నిషేధిత డ్రగ్స్ కేసులో తెలుగు చిత్ర పరిశ్రమ టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు పీకల్లోతుగా మునిగిపోయారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో తెలంగాణ ఎక్సైజ్ శాఖ వెలికి తీసిన ఈ కేసు విచారణకు టాలీవుడ్ ప్రముఖులు క్యూ కట్టిన వైనం కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితేఈ వ్యవహారంలో రాజకీయ ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నారని, అందుకే ఈ కేసును నీరుగార్చే దిశగా నాటి తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్ ను బదిలీ చేశారన్న వాదనలు వినిపించాయి. అకున్ సభర్వాల్ బదిలీ కాగానే.. ఈ కేసు దర్యాప్తు అటకెక్కేసింది. అయితే ఓ స్వచ్ఛంద సంస్థ చేసిన ఫిర్యాదులో ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగిందన్న విషయాన్ని పసిగట్టిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చాలా కాలం పాటు ఈ కేసును గుట్టుగానే దర్యాప్తు సాగించింది. ఈ రహస్య దర్యాప్తులో భాగంగా సినీ తారలకు మత్తు పదార్థాలు సరఫరా చేసి.. ఈ కేసులో కీలక పాత్రధారిగా భావిస్తున్న విదేశీయుడు కెల్విన్ ను ఏకంగా 12 దఫాలుగా విచారించిందట. ఈ సందర్భంగా కెల్విన్ ఏకంగా అప్రూవర్ గా మారిపోయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఎక్సైజ్ కు చెప్పకున్నా.. ఈడీకి చెప్పేశాడు
అకున్ సభర్వాల్ నేతృత్వంలో జరిగిన విచారణ సందర్భంగానూ కెల్విన్ ను సుధీర్ఘంగా విచారించారు. అయితే ఆ విచారణకు కెల్విన్ ఎంతమాత్రం సహకరించలేదట. దీంతోనే ఈ కేసు దర్యాప్తు నాడు ముందుకు సాగలేదన్న వాదనలు లేకపోలేదు. అయితే ఈడీ రంగంలోకి దిగాక.. కెల్విన్ కు క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి. వరుసబెట్టి 12 సార్లు విచారణకు పిలిచిన ఈడీ అధికారులు కెల్విన్ ను పలు కోణాల్లో విచారించారట. తొలుత ఏమీ చెప్పకుండానే మసలిన కెల్విన్ వరుస విచారణలతో బెంబేలెత్తిపోయి మొత్తం గుట్టును విప్పేశాడట. విచారణ సందర్భంగా కెల్విన్ బ్యాంకు స్టేట్ మెంట్లను పరిశీలించిన ఈడీ.. అతడి ఖాతాలకు సినీ తారలు ఎవరెవరు డబ్బు పంపారన్న విషయాన్ని పసిగట్టి.. ఆ తర్వాత అతడి బ్యాంకు అకౌంట్లను సీజ్ చేశారు. వెరసి సినీ తారల మత్తు పదార్థాల సేకరణకు సంబంధించిన పూర్తి వివరాలను కెల్విన్ నుంచి ఈడీ రాబట్టేసింది.
స్టార్ల ఖాతాల సీజ్ తప్పదా?
కెల్విన్ చెప్పిన వివరాల మేరకే తాజాగా ఈ కేసు దర్యాప్తును ప్రారంభించిన ఈడీ.. అతడిచ్చిన వివరాల ఆధారంగానే టాలీవుడ్ ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా మంగళవారం నాడు విచారణకు హాజరైన డైరెక్టర్ పూరీ జగన్నాథ్ బ్యాంకు లావాదేవీల వివరాలను సేకరించింది. ఏకంగా 10 గంటల పాటు పూరీని విచారించిన ఈడీ.. అసలు కెల్విన్ ఖాతాలకు డబ్బు ఎందుకు పంపారని కూడా అడిగిందట. అంతేకాకుండా పూరీ బ్యాంకు స్టేట్ మెంట్లలో ఆఫ్రికా దేశాలకు కూడా పూరీ నగదు పంపినట్లు కూడా ఈడీ గుర్తించింది. విచారణ సందర్భంగా పూరీ బ్యాంకు లావాదేవీలను, కెల్విన్ బ్యాంకు స్టేట్ మెంట్లను ముందు పెట్టగా.. పూరీ తప్పించునే అవకాశమే లేకుండా పోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక పూరీ తర్వాత విచారణకు హాజరయ్యే సినీ ప్రముఖులకు కూడా ఇదే తరహా పరిస్థితి ఎదుకు కానుందట. త్వరలోనే కెల్విన్ ఖాతాలను సీజ్ చేసిన మాదిరిగానే సినీ ప్రముఖుల బ్యాంకు ఖాతాలను కూడా సీజ్ చేసే దిశగా ఈడీ కదులుతోండట. మొత్తంగా అప్రూవర్ గా మారిపోయిన కెల్విన్.. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ ప్రముఖులను అడ్డంగా బుక్ చేసేశాడనే చెప్పాలి.











