారు.
Also Read ;- దశా దిశా లేని దిశ చట్టం అస్తవ్యస్తమైన ఇసుక విధానం ఇవీ జగన్ నిర్ణయాలు
మంత్రి జయరాం కొడుకు పుట్టినరోజు వేడుకల గురించి ప్రజాశక్తి వెబ్ సైట్ లో ప్రచురితమైన వార్తా కథనం:
ఇసుక లోడింగ్ చార్జీల అక్రమ దందా విషయమై సెబ్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ :