హైదరాబాద్ వరదలతో మునిగిపోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలే కారణమని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పి గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచిందని తెలిపారు. ఓల్డ్ సిటీ ఓవైసీ కుటుంబానికి, న్యూసిటీ కల్వకుంట్ల కుటుంబానికి అన్నట్లుగా హైదరాబాద్ను ఇరువురు పంచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అధికార పార్టీ నిర్లక్ష్యం కారణంగానే నగరంలో వందల ఇళ్లు నీట మునిగాయన్నారు. వరదలను నియంత్రించటంలో, ప్రజలను ఆదుకోవటంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనబడుతోందన్నారు. కరోనా సందర్భంలో ఒక్క ఆసుపత్రినైనా సీఎం సందర్శించారా? అని ప్రశ్నించారు. వరదల కారణంగా చనిపోయిన కుటుంబాలకు పరామర్శించే సమయం కూడా కేసీఆర్కు లేదాఅని ఈరోజు హైదరాబాద్ హాకీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బాధితులను ఆదుకునేందుకు ప్రకటించిన వరద సాయం కూడా టీఆర్ఎస్ నేతల జేబుల్లోకి వెళ్లిందని ఆయన ఆరోపించారు. మోడీ ప్రభుత్వాన్ని విమర్శించటమే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు పెట్టుకున్నారన్నారు. కేంద్రం ఉచితంగా ఇస్తున్న సెనగలు, కందిపప్పు గోడౌన్లలో ముక్కిపోతున్నారు. లక్ష ఉద్యోగాలు, లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఏమైపోయాయని ఆయన ప్రశ్నించారు.
యజ్ఞయాగాలు చేస్తే హిందువులా?
బహిరంగ సభలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. తన కుమారుడిని సీఎం చేసేందుకు కేసీఆర్ పూజలు చేస్తున్నారని ఆరోపించారు. యజ్ఞయాగాలు చేసినంత మాత్రాన హిందువులైపోరని మండిపడ్డారు. తానే హిందువుగా చెప్పుకునే కేసీఆర్.. హిందూ దేవుళ్లను అవమానించే పార్టీతో పొత్తులు పెట్టుకున్నారని విమర్శించారు. తెలంగాణ మంత్రులు అహంకారంతో విర్రవీగుతున్నారని బండి సంజయ్ తెలిపారు. బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ నేతలు కొందరు ఈరోజు బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. బీజేపీ కండువా కప్పుకున్న వారిలో కంటోన్మెంట్ బోర్డు సభ్యుడు, మాజీ సభ్యులు, ఉపాధ్యాక్షులు, కార్పొరేటర్లు ఉన్నారు. ఈ సభలో ఎమ్మెల్సీ రాంచందర్ రావు, బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.











