‘జబర్దస్త్’ షోలో ఉన్న అనేకమంది టీం లీడర్లలో కెవ్వు కార్తీక్ ఒకడు. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను టీవీల ముందు కట్టిపడేస్తాడు కార్తీక్. ఇంతకముందు అవినాష్ తో కలిసి స్కిట్స్ చేసేవాడు కార్తీక్. అయితే అవినాష్ బిగ్ బాస్ షోకు వెళ్లడంతో సోలోగా దూసుకుపోతున్నాడు. ఎప్పుడు ప్రేక్షకులను నవ్వించే కార్తీక్ తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నాడు. అతడిపై కిడ్నాప్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే భూపతిపేటలో ఉంటున్న తనపై కార్తీక్ ఆయన మనుషులు వచ్చి దాడి చేశారని రవి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కార్తీక్ వెంట ఐదుగురు వ్యక్తులు వచ్చి తనను కిడ్నాప్ చేశారని, కారులో 15కిలో మీటర్లు తీసుకువెళ్లి బాగా కొట్టారని పోలీసులకు తెలిపాడు హరి. ఈ దాడికి కార్తీక్ కుటుంబసభ్యులే కారణం అని ఫిర్యాదులో పేర్కొన్నాడు. హరి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కార్తీక్ పై అలాగే ఆయన కుటుంబసభ్యులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని ఎస్సై సురేశ్ నాయక్ తెలిపారు. వెంటనే ఈ కేసుపై విచారణ మొదలుపెడతామని ఆయన అన్నారు. దీనిపై కార్తీక్ స్పందించాడు.
కావాలనే హరి అనే వ్యక్తి తమ పై తప్పుడు అభియోగాలు మోపాడని, విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని తెలిపాడు. 18 సంవత్సరాల నుండి హరి తన బావ కుటుంబాన్ని వేధిస్తున్నాడని, అలాగే నలుగురిలో నా కోసం, నా కుటుంబం కోసం చులకనగా మాట్లాడుతున్నాడని కార్తీక్ తెలిపాడు. తమ పరువు తీయడానికే ఫేక్ కేసు పెట్టాడని ఆరోపించాడు. క్యాన్సర్ తో బాధపడుతున్న తన తల్లిని కూడా ఈ వివాదంలోకి తీసుకువచ్చి, ఆమెపై కూడా కేసు పెట్టడం పట్ల కార్తీక్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ కేసులోని నిజనిజాలు వెలికితీసే పనిలో పడ్డారు పోలీసులు.