మహానటి కీర్తి సురేష్ కు భలే భలే అవకాశాలు వచ్చిపడుతున్నాయి. సూపర్ స్టార్లతో నటించే అవకాశం వస్తే అంతకంటే కావలసింది ఏముంటుంది. తమిళ సూపర్ స్టార్ రజనీతో కలిసి నటిస్తోంది. ఇప్పటికే బిజీబిజీగా ఉన్న ఈ మలయాళ కుట్టి తాజాగా తెలుగు సూపర్ స్టార్ మహేశ్ బాబుతో జోడీ కట్టే అవకాశం కూడా వచ్చేసింది. మహేశ్ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట సినిమా’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేశ్ కు జోడీగా కీర్తి అయితే బాగుంటుందని ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా కథావస్తువు కూడా వైవిధ్యంగా ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ కథ ఉంటుందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ – జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ – 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి పాన్ ఇండియా కలర్ తీసుకురావాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారీ బడ్జెట్ తో ఏ మాత్రం రాజీ పడకుండా సినిమాని తెరకెక్కించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో మహేశ్ పాత్ర రెండు షేడ్స్ లలో ఉంటుందని తెలుస్తోంది.
ఇందులో నటించే నటుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విలన్ గా బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ పేరు ఇప్పటికే తెరమీదకు వచ్చింది. ఇందులో కూడా బాలీవుడ్ హీరోయిన్ పేరే తెరపైకి వచ్చినా ఆ తర్వాత నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ సినిమాకు సంబంధించి అమెరికా షూటింగ్ కు కూడా ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. చిత్ర యూనిట్ వీసా కోసం దరఖాస్తు చేయడంతో వివరాలన్నీ ఒక్కొటొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇతర వివరాలను త్వరలోనే చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించనుంది.