తనకు ప్రాణహాని ఉందంటూ తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాడికొండకు చెందిన శృంగారపాటి సందీప్, చలివేంద్రపు సురేష్ల వల్ల తనకు ప్రాణహాని ఉందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. సందీప్, సురేష్లు తన పేరును వాడుకుంటూ నియోజకవర్గంలో పేకాట, ఇసుక దందాలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. పెదకాకానిలో 30 మందితో పేకాట ఆడిస్తుండగా వీరిని పోలీసులు అరెస్టు చేశారని శ్రీదేవి మీడియాకు తెలిపారు. వీరి వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తోందని తాడికొండ వైసీపీ నేతలు వీరిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఆమె గుర్తు చేశారు. అయితే, వారిని సస్పెండ్ చేయించింది తానేనని వారు భావించి, తనపై కక్ష పెంచుకున్నారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన గొంతును మార్ఫింగ్ చేయడంతో పాటు, తనను అవమానపరుస్తున్నారని శ్రీదేవి తెలిపారు. బయటకు వెళితే తన వెంట పడుతున్నారని, వారి వల్ల తనకు ప్రాణహాని ఉందని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి నగరపాలెం సీఐ మల్లిఖార్జునరావుకు ఫిర్యాదు అందజేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని సీఐ వెల్లడించారు.
శ్రీదేవి వల్లే తాడికొండలో పార్టీ నాశనం అయిపోతోంది..సందీప్
తాడికొండ ఎమ్మెల్యే అవినీతి, అక్రమాల వల్లే తాడికొండలో వైసీపీ పార్టీకి చెడ్డపేరు వస్తోందని రెండు రోజుల కిందట సందీప్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆరోపించారు. ఎమ్మెల్యే ఒత్తిడితో పోలీసులు తనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి కలిసే అవకాశం ఇప్పిస్తే ఉండవల్లి శ్రీదేవి అరాచకాలన్నీ బయటపెడతానని ఆయన మీడియాకు వెల్లడించారు. సందీప్ ఆరోపణలు చేసిన రెండు రోజులకే ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. దీంతో తాడికొండ వైసీపీలో విభేదాలు మరోసారి రచ్చ కెక్కాయి.
వారి వెనుక ఆయన ఉన్నారా?
తాడికొండ వైసీపీ ఎస్సీ సెల్ విభాగంలో పనిచేస్తున్న సందీప్, సురేష్లను బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తాడికొండ నియోజకవర్గంలో నందిగం సురేష్ ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారంటూ ఎమ్మెల్యే శ్రీదేవి గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు నెలకొన్నట్లు తెలుస్తోంది. అందుకే శ్రీదేవికి వ్యతిరేకంగా ఉన్న వారిని బాపట్ల ఎంపీ ప్రోత్సహిస్తున్నారనే అనుమానాలు వస్తున్నాయని స్థానిక నేతలు అభిప్రాయపడుతున్నారు.