తీరా కామత్ అనే ఐదు నెలల చిన్నారి అరుదైన వ్యాధితో బాధ పడుతోంది. వెన్నెముక కండరాలు బలహీనంగా మారిపోయాయి. దీంతో.. పాప కదల్లేని స్థితికి చేరుకుంది. ముంబైలోని ఆసుపత్రిలో పాపకు చికిత్స జరుగుతోంది. ఆ బాలికకు ఉన్న అరుదైన వ్యాధిని నయం చేసేందుకు అవసరమయ్యే మెడిసిన్స్ భారత్ లో దొరకవు. వాటిని అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం మందులకే 16 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. అంత డబ్బు తీరా కామత్ తల్లిదండ్రుల వద్ద లేదు.
వెల్లువెత్తిన విరాళాలు..
దీంతో క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధుల సేకరణను మొదలుపెట్టారు. విరాళాలు వెల్లువెత్తాయి. ఏకంగా 12 కోట్ల రూపాయల వరకు నిధులు సమకూరాయి. అయినప్పటికీ మెడిసిన్స్ కు సరిపడా డబ్బులు రాలేదు. దీంతో.. పాప తల్లి తన ఆవేదనను ప్రధాని మోదీకి సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
తల్లి లేఖ..
‘ఐదు నెలల నా పాప ప్రాణాలతో పోరాడుతోంది. తనను బతికించుకునేందుకు చాలినంత డబ్బు మా దగ్గర లేదు. దాతలు స్పందించి 12కోట్ల రూపాయలను సమకూర్చారు. వారికి పేరుపేరునా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. అమెరికా నుంచి దిగుమతి చేసుకోబోయే మెడిసిన్స్ కు 16 కోట్ల రూపాయలు ఖర్చు అవుతోంది. ఈ పదహారు కోట్ల రూపాయల్లో 23శాతం దిగుమతి సుంకం, 12శాతం జీఎస్టీని కూడా కలిపారు. మొత్తంగా వీటికి ఆరు కోట్ల రూపాయలను చెల్లించాల్సి వస్తోంది. వీటిని కనుక ప్రభుత్వం మానవతాదృక్పదంతో రద్దు చేస్తే 10 కోట్లకే మెడిసిన్స్ వస్తాయి. నా పాపకు చికిత్స అందుతుంది. దయచేసి నా కూతురిని బతికించండి’ అంటూ ఆ తల్లి సోషల్ మీడియా ద్వారా ప్రధానిని వేడుకుంది.
స్పందించిన ప్రభుత్వం..
Sincere gratitude to Hon PM @narendramodi ji for your humanitarian and extremely sensitive approach towards exempting all the taxes (approx ₹6.5 crore) for importing the life saving drug for Mumbai’s 5 month old Teera Kamat!
I wish Teera a speedy recovery & healthy life! pic.twitter.com/wxT8PsnSx5— Devendra Fadnavis (@Dev_Fadnavis) February 9, 2021
ఈ లేఖకు ప్రభుత్వం వెంటనే స్పందించింది. దానికి సంబంధించిన అధికారిక ప్రక్రియను వెంటనే ప్రారంభించింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆ పాప మెడిసిన్స్ విషయంలో దిగుమతి సుంకాన్ని, జీఎస్టీని రద్దు చేయాల్సిందిగా కోరుతూ కేంద్రానికి ఫిబ్రవరి 1న లేఖ రాశారు. ప్రధాని కూడా సానుకూలంగా స్పందించారు. దేవేంద్ర ఫడ్నవీస్ విన్నపానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి సంబంధించిన అధికారిక లేఖను దేవేంద్ర ఫడ్నవీస్ తన ట్విటర్ ఖాతాలో ఫిబ్రవరి 9న పోస్ట్ చేశారు. ‘ఐదు నెలల పాపను ఆదుకునేందుకు కీలక నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పాపకు అవసరమయ్యే మెడిసిన్స్ కు సంబంధించి దిగుమతి పన్నును, జీఎస్టీని మినహాయించడమైనది’ అని ట్విటర్ ద్వారా దేవేంద్ర పడ్నవీస్ తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల పాప తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంచేశారు. ఈ విషయం తెలిసి నెటిజన్లు ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Must Read ;- ప్రధాని మోడీ తమ్ముడే.. అయితే ఏంటట?