కరోనా లాక్ డౌన్ పుణ్యమా అని ఓటీటీలు బాగా బాగుపడ్డాయి. అయితే ఓటీటీలో వచ్చిన సినిమాలన్నీ సక్సెస్ కాలేకపోవడం ఆశ్చర్యపడాల్సిన విషయమే. కొన్ని సినిమాలు మాత్రమే హిట్టు గట్టెక్కి.. ప్రశంసలు దక్కించుకున్నాయి. అందులో ‘కలర్ ఫోటో’ సినిమా ఒకటి. అతి తక్కువ బడ్జెట్ తో.. సాధారణ నటీనటుల అసాధారణ పెర్ఫార్మెన్స్ తో సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. నిర్మాతలకు కాసులు, ఆహా ఓటీటీకు సబ్ స్క్రైబర్స్ పెరుగుదల ఒకేసారి వచ్చిపడ్డాయి. సందీప్ రాజ్ దర్శకత్వంలో కమెడియన్ సుహాస్, వైవా హర్షా ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో తెలుగమ్మాయి చాందినీ చౌదరి హీరోయిన్ గా నటించింది.
అంత గ్లామరస్ ఫేస్ కాకపోయినప్పటికీ.. దీపు అనే పాత్రలో చలాకీగా నటించి.. చక్కగా భావోద్వేగాలు పలికించి మంచి మార్కులేయించుకుంది చాందిని. నిజానికి దీపు పాత్ర కోసం మొదటగా మెగాడాటర్ నీహారికను సంప్రదించాడట దర్శకుడు సందీప్ రాజ్. అయితే కరోనా లో షూటింగ్ చేయాల్సి రావడం వల్ల , తదితర కారణాల వల్ల కలర్ ఫోటో సినిమాకి నీహారిక నో చెప్పిందట. ఆమె సున్నితంగా ఆ ఆఫర్ ను తిరస్కరించడంతో ఆ పాత్ర చాందినీ చౌదరికి దక్కింది. సూపర్ హిట్ సొంతం చేసుకుంది. మూడు నాలుగు సినిమాల్లో నటించినప్పటికీ మెగా డాటర్ నీహారికకు కథానాయికగా బ్రేక్ రాలేదు. ఆ కోరిక తీరకుండానే నీహారిక పెళ్ళి పీటలు ఎక్కబోతోంది. మళ్ళీ ఆమె సినిమాల్లో ఎప్పుడు నటిస్తుందో తెలియదు కానీ.. కలర్ ఫోటో సినిమాను మిస్ అయినందుకు మెగాభిమానులు మాత్రం కాస్తంత ఫీలవుతున్నారు. మరి ఈ విషయంలో నీహారిక స్పందన ఏంటో చూడాలి.