‘తీగ లాగితే డొంక కదిలినట్లు’ నార్కో కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారణలో పలువురి నటీమణుల పేర్లు బయటికి వచ్చాయి. సుశాంత్ సింగ్ రాజపూత్ ఆత్మహత్య కేసు సందర్భంగా బయటపడ్డ డ్రగ్స్ కోణంపై అధికారులు టాలెంట్ మేనేజర్ జయ షాని విచారించారు. పలువురు నటీ నటీమణులు డ్రగ్స్ గురించి షాతో చాట్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ చాట్ చేసిన వారిలో స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొనె, శ్రద్దా కపూర్ ఉండటం సంచలనం రేపింది. వీరికి సమన్లు జారీ చేసిన అధికారులు విచారణకు తమ ముందు హజరుకావాలని ఆదేశించారు. 2017 నుంచి వీరు డ్రగ్స్ గురించి షాతో చాట్ చేసినట్లు తెలుస్తోంది.
రియా నుంచి మొదలుకొని
జూన్ 14న ముంబైలో బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన ముంబై పోలీసులు ఇది ఆత్మహత్యగా నిర్దారించారు. సుశాంత్ తండ్రి బీహార్ పోలీసులకు చేసిన ఫిర్యాదుతో ఈ కేసు టర్న్ తీసుకుంది. తన కొడుకు అకౌంట్ నుంచి డబ్బులు భారీగా బదలాయింపు జరిగిందని ఆయన చేసిన ఫిర్యాదుతో ఈడీ రంగంలోకి దిగింది. డబ్బులు వేరే అకౌంట్ కు ట్రాన్స్ఫర్ అయినట్లు నిర్దారించిన ఈడీ సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తికి నోటీసులు జారీ చేసింది. ముంబై పోలీసులు ఈ కేసును నీరు కారుస్తున్నారని దీనిపై లోతయిన విచారణ జరపాలంటూ దేశ వ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. దీంతో బీహార్ సీఎం నితీష్ కుమార్ విజ్ఞప్తి మేరకు కేంద్రం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. ఇదే సమయంలో ఉన్నత న్యాయస్థానం కూడా సీబీఐకి అధికారాలు ఇస్తూ ముంబై పోలీసుల నుంచి కేసును బదలాయించారు.
రంగంలోకి దిగిన సీబీఐ తమ విచారణను మొదటి రోజు నుంచే వేగవంతం చేసింది. రియా చక్రవర్తి, ఆమె సోదరుడిని పలుమార్లు విచారించిన అధికారులు డ్రగ్స్ కోణాన్ని బయటపెట్టారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేశారు. ఈ విచారణలో రియా కొందరి పేర్లను బయట పెట్టినట్లు తెలుస్తోంది. టాలెంట్ మేనేజర్ జయ షాని విచారించారు.
చాట్ లో అసలు వ్యవహరం
ఈ విచారణలో దీపికా పదుకొనె, ఆమె బిజినెస్ మేనేజర్ కరిష్మా ప్రకాష్ లు డ్రగ్స్ కోసం చాట్ చేసినట్లు బయటపడింది. 2017 అక్టోబర్ 28 రాత్రి 10 గంటలకు డ్రగ్స్ గురించి జరిగిన ఓ చాట్ వెలుగులోకి వచ్చింది. దీపికా పదుకొనె మాల్ ఉందా అని అడిగిన ప్రశ్నకు కరిష్మా ప్రకాష్ ఉంది కానీ నేను బాంద్రాలో ఉన్నాను … ఒక వేళ అవసరమైతే అమిత్ ను అడగమంటావా? అని మెసెజ్ చేశారు. దీనికి దీపికా ఎస్ చెప్పడం చాట్ లో బయటపడింది. వీడ్ వద్దు హాష్ కావాలంటూ దీపికా పదే పదే అడిగింది. పబ్ కు ఎప్పుడు వస్తున్నావు అంటూ కరిష్మా అడిగిన ప్రశ్నకు 11:30కి వస్తాను అంటూ ఆమె చేసిన చాట్ మొత్తాన్ని ఎన్సీబీ అధికారులు బయటపెట్టారు. ఇదే సమయంలో శ్రద్దా కపూర్, షాల మధ్య జరిగిన చాట్ బయటికి వచ్చింది. దీంతో అధికారులు వీటికి నోటీసులు జారీ చేశారు. రియా చక్రవర్తి విచారణ సమయంలో రకుల్ ప్రీత్ సింగ్, సారాఅలీఖాన్ పేర్లు బయటపెట్టడంతో వారికి కూడా ఎన్సీబీ అధికారులు సమన్లు జారీ చేశారు. దీపికాను శుక్రవారం, సారా, శ్రద్ద కపూర్ లను శనివారం విచారించనుంది.