(విజయనగరం నుంచి లియో న్యూస్ ప్రత్యేక ప్రతినిధి)
ఉత్తరాంధ్ర వైసీపీ రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జి, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి కల నెరవేరనుంది. ఆయన రాజకీయ జీవితంలో చిరకాల వాంఛ అయిన మంత్రి పదవి రేపోమాపో వరించనుంది. ప్రస్తుత రాష్ట్ర కేబినెట్లో వైశ్య సామాజిక వర్గానికి చెందిన వెల్లంపల్లి శ్రీనివాసరావుపై స్వపక్ష, విపక్షాలనుండి విమర్శలు వెల్లువెత్తుతుండటం, దేవాదాయశాఖ మంత్రిగా ఆయన పనితీరుపై ఆరోపణలు ముంచెత్తుతుండటంతో సీఎం జగన్ ఆయనకు చెక్ చెప్పబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు వెల్లంపల్లికి కేబినేట్ నుండి ఉద్వాసన పలికి అదే సామాజిక వర్గానికి చెందిన కోలగట్ల వీరభద్ర స్వామికి స్థానం కల్పించనున్నట్లు తెలిసింది. ఇదే వాస్తవరూపం దాలిస్తే కోలగట్ల చిరకాల వాంఛ తీరడంతో పాటు ముఖ్యమంత్రి జగన్ తన మాట నిలబెట్టుకున్నట్టు అవుతుంది.
2019 సాధారణ ఎన్నికలముందు, పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి జిల్లాలో నిర్వహించిన పాదయాత్ర సందర్భంగా ఆయనను కలిసిన కోలగట్ల ‘తానింక ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొనబోనని, ఆరోగ్యం సహకరించడం లేదని, పార్టీ సేవకునిగా ఉంటానని’ చెప్పారు. ఆ తరుణంలో జగన్ కల్పించుకుని విజయనగరం అసెంబ్లీ స్థానం నుండి తప్పకుండా పోటీ చేయాలని, గెలిచొస్తే మంత్రి పదవి ఇస్తానని, ఓడిపోయినా ఎమ్మెల్సీ ఇస్తానని భరోసా ఇచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అంతేకాకుండా విజయనగరం జిల్లా నుండి తొలి ఎమ్మెల్యే అభ్యర్థి గా కోలగట్లను విజయనగరంలో నిర్వహించిన పాదయాత్రలో బహిరంగంగా ప్రకటించి ఆయనలోను, ఆయన అనుచరుల్లోనూ ఉత్సాహం నింపారు.
ఈ నేపథ్యంలో కోలగట్ల మరోమారు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గోవడం , కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిపై పోటీ పడటం, అనూహ్య విజయం సాధించడం జరిగింది. జగన్ ఊహించినట్టే వైసీపీ అత్యధిక మెజారిటీతో అధికారం చేజిక్కించుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ సామాజిక విశ్లేషణల నేపథ్యంలో కోలగట్ల వీరభద్రస్వామికి మంత్రి పదవి దక్కలేదు. ఈ పరిస్థితుల్లో స్వామి కొద్దిపాటి కినుక వహించడంతో జగన్ మరోమారు భరోసా ఇచ్చినట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితి స్వామికి అనుకూలంగా ఉండటంతో జగన్ తన మాట నిలబెట్టుకునే పరిస్థితి కనిపిస్తోందని విశ్వసనీయ సమాచారం.
పట్టువదలని విక్రమార్కునిలా ..
1989లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా విజయనగరం అసెంబ్లీ నుండి తొలిసారి గా పోటీ చేసిన కోలగట్ల వీరభద్ర స్వామి టీడీపీ అభ్యర్థి పూసపాటి అశోక్ గజపతిరాజు పై ఓడిపోయారు. అలానే 1994, 1999లోనూ అశోక్ పైనే ఓటమి పాలయ్యారు. 2004లో ఇండిపెండెంట్ గా అశోకగజపతి పై గెలిచారు. మళ్లీ 2009లో అశోకగజపతిపై, 2014లో టిడిపి అభ్యర్థి మీసాల గీతపై ఓటమికి గురయ్యారు. 2019లో వైసీపీ అభ్యర్థి గా టీడీపీ అభ్యర్థి అదితి గజపతిపై గెలుపొంది పట్టువదలని విక్రమార్కునిగా పేరు తెచ్చుకున్నారు.
సమీకరణలు అనుకూలం
ప్రస్తుత రాజకీయ వాతావరణం, రాష్ట్రంలో పరిస్థితులు, కుల పరంగా సమీకరణలు అన్నీ కోలగట్ల వీరభద్రస్వామికి కలిసి వస్తున్నాయి. వైశ్య కులానికి జగన్ కేబినెట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుడిగా వెలంపల్లి శ్రీనివాాస్ ఉన్నారు. ఇప్పుడు ఆయనను తొలగించనున్నట్లు వినిపిస్తోంది. శాఖ మార్చినంత మాత్రాన.. హిందూ ఆ:దోళనకారులు శాంతించే పరిస్థితి లేదు. ఇలాంటి నేపథ్యంలో ఆయనను తొలగిస్తే గనుక.. అదే వైశ్య కులం నుంచి, మంత్రి పదవి పొందడానికి తగిన అర్హత, సీనియారిటీ ఉన్న నాయకుడిగా కోలగట్ల పేరు వినిపిస్తోంది. అందుకే విజయనగరం జిల్లాలోని కోలగట్ల అభిమానులు ఈసారి తప్పకుండా పదవి వస్తుందని ఆశిస్తున్నారు.











