ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా వేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇంటర్ విద్యార్థుల తల్లిదండ్రుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. పరీక్షల వాయిదాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహించిన పాత్రను అందరూ ప్రశంసిస్తున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన, విన్నపాలు, హైకోర్టు సూచన నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఏపీ విద్యా మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యానించారు. ఏపీలో కొవిడ్ పరిస్థితులు చక్కబడ్డాక పరీక్షల తేదీలను ప్రకటిస్తామని వ్యాఖ్యానించారు.
పరీక్షల నిర్వహణపై టీడీపీ ఆందోళన
ఏపీలో షెడ్యూల్ ప్రకారం ఇంటర్ పరీక్షలు మే 5 నుండి 22 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం, మే 6 నుంచి 23 వరకు రెండవ సంవత్సరం పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.అయితే ఇంటర్ పరీక్షల నిర్వహణపై రాజకీయ పక్షాలు ముఖ్యంగా టీడీపీ ఆందోళన చేపట్టాయి. కోవిడ్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది. పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులకు కొవిడ్ వ్యాప్తి ఎక్కువయ్యే ప్రమాదం ఉందని, విద్యార్థుల భవిష్యత్తో ఆటలు ఆడుకోవద్దన్ని టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఆన్లైన్లోనూ ఉద్యమం చేపట్టారు. వీరితోపాటు కొన్ని ప్రజా సంఘాలు, తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరారు. అయితే ప్రభుత్వం మాత్రం పరీక్షల నిర్వహణకే కట్టుబడి ఉందని పలుమార్లు మంత్రులు ప్రకటించారు. విద్యార్థుల భవిష్యత్ కోసమే పరీక్షలు నిర్వహిస్తున్నామని, రానున్న కాలంలో పోటీ పరీక్షల్లో తట్టుకుని నిలబడడంతో పాటు జాతీయ స్థాయి పరీక్షల్లో పోటీ పడాలంటే పరీక్షలు నిర్వహించడం ఒక్కటే మార్గమని మంత్రులూ వ్యాఖ్యానించారు.
ప్రభుత్వానికి లేఖ రాసిన లోకేష్..
ప్రభుత్వం పరీక్షల నిర్వహణకే మొగ్గుచూపడంతో ఏప్రిల్ 18న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రభుత్వానికి లేఖ రాశారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో పది, ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలని, ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఏప్రిల్ 22 విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వానికి 48 గంటల సమయం ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఉద్యమాన్ని ప్రారంభిస్తామని ప్రకటించడంతో పాటు న్యాయపోరాటం కూడా చేశారు.ఈ పరిణామాల నేపథ్యంలో హైకోర్టు సూచనలు, కొవిడ్ కేసులు, తల్లిదండ్రుల ఆందోళన తదితర కారణాల వల్ల పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
సమిష్టి పోరాటం ద్వారానే..
కాగా ఇంటర్ పరీక్షల వాయిదా నిర్ణయం తల్లిదండ్రుల విజయమని, సమిష్టి పోరాటం ద్వారానే విజయం సాధ్యమైందని ఎమ్మెల్సీ నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఈ విజయం విద్యార్థులు, తల్లిదండ్రులదని, గత 20 రోజులుగా పరీక్షల వాయిదాపై పోరాటం చేస్తున్నామని వ్యాఖ్యానించారు. దేశంలో గడచిన 24 గంటల్లో 4 లక్షల కరోనా కేసులు వచ్చాయని, ఏపీలో 20వేలపైన కేసులు నమోదయ్యాయని, శనివారం ఒక్కరోజే 26 మంది ఆక్సీజన్ లేక కర్నూలు, అనంతపురం జిల్లాల్లో చనిపోయారని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ సరికాదని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని భావించామని వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి 16శాతం కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ రేటు ఉందని, 15 లక్షల మంది పరీక్షలు రాస్తే 2 లక్షల మందికి కరోనా వచ్చే అవకాశం ఉందని, వీళ్ల ద్వారా తల్లిదండ్రులు, వృద్ధులు కలిపి మొత్తం 10 లక్షల మంది కరోనా వచ్చే అవకాశం ఉందని లోకేష్ తెలిపారు. ఈ ఆందోళనలతోనే కలిసికట్టుగా పోరాటం చేయడం ద్వారా విజయం సాధించామన్నారు. ఉద్యమంలో భాగస్వాములైన జనసేన, కమ్యూనిస్ట్లకు, విద్యార్థి సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు లోకేష్. అదే సమయంలో పరీక్షలు వాయిదా వేసినంత మాత్రాన విద్యార్థులు నిర్లక్ష్యంగా ఉండొద్దని, మరింతగా ప్రిపేర్ కావాలని సూచించారు.