మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా ‘ఆచార్య’. సెన్సార్ కార్యక్రమాలను తాజాగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం యూ/ఏ సర్టిఫికెట్ను పొంది విడుదలకు సిద్ధం అయ్యింది.కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి సురేఖ సమర్పణలో మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ‘ఆచార్య’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో అని అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ మూవీలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్గా నటిస్తుండ..సంగీత, రెజీనా కసాండ్ర ప్రత్యేక పాటల్లో సందడి చేయబోతున్నారు.
ఇక ఈ సినిమా కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించారు. ఈ విషయాన్ని తాజాగా మెగాస్టార్ చిరంజీవి ట్విటర్ వేదికగా కన్ఫర్మ్ చేస్తూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. “మా ‘ఆచార్య’ సినిమాలో ‘పాద ఘట్టాన్ని’ మహేష్ తన గొంతుతో మొదలు పెట్టడం చాలా ఆనందంగా ఉంది”.. అని తెలిపారు. మూవీ కోసం మహేష్ తన వంతుగా ప్రత్యేక పాత్ర పోషించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆ పోస్టులో పేర్కొన్నారు. అదేసమయంలో మహేష్ వాయిస్ విన్నప్పుడు తాను, రాంచరణ్ ఎంతైతే థ్రిల్ అయ్యామో అదే విధంగా అభిమానులు, ప్రేక్షకులు కూడా థ్రిల్ ఫీలవుతారని మెగాస్టార్ ఆ పోస్ట్లో రాసుకొచ్చారు.కాగా చిరు పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇక మూవీ డైరెక్టర్ కొరటాల శివ కూడా సూపర్ స్టార్ మహేశ్ బాబు అడగగానే ఏమాత్రం ఆలోచించకుండా వాయిస్ చెప్పేందుకు ఒప్పుకున్నారని.. ఆయన వాయిస్తో అందరూ కథలోకి వెళ్ళిపోతారని చెప్పారు. ఈ సందర్భంగా ఆచార్యకు టెర్రఫిక్ వాయిస్ ఓవర్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.