ప్రహ్లాద్ మోదీ అంటే ఎవరూ గుర్తు పట్టకపోవచ్చు. ఆయనేమీ దేశంకోసం పోరాటాలు త్యాగాలు చేసిన వ్యక్తి కాదు. కనీసం దేశాన్ని మోసం చేసి… వందల వేల కోట్ల రుణాల ఎగవేసి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ కూడా కాదు. ప్రహ్లాద్ మోదీ అనే పేరు చెప్పగానే.. ఆయనను గుర్తుపట్టడం చాలా కష్టం. కానీ ప్రధాని నరేంద్రమోదీకి తమ్ముడు అంటే.. ఎట్ లీస్ట్ వారి వారి ప్రాంతాల్లో అయినా చాలా మంది గుర్తు పడతారు! మోదీకి తమ్ముడు అనే పదవి తప్ప.. ప్రహ్లాద్ మోదీకి మరేమీ లేదు. కానీ.. ఆయన కూడా ప్రభుత్వం మీద అలిగారు. ఏకంగా గంటన్నరపాటూ.. ధర్నాచేశారు. ఆయనేదో ప్రజల సమస్యల పరిష్కారం కోసం … స్థానిక అధికార్ల ఎదుట ఈ ధర్నాకు ఉపక్రమించారని అనుకుంటే.. మీరు పప్పులో కాలేసినట్టే! తన గౌరవానికి, తన హోదాకు భంగం వాటిల్లిందని.. తనకు అవమానం జరిగిందని భావించి, అలిగి ఆయన ధర్నాకు దిగారు. ఆయన లక్నో ఎయిర్ పోర్ట్ అధికారుల మీద అలిగారు.
ఇంతకూ ఇది ఎలా జరిగిందో తెలుసా..
ప్రధాని నరేంద్రమోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ లక్నో ఎయిర్ పోర్టుకు వచ్చారు. అయితే తనకోసం తరలివచ్చిన అనుచర గణాలు అందరినీ ఎయిర్ పోర్ట్ లోకి అనుమతించలేదని ఆయన ఆగ్రహించారు. అంతే విమానాశ్రయంలోనే ధర్నాకు కూర్చున్నారు. అక్కడి అధికారులు వచ్చి ఎంత నచ్చజెప్పబోయినా ఒక పట్టాన వినిపించుకోలేదు. ఇలా గంటన్నరపాటు యాగీచేసిన తర్వాత అక్కడినుంచి తరలి వెళ్లారు.
అయితే ఏంటట
తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే.. అని మనకు సామెత ఉంది. కానీ తమ్ముడు కాగానే.. కాస్త స్పెషల్ హోదా వచ్చేస్తుందని ప్రహ్లాద్ మోదీ అనుకుంటున్నట్టుంది. మోడీ తనకు కుటుంబమే లేదని.. ఎవ్వరి పెత్తనమూ ఉండదని చెప్పుకుంటూ ఉంటారు. మరి.. ఈ ప్రహ్లాద్ మోదీ అనే తమ్ముడు.. ఇలా విమానాశ్రయం అధికారుల మీద రుబాబు చేయడం ఏంటో అర్థం కావడం లేదని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
Must Read ;- మోదీకి ట్వీట్ చేసిన ‘కేజీఎఫ్’ ఫ్యాన్











