రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు తమ రాష్ట్రాలకే పరిమితం. తమ సొంత రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీల కిందే లెక్క. అలా కాకుండా కేవలం తమ సొంత రాష్ట్రాల ఎన్నికలకు మాత్రమే పరిమితమైన పార్టీలు ఇప్పుడు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్, ఏపీలో అధికార పార్టీ వైఎస్సార్సీపీలు కేవలం ప్రాంతీయ పార్టీలుగానే కొనసాగుతున్నాయి. తెలుగు నేల రాజకీయాలను తనదైన శైలిలో ప్రభావితం చేసిన తెలుగుదేశం పార్టీ.. ఏపీతో పాటు తెలంగాణలో ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్న దృష్ట్యా ఆ పార్టీని జాతీయ పార్టీ కిందే పరిగణించాలి. తెలంగాణకు మాత్రమే పరిమితమైన పార్టీగా రికార్డుల మీద రికార్డులు కొట్టేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు ఓ అరుదైన రికార్డును సొంత చేసుకుంటోంది. దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయం కలిగిన తొలి ప్రాంతీయ పార్టీగా గులాబీ దళం అవతరించనుంది.
రేపే పునాది రాయి
2001 ఏప్రిల్ 27న కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేతృత్వంలో పురుడుపోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి 14 ఏళ్ల పాటు ఉద్యమాన్ని నడిపి తెలంగాణ ప్రజల చిరకాల కలను సాకారం చేస్తూ తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించింది. ఆ తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. రాష్ట్రానికి తొలి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టటారు. ఆ తర్వాత 2019లో ఎన్నికలు జరగాల్సి ఉన్నా.. ఆరు నెలలు ముందుగా ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్.. వరుసగా రెండో పర్యాయం సీఎంగా పదవీ బాధ్యతలను చేజిక్కించుకున్నారు. ఈ క్రమంలో ఇటుయ కేసీఆర్, అటు టీఆర్ఎస్ పేరిట సరికొత్త రికార్డులు నమోదయ్యాయి.
కొత్త రికార్డు వేళ సంబరాలు
ఇదిలా ఉంటే.. తమ పార్టీ కార్యాలయం కోసం ఢిల్లీలో స్థలాన్ని కేటాయించాలని కోరుతూ కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి గతంలో లేఖ రాశారు. ఈ లేఖను పరిశీలించిన కేంద్రం ఢిల్లీలోని వసంత్ విహార్ మెట్రో స్టేషన్ సమీపంలో 1,10 గజాల స్థలాన్ని కేటాయించింది. ఈ స్థలంలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించేందుకు చాలా కాలం క్రితమే కేసీఆర్ నిర్ణయించినా.. ఎప్పటికప్పుడు అది వాయిదా పడుతూనే వస్తోంది. అయితే ఈ దఫా ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి కేసీఆర్ ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ నెల 2న అంటే.. గురువారం నాడు స్వయంగా కేసీఆరే.. ఈ భవన నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయమే మంత్రులు, పార్టీ కీలక నేతలంతా ఢిల్లీ చేరుకుని స్థలాన్ని, అందులో భూమి పూజకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. బుధవారం మధ్యాహ్నం డిల్లీ ఫ్లైటెక్కనున్న కేసీఆర్.. మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగానే.. ఆయన ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేస్తారు. ఈ భవన నిర్మాణం పూర్తి అయితే ఢిల్లీలో పార్టీ కార్యాలయం కలిగిన తొలి ప్రాంతీయ పార్టీగా టీఆర్ఎస్ కు గుర్తింపు లభించనుంది.