పిల్లలకు వేస్తున్న పోలియో చుక్కల బదులు.. శానిటైజర్ ఇచ్చిన ఘటన మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో బన్ బోరా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. 12మంది పిల్లలకు పోలియో చుక్కల బదులు శానిటైజర్ వేసినట్టు అధికారుల విచారణలో తేలింది. దీంతో బాధ్యులను అధికారులు సస్పెండ్ చేశారు. కాగా ప్రస్తుతం ఆ పిల్లలకు ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది.
పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా గత ఆదివారం ఆ ప్రాంత పరిధిలో పిల్లలకు పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహం తరువాత పోలియో చుక్కలు వేయించుకున్న 12మంది పిల్లలకు వాంతులయ్యాయి. బాధితులు ఆరోగ్య కేంద్రానికి వచ్చి విషయాన్ని వెల్లడించారు. తమ ఇద్దరు పిల్లలకు వాంతులు అవుతున్నాయని తండ్రి కిషన్రావు స్థానిక వైద్యుడిని ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తొలుత తమ తప్పేమీ లేదని, ఒక్కో యూనిట్ (సీసా) లో 40 మంది పిల్లలకు సరిపడే చుక్కలు ఉంటాయని, ఈ పిల్లలకే ఎందుకు సమస్య వచ్చిందని సదరు ఆరోగ్య సిబ్బంది ఎదురు ప్రశ్నించారు. దీంతో కిషన్రావు ఇచ్చిన సమాచారం మేరకు ఆ ఏరియా ఆసుపత్రి వైద్యుడు, స్థానిక ప్రజాప్రతినిధి స్వయంగా వచ్చి పరిశీలించారు.ఈ పరిశీలనలో పోలియో చుక్కల బదులు శానిటైజర్ చుక్కలు వేసినట్టు తేలింది. పిల్లలు అస్వస్థతకు గురికావడానికి ఇదే కారణమని తేలిసింది. వెంటనే ఆ పిల్లలను యావత్మాల్ ఆసుపత్రికి తరలించారు. నిన్నటి వరకు పిల్లల పరిస్థితి కొంత ఆందోళనకరంగానే ఉన్నా ప్రస్తుతం స్థిరంగా ఉందని, కోలుకుంటారని వైద్యులు తెలిపారు.
Must Read ;- కరోనా వ్యాక్సిన్తో ఇద్దరికి అస్వస్థత
సర్పంచ్ జోక్యంతో..
తొలుత తమ పిల్లలు అస్వస్థతకు గురైనట్టు చెబితే సదరు సిబ్బంది పట్టించుకోలేదని పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరంతా ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో ఆ గ్రామ సర్పంచ్కి ఫిర్యాదు చేశారు. ఆ సర్పంచ్, ఏరియా ఆసుపత్రి వైద్యుడు వచ్చి పరిశీలన జరపగా హ్యాండ్ శానిటైజర్ డ్రాప్స్ వేసినట్టు తేలడంతో అంతా షాక్ తిన్నారు. దీనిపై యావత్మాల్ జడ్పీ సీఈఓ శ్రీకృష్ణ పంచాల్ సదరు ముగ్గురు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే సస్పెండ్ చేశారు. వైద్యుడిపై శాఖాపరమైన చర్యలకు వైద్య ఆరోగ్యశాఖకు లేఖ రాసినట్టు వెల్లడించారు. కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నచిన్నారులను యవత్మల్ జిల్లా కలెక్టర్ ఎండీ సింగ్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మేడ్చల్లో చిన్నారి..
కాగా పోలియో చుక్కల కార్యక్రమానికి కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కొన్ని మార్గదర్శకాలు ఇప్పటికే జారీ చేసింది. పిల్లల్లో అప్పటికే జలుబు, జ్వరం, దగ్గు లేదా ఏదేని ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే.. వైద్యుడు అందుబాటులో ఉండే ప్రభుత్వాసుపత్రిలో మాత్రమే పోలియో చుక్కలు వేయించాలని మార్గదర్శకాలు జారీ చేసింది. ఇక పోలియో చుక్కలు వేయించుకున్న చిన్నారి చనిపోయిన ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. దుండిగల్ మున్సిపాల్టీ పరిధిలోని మహేశ్వరం పరిధిలో ఆదివారం పోలియో చుక్కలు వేసిన కాసేపటికే అపస్మారక స్థితికి వెళ్లిన చిన్నారి ధీక్షిత (2నెలల 16 రోజులు) చనిపోయింది. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మహేశ్వరంలో ఆదివారం(జనవరి 31,2021) ఈ ఘటన జరిగింది.ఆదివారం స్థానిక శంభీపూర్లోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారికి పోలియో చుక్కలు వేయించగా తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే తల్లిదండ్రులు మియాపూర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు చెప్పారు. చిన్నారి మృతికి పోలియో చుక్కలే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తుండగా జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి మల్లికార్జున్ మాట్లాడుతూ పోలియో చుక్కలు వికటించే అవకాశం లేదని, ఒకే సీసాలో చాలా మందికి సరిపడా పోలియో డ్రాప్స్ ఉంటాయని, మిగతావారికి సమస్యలేవీ రాలేదన్నారు. చిన్నారి మృతి చెందిన ఘటన బాధాకరమని, చిన్నారి మరణానికి ఇతర కారణాలు ఉండొచ్చని ఆయన తెలిపారు.
Must Read ;- ప్రపంచాన్ని బంధించిన ‘కరోనా’@ 2020