పేదలకు సెంటు భూమి ఇవ్వడానికి అంగీకరించని అమరావతిలో అసెంబ్లీ ఉంచడం కూడా దండగేనంటూ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వైసీపీ అధిష్ఠానం మదిలో మాటను మంత్రి కొడాలి నానీ ద్వారా చెప్పించారనే అనుమానాలు ప్రజల్లో వస్తున్నాయి. అమరావతి రాజధానిని మొత్తం తరలిస్తున్నామంటే తీవ్ర వ్యతిరేకత వస్తుందని అందుకే, అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ గా ఉంటుందని ప్రకటించారు. ఇందులో నిజం లేదనే భయాలకు తాజాగా మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి. విశాఖలో మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాక, ఇక అమరావతి రాజధాని నుంచి అసెంబ్లీ కూడా విశాఖలకు తరలిస్తారని సమాచారం.
రాజధాని సంపూర్ణంగా తరలించేయడమే ప్లాన్.
పాలనా వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని అసెంబ్లీ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన విషయం విదితమే. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. రాజధాని తరలింపుపై సుప్రీంకోర్టులో కేసులు ఉండటంతో, ఈలోగా విశాఖలో పాలనకు అవసరమైన భవనాలు సిద్దం చేసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారట. రాజధాని పేరుతో కాకుండా దానికి అతిథి గృహ నిర్మాణం అనే అందమైన పేరు పెట్టారు.
ఎక్కడైనా 30 ఎకరాల్లో అతిథి గృహం నిర్మించడం ఎవరైనా విన్నారా? కన్నారా? అది పరిపాలనా కేంద్రంగా ఉపయోగించుకునే భవనాల నిర్మాణమని అందిరికీ అర్థమవుతోంది. మొదట విశాఖలో అతిథి గృహ నిర్మాణం ఏమీ లేదని బుకాయించినా తాజాగా మంత్రి అవంతి శ్రీనివాస్ విశాఖతో కలుపుకుని మొత్తం నాలుగు గెస్ట్ హౌసులు కడుతున్నామని చెప్పకనే చెప్పారు. అంటే విశాఖలో ప్రభుత్వం నిర్మించేది అతిథి గృహం కాదు పరిపాలనా భవనం అని అర్థం అవుతోంది.
కొడాలి వ్యాఖ్యల వెనుక వైసీపీ పెద్దలు?
అవును. మంత్రి కొడాలి నాని తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అమరావతి రాజధానిలో గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని పేదలకు సెంటు భూమి చొప్పున రాజధానికి సేకరించిన 1200 ఎకరాలు ఇవ్వాలని వైసీపీ ప్రభుత్వ నిర్ణయించింది. దీనిపై రాజధాని రైతులు హైకోర్టును ఆశ్రయించి స్టే సాధించారు. దీంతో ఆ వ్యవహారానికి బ్రేక్ పడింది. దీనిపై తాజగా మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పేదలకు సెంటు భూమి ఇవ్వడానికి అంగీకరించని అమరావతిలో అసెంబ్లీ ఉండటం కూడా వేస్ట్ అని అనేశారు. దీంతో అమరావతి రైతుల్లో ఆగ్రహం పెల్లుబికుతోంది. అసలే రాజధాని మూడు ముక్కలైదని బాధపడుతుంటే… కొడాలి వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. ఈ వ్యాఖ్యలు కొడాలి నాని స్వయంగా చేసినవి కావని, ఇటీవలి మంత్రి మండలి సమావేశం అనంతంరం కొడాలి నాని, సీఎం జగన్మోహన్ రెడ్డితో కాసేపు ఏకాంతంగా సమావేశ మయ్యారని, దీని ఫలితమే తాజా వ్యాఖ్యలని తెలుస్తోంది.
గుంటూరు, కృష్ణా జిల్లా వైసీపీ నేతలు ఎవరూ కొడాలి వ్యాఖ్యలను కనీసం ఖండించలేదు. అంటే ఈ రెండు జిల్లాల వైసీపీ నేతలకు కూడా అమరావతి శాసన రాజధానిగా కూడా భవిష్యత్తులో ఉండదని తెలుసుననే ప్రజలు అనుకుంటున్నారు. కానీ ఎవరూ నోరు మెదపడంలేదు. పొరపాటున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడాలన్నా కూడా భయపడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు.
రగిలిపోతున్న రాజధాని రైతులు
మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలతో రాజధాని రైతులు ఆగ్రహంతో ఉన్నారు. దీని ప్రభావం గోదావరి పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టు భూ సేకరణపై పడింది. గోదావరి నీటిని కృష్ణానదికి అక్కడ నుంచి పెన్నాకు తరలించే ప్రాజెక్టు కాలువలకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియలో భాగంగా రెవెన్యూ అధికారులు అమరావతి మండలం నరుకుళ్లపాడులో మీటింగ్ పెట్టారు. అక్కడి రైతులు అధికారులకు చుక్కలు చూపించారు. రిజిస్ట్రేషన్ రేటుకన్నా 2.7 శాతం అధికంగా ధర చెల్లించినా మా భూములు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. రాజధాని పక్కగ్రామాలు కావడంతో ఆ గ్రామాల భూములు గరిష్టంగా ఎకరా రూ.కోటి రూపాయల వరకూ పలికాలి. ప్రస్తుతం రైతులకు ఎకరాకు రూ.2 కోట్ల పరిహారం ఇస్తేనే భూములు ఇస్తామని అదికూడా డబ్బు చెల్లించిన తరవాతే పనులు మొదలు పెట్టుకోవాలని షరతు పెట్టారు. దీంతో చేసేది లేక రెవెన్యూ అధికారులు వెనుతిరిగారు. ఇవన్నీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యల ఫలితమే. కొడాలి వ్యాఖ్యలు ఇంతటితో చల్లారేలా లేవు. ఈ వ్యాఖ్యల దుమారం ఎటుదారి తీస్తుందో వేచి చూడాల్సిందే.











