అక్రమ మద్యం కేసులో విచారణ ఎదుర్కొంటున్న అజయ్ అనే దళిత యువకుడు పోలీసుల అదుపులో మరణించాడు. అయితే ఇది లాకప్ డెత్గా ఘటనగా విజయవాడలో కలకలం రేపింది. అజయ్ తనకు ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పడంతో అతడిని పోలీసులు వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమంద్యంలోనే అతడు మరణించాడని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.
అనుమానంతో అరెస్ట్..
అక్రమ మద్యం అనుమానం విజయవాడలో ఓ దళిత యువకుడి ప్రాణం తీసింది. నగరంలోని కృష్ణలంక స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసు స్టేషన్లో అక్రమ మద్యం ఆరోపణలతో తీసుకొచ్చిన అజయ్ అనే దళిత యువకుడు అనుమానాస్పదంగా చనిపోయాడు. పోలీసు స్టేషన్లో అస్వస్ధతకు గురైన వ్యక్తిని బందరు రోడ్డులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా అతను చనిపోయినట్లు పోలీసులు చెప్తున్నారు. అయితే గత నెల 17న ఆర్టిసి కార్గో ద్వారా తెలంగాణా నుండి అక్రమ మద్యం చేరవేస్తున్నారనే అనుమానంతో అతనిపై కేసు నమోదు చేయబడిందని సమాచారం. అతనిని విచారణ కోసం తీసుకు వచ్చి విపరీతంగా కొట్టి హిసించడంతోనే మరణించారని కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, పలుసంఘాలు ఆరోపిస్తున్నాయి. చనిపోయిన తర్వాత హాస్పిటల్ కి తీసుకువచ్చి అది గుండెపోటుమరణం గా పోలీసులు చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారనే అనుమానాలను వారు వ్యక్తం చేస్తున్నారు.
పులుముకుంటున్న రాజకీయ రంగు..
విజయవాడ నగరం నడిబొడ్డున జరిగిన ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంటుంది. పలు సంఘాలు, రాజకీయ పార్టీలు ఇందులో ఇన్వాల్ అవుతున్నాయి. అయితే ఎస్ఈబీ పోలీసులే అజయ్ను కొట్టి చంపారని మృతుడి సన్నిహితులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం వివాదాస్పదం కాకుండా చూసేందుకు ఎస్ఈబీ పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారానికి ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటోంది. కులసంఘాలు, ఇతర రాజకీయ పక్షాలు దీనిపై నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి.
నిజనిర్ధారణ కమిటీ వేసిన చంద్రబాబు..
లాకప్ డెత్ ఘటనపై తెలుగుదేశం ఛీఫ్ చంద్రబాబు స్పందించారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పార్టీ తరపున నిజనిర్ధారణ కమిటీని ఆయన ఏర్పాటు చేశారు. ఇందులో ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుతో పాటు మాజీ మంత్రి జవహర్, పార్టీ ఎస్సీ సెల్కు చెందిన పలువురు నేతలు కూడా ఉన్నారు. నిజనిజాలు వెలికితీసే పనిలో వారు నిమగ్నమయ్యారు.
తిమింగలాలను వదిలేసి..
పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం తీసుకొచ్చి విక్రయిస్తున్న మాఫియా వెనుక ఉన్న పెద్ద పెద్ద తిమింగలాలను వదిలేసి సామాన్యులను ఏపీ ప్రభుత్వం వేధిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ నేతలు, వాలంటీర్లు మద్యం తరలిస్తూ పట్టుబడినా వారిపై చర్యలు లేవని, సామాన్యులను మాత్రం వేధిస్తున్నారని ఆయన ఘాటుగా విమర్శించారు. మద్యం తయారీ దారుల నుంచి సరఫరా దారుల వరకూ అందరూ వైసీపీలోనే ఉన్నారని ఆయన ఆరోపించారు. మద్యం ధరలను 90 శాతం వరకు పెంచడం వల్లనే ఓవైపు కల్తీ మద్యం, మరోవైపు అక్రమ మద్యం ఏరులై పారుతోందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు.
అయితే ఈ ఘటనకు సంబంధించి నిజనిజాలేమిటో ఇంకా తెలియాల్సి ఉంది.











