(తిరుపతి నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
ఏపీ మంత్రి కొడాలి నాని బీజేపీని రెచ్చగొడుతున్నారు. అంతవరకు క్లియర్. ఏదో మీడియా ఇంటర్వ్యూల్లో గానీ, చర్చల్లో గానీ, ఎదుటి పార్టీ వారి వైఖరి చిరాకు పుట్టచినప్పుడు గానీ.. ఉద్రేకంలో రెచ్చిపోయి దుడుకు వ్యాఖ్యలు చేయడం ఒక ఎత్తు. కానీ.. నాని మాటలను గమనిస్తోంటే.. ఆయన పని గట్టుకుని, రెచ్చగొట్టడానికి మాత్రమే వ్యాఖ్యలను పేర్చుకుంటూ ఒక పద్ధతి ప్రకారం.. బీజేపీని కార్నర్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
అనాలోచితంగా లేదా పద్ధతి ప్రకారమా తెలియదు కానీ మంత్రి కొడాలి నాని బీజేపీని రెచ్చగొడుతున్నారు. ఆ పార్టీ బలం ఎంతో బిజెపి నేతలకు గుర్తు చేస్తున్నారు. అనవసర విమర్శలు మాని ముందుగా పార్టీ బలం పెంచుకోవాలని సలహా ఇచ్చారు. తిరుమల పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాలని బిజెపి డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
బిజెపికి తోడు పలు ధార్మిక సంస్థలు, తెలుగుదేశం పార్టీ సైతం సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నాయి. చిత్తూరు జిల్లా టిడిపి నేతలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో సైతం చంద్రబాబు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. డిక్లరేషన్ విషయమై జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు జిల్లా వ్యాప్తంగా టిడిపి నేతలను ఎక్కడికక్కడ అ హౌస్ అరెస్ట్ చేశారు. బిజెపి నేతలను సైతం ముందు జాగ్రత్తగా గృహనిర్బంధం చేశారు.
వాతావరణం వేడెక్కించిన నాని
మంత్రి కొడాలి నాని ఇటీవల చేసిన వ్యాఖ్యలతో రాజకీయం వేడెక్కిన విషయం తెలిసిందే. తిరుమలలో అన్యమతస్తులకు డిక్లరేషన్ విధానాన్ని ఎవడు పెట్టాడు, ఆ విధానాన్ని తీసివేయాలని వ్యాఖ్యానించడంతో పాటు ఇటీవల రాష్ట్రంలో జరిగిన హిందూ దేవుళ్ళ విగ్రహాలపై దాడులు, అంతర్వేది రథం దగ్ధం విషయాలపై కూడా చులకనగా మాట్లాడారు. దీంతో మంత్రివర్గం నుంచి కొడాలి నానిని బర్తరఫ్ చేయాలని బిజెపి డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా మంత్రి కొడాలి నాని బుధవారం మధ్యాహ్నం తిరుమలలో ప్రత్యక్షమయ్యారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో రెండున్నర గంటల్లో తిరుపతిలో అడుగుపెడతారు అనగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని తిరుమలలో ప్రత్యక్షం అయ్యారు. మంత్రి తిరుమల చేరుకునే వరకు ఈ విషయం ఎవరికి తెలియక పోవడం విశేషం.
ఈ సందర్భంగా తిరుమలలో మంత్రి విలేకర్లతో మాట్లాడుతూ తన బర్తరఫ్ డిమాండ్పై తీవ్రంగా స్పందించారు. పది మందిని వెంటేసుకొని ధర్నా చేస్తే అమిత్ షాను మంత్రి వర్గం నుంచి తొలగిస్తారా అని ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా అ మోదీని తొలగించమంటే బిజెపి తొలగిస్తుందా అన్నారు.
ఎవరి పార్టీ వ్యవహారాలు వాళ్లు చూసుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. అంతేకాక గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన బిజెపి, 50 శాతానికి పైగా ఓట్లు వచ్చిన మాకు సలహా ఇవ్వడం ఏంటని ఎద్దేవా చేశారు. ఒకటి నుంచి నాలుగు శాతం ఓట్లు ఎలా పెంచుకోవాలో ఆ పార్టీ నేతలు చూసుకుంటే మంచిదని పేర్కొన్నారు. దీంతో బీజేపీతో వైసిపి తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధ పడిందని స్పష్టం అవుతోంది. అనాలోచితంగా కాకుండా పద్ధతి ప్రకారమే బీజేపీపై వైసిపి ఎదురుదాడి చేస్తోందని వెల్లడి అవుతోంది.











