సలివేంద్ర సురేష్.. 26 ఏళ్ల యువకుడు. తుళ్లూరు మండలంలోని వెలగపూడి అతని స్వగ్రామం. అతను చెప్పుకుంటున్న ప్రకారం బిఏ చదివాడు కూడా. అయితే ఈ సురేష్ గురించి ఎందుకంత ప్రత్యేకంగా చెప్పుకోవడం? ఈ సందేహం ఎవరికైనా వస్తుంది. అమరావతి రాజధానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న ఆ ప్రాంతవాసుల్లో సురేష్ ఒకడు.
ఆ మాత్రం దానికి సురేష్ స్పెషాలిటీ ఏముంది లెద్దూ.. ప్రతి ఇంటికీ ఒకడు ఉన్నట్టే.. ప్రతి ఊరికీ ఇలాంటి వాడు ఒకడుండి తీరాల్సిందే అని మీరు కొట్టి పారేయవచ్చు. అంత తేలిగ్గా తీసుకోకండి. ‘మా ఊర్లో రాజధాని వద్దే వద్దు.. మేం చిన్న పని పడినా సరే యిసాపట్నానికే యెగేసుకు పోతాం.. మాకు మూడు రాజదానులే కావాల’ అంటూ ఉద్యమాలు చేసేటోడు కాదు ఈ సురేష్ అంతకంటె కాస్త ఎగస్ట్రా చేస్తుంటాడు.
రైతులకు భూమి అంటూ ఉన్న తర్వాత.. క్రయవిక్రయాలు సహజంగా జరుగుతూ ఉంటాయి. అమరావతి ప్రాంతం అందుకు అతీతం ఎంత మాత్రమూ కాదు. కానీ.. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్న రోజుల్లో అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించింది. అంతకుముందు ఆ తర్వాత కూడా భూ క్రయవిక్రయాలు జరిగాయి. అయితే ప్రభుత్వం ఆ ప్రకటన చేయడానికి ముందు రోజు వరకు ఎవరు ఎలాంటి భూములు కొన్నా.. ఆ లావాదేవీలు అన్నీ అక్రమాలే అని 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చేసింది. ఆ మేరకు మొత్తం అమరావతి ప్రాంతంలో జరిగిన అన్ని క్రయవిక్రయ లావాదేవీలన్నిటి మీద సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిసైడ్ చేసింది. ప్రభుత్వం అన్నాక.. పాత ప్రభుత్వాలు తమ రాజకీయ ప్రత్యర్థులవి అయితే గనుక.. వారు చేసిన ప్రతి పనిని తప్పుగా నిరూపించడానికి ప్రయత్నించడం సహజం. వారి పని ఏదో వారిని చేసుకోనివ్వవచ్చు కదా! ఏది తప్పు ఏది ఒప్పు.. నిదానంగా తేలుతుంది కదా! తేల్చడానికి కోర్టులు ఉన్నాయి కదా? అనుకుంటున్నారా?
నిజమే కానీ.. జగన్మోహన రెడ్డి అభిమానిగా, తాడికొండ ఎమ్మెల్యే ఉండవిల్లి శ్రీదేవికి అనుచరుడిగా తనను తాను ప్రచారం చేసుకునే ఈ సలివేంద్ర సురేష్ ఉడతా భక్తిగా తన వంతు సాయం చేయాలని అనుకున్నాడు. సీబీఐ ఎటూ ఈ ప్రాంతంలో అన్ని లావాదేవీల మీద దర్యాప్తు సాగిస్తూ ఉండగా.. వారి మీద నమ్మకం లేదో ఏమో గానీ.. కొన్ని లావాదేవీలు అక్రమం అంటూ వారికి ప్రత్యేకంగా ఫిర్యాదు చేశాడు.
సురేష్ వైసీపీ బంధం చాలా గట్టిది..
సలివేంద్ర సురేష్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వీరాభిమాని. ఎమ్మెల్యే శ్రీదేవికి అనుచరుడు. ఆమెతో కలిసి దిగిన ఫోటోనే తన ఫేస్ బుక్ ప్రొఫైల్ పిక్ గా పెట్టుకున్నాడు. అలాగే సురేష్ అన్న సైన్యం పేరుతో కూడా ఒక ఫేస్ బుక్ అకౌంట్ ఉంది. సురేష్ సలివేంద్రతో కలిసి ఫోటో దిగిన అనుచరుడి బొమ్మ ఉంటుంది. సురేష్ మాత్రం.. జగనన్నతో సమానమైన నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేస్తూ మంచి బిల్డప్ ఉంటుంది.
సదరు సురేష్ కు అధికార పార్టీతో మంచి బంధమే ఉంది. స్థానికంగా పేకాట క్లబ్ లు నిర్వహించడం దగ్గరినుంచి, ఇసుక దందాల వరకు, అదనంగా పోలీసు అధికారిని తూలనాడడం వంటి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే ఉండవిల్లి శ్రీదేవి.. సదరు సలివేంద్ర సురేష్ కు మార్గదర్శక నాయకురాలు.
అయితే సురేష్ ఫేస్ బుక్ పేజీలో బ్యానర్ ఇమేజి ఒకటి ఉంటుంది. హ్యుండాయ్ వెర్నా కారుతో దిగిన ఫోటో అది. కారుకు ఆనుకుని దర్జా వెలగబెడుతూ ఏ కారు యజమాని అయినా ఫోటో దిగవచ్చు.
ఆ కారు నెంబరు AP39 DJ 4773. కారు నెంబరులో వింతేమీ లేదు. ఆ కారును ఎవరినుంచి అయినా సదరు సురేష్ కొనుక్కొని ఉండచ్చు లేదా మిత్రుల కారు పక్కన ఫోటో దిగి ఉండవచ్చు. కానీ చిత్రమేంటంటే.. ఆ కారు మీద ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంది. అది ఎక్కడినుంచి వచ్చింది? కారేమో కొత్తది. ఈ ఏడాది జనవరిలోనే రిజిస్టరు అయింది. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వారి ట్రాన్స్పోర్టు డిపార్టుమెంట్ వారి వెబ్సైట్ తెలియజెప్పే వివరాల ప్రకారం..
ఆ కారు యజమాని పేరు కొమ్మూరి గ్రేస్ లిడియా. మరి ఆ పేరు గల వారికి ఎమ్మెల్యే స్టిక్కర్ ఎక్కడినుంచి వచ్చిందో తెలియదు. అలా ఎవరు పడితే వారు ఎమ్మెల్యే స్టికర్ వేసుకుని తిరిగేయడంలో సలివేంద్ర సురేష్ కు సంబంధం ఉన్న లోపాయికారీ ఒప్పందాలు ఏమిటో.. ఆ స్టిక్కర్ ఇచ్చిన ఎమ్మెల్యే ఎవరో.. వారితో ఉన్న అనుబంధాలు ఏమిటో తెలియదు.
పార్టీ కార్యకర్త అన్నాక, ఎమ్మెల్యే అనుచరుడు అన్నాక.. ఆ మాత్రం ఎమ్మెల్యే స్టిక్కర్ తో దందా నడిపించకపోతే ఎలా.. అసలే ఆయన బ్రిలియంట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ పేరుతో బిజినెస్ కూడా చేస్తున్నారాయె (ఫేస్ బుక్ పేజీ వివరాలు ప్రకారం) అని కూడా కొందరు సర్దుకుపోవచ్చు. కానీ సురేష్ మీద ఇంకా రకరకాల ఆరోపణలున్నాయి. ప్రధానమైంది.. పేకాట క్లబ్ నిర్వహణ. అవును కరక్టే.
ఆయన ఎంచక్కా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసం అనే కారణం చూపి.. పెదకాకాని మండలంలో ఒక ఫ్లాట్ ను నెలకు రూ.22 వేల అద్దెకు తీసుకుని.. పెద్దస్థాయిలో దందా నడిపించాడు. కొవిడ్ సీజనులో పేకాట దందా చాలా బాగానే జరిగింది. పక్కా సమాచారం రావడంతో పోలీసులు దాడిచేసే ఏకంగా 29మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. ఏకంగా 4.15 లక్షల రూపాయలు వారినుంచి స్వాధీనం చేసుకున్నారు. ఆ రేంజిలో దందా నడిపించిన ఘనత ఈ సలివేంద్ర సురేష్ ది. ఈ వివరాలన్నీ సాక్షాత్తూ గుంటూరు జల్లా అర్బన్ ఎస్పీ ఆర్.ఎన్. అమ్మిరెడ్డి వెల్లడించిన వివరాలే. (పేపర్ క్లిప్ చూడండి.) అందరి అరెస్టు జరిగిన రోజు సురేష్ దొరకలేదు. జులై 26న పేకాటరాయుళ్ల అరెస్టు జరిగితే, జులై 29న సురేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ రకంగా సురేష్ పేకాట క్లబ్ నిర్వాహకుడి హోదాలో అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు.
రాజకీయ ప్రేరేపితం
జులై నెలలో పేకాట క్లబ్ నిర్వాహకుడి హోదాలో అరెస్టు అయిన సురేష్.. సెప్టెంబరు 7వతేదీన సీఐడీ పోలీసులకు అమరావతి భూ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని ఫిర్యాదు చేశాడు. నిజానికి సీఐడీకి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అదే పని అప్పగించింది. ప్రతి లావాదేవీని వారు ఎటూ వెలికితీసే ప్రయత్నం చేస్తారు. ప్రత్యేకించి కొందరు వ్యక్తుల మీద విడివిడిగా ఫిర్యాదులు చేయాల్సిన అవసరం లేదు. కానీ.. సలివేంద్ర సురేష్ తన ఫిర్యాదులో లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లిమిటెడ్, తొట్టెంపూడి వెంకటేశ్వరరావు, చెరుకూరి తేజస్వి, నార్త్ ఫేస్ హోల్డింగ్స్, సిజి మురళీమోహన్, గాయత్రి రియల్టర్స్, కిలారు రాజేష్, కిలారు శ్రీహస, గుడ్ లైఫ్ ఎస్టేట్ వంటి పేర్లు పేర్కొంటూ ఫిర్యాదు చేశాడు.
నిజానికి సురేష్ ఫిర్యాదు చేసే సమయానికి వారిలో చాలా మంది భూములు కొనడమూ, ఆ వెంటనే వాటిని అమ్మేసుకోవడమూ కూడా జరిగిపోయింది. అయినా వాటిని తాజా ఫిర్యాదులో పేర్కొనడం అంటే.. ఆ కంప్లయింటు రాజకీయ ప్రేరేపితమే అని అనుకునే అవకాశం ఉంది.
కిలారు రాజేష్పై పగబట్టినట్టుగా..
కిలారు రాజేష్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి ఆర్గనైజింగ్ కార్యదర్శిగా చేశారు. పార్టీలో కీలకంగా ఉంటారు. అదే వైసీపీ నాయకుల కడుపుమంటకు కారణం అయింది. కిలారు రాజేష్ భార్య పేరు మీద వారు కొన్నది కేవలం ఒకటిన్నర ఎకరా భూమి. అది కూడా కోర్ కేపిటల్కి ఏమాత్రం సంబంధంలేని చోట. చాలా దూరంగా కంతేరులో కొన్నారు. ఈ కొనుగోలులో ఎలాంటి అక్రమం, చట్ట వ్యతిరేక వ్యవహారం లేదు. అది అసైన్డ్ భూమి గానీ, ప్రభుత్వ భూమి గానీ కాదు. అయినా సరే.. రైతులనుంచి మోసపూరితంగా భూమి కొని, అక్రమార్జనకు పాల్పడ్డారనే అభియోగంతో వారి మీద కేసు పెట్టారు. నిజానికి కొన్న భూమిలో ఎకరంపైగా వారు 2017లోనే విక్రయించేశారు కూడా. అయినప్పటికీ.. ఏదో తెలుగుదేశంతో అనుబంధం ఉన్న వ్యక్తి గనుక.. పగబట్టినట్టుగా వారిపై పేకాటక్లబ్ నిర్వాహకుడి వంటి వ్యక్తితో కేసు పెట్టించారు. ఇలాంటి చీప్ ట్రిక్స్ అధికార పార్టీకే చేటు చేస్తాయని ప్రజలు అనుకుంటున్నారు.
జనం నవ్వుతున్నారు..
సలివేంద్ర సురేష్ సీఐడీకి చేసిన ఫిర్యాదు వెనుక రాజకీయ నాయకులు, వైఎస్సార్ సీపీ పెద్దలు ఉండవచ్చు. ఉండకపోవచ్చు. కానీ.. వారు అలాంటి పనికి పేకాట క్లబ్ నిర్వాహకుడి వంటి వ్యక్తిని ఎంచుకోవడమే రాంగ్ ఛాయిస్ అని జనం నవ్వుకుంటున్నారు. ఎవరి మీదనైనా ఒక ఫిర్యాదు చేస్తే, ఒక ఆరోపణ చేస్తే.. ఆ చేసిన వ్యక్తికి ప్రజల్లో ఉండే క్రెడిబిలిటీని బట్టి.. ఆ ఆరోపణలోని నిందలు నిజాలా? కాదా? ప్రజలు ఆలోచిస్తారు. అంతే తప్ప.. ఎవరు ఏం చెప్పినా సరే విలువ ఉంటుందనుకోవడం భ్రమ.
అలాంటప్పుడు.. ఇంత సీరియస్ ఆరోపణలతో సురేష్ తో కేసు పెట్టించడం ద్వారా.. వెనుక నడిపించే వ్యూహకర్తలెవరో రాంగ్ మూవ్ వేశారని ప్రజలు అనుకుంటున్నారు. పేకాటక్లబ్ మీద బతికే వ్యక్తి.. తన స్వప్రయోజనాలకోసం ఎవరి మీద ఎలాంటి బురద చల్లడానికైనా దిగజారుతాడని, అలాంటి వ్యక్తి మాటలకు విలువేం ఉంటుందని అనుకుంటున్నారు.
వైఎస్సార్సీపీ నాయకులు తమ రాజకీయ ప్రత్యర్థుల మీదికి బురద చల్లవచ్చు, బాణాలు వేయవచ్చు.. కానీ ఎవరిని పావులుగా వాడుకుంటూ.. ఎవరి చేతులమీదుగా ఆ పని చేయిస్తున్నారో.. ఆ వ్యక్తుల సచ్ఛీలతను కూడా చెక్ చేసుకుంటేనే వారి పరువు ఉండడమో పోవడమో జరుగుతుంది.
(ఇది కూడా చదవండి : వ్యక్తిత్వమే ఒక బ్రాండ్.. సోనూసూద్ )