స్థానిక ఎన్నికలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు సాకుగా చూపించి, ఏదో విధంగా కోర్టులను మేనేజ్ చేసి సీఎం జగన్మోహన్రెడ్డి విశాఖకు లేచిపోవాలని చూస్తున్నాడని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. ఇప్పటికే అధికారులు, సచివాలయ సిబ్బందికి విశాఖలో అద్దెకు ఇళ్లు చూసుకోవాలని చెప్పారని ఆయన గుర్తు చేశారు. వెలగపూడిలో రాత్రికి రాత్రి దుకాణం కట్టేసి విశాఖ పారిపోవాలని చూస్తున్నారని రఘురామకృష్టంరాజు తెలిపారు. ఇప్పటికే రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించేందుకు 20 సార్లు ముహూర్తం పెట్టారని, తాజాగా మరోసారి ముహూర్తం పెట్టారని ఆయన వెల్లడించారు. అమరావతిలో రాజధాని వద్దని ప్రజలే తీర్పు ఇచ్చారని కోర్టుకు కూడా చెప్పే అవకాశం లేకపోలేదని ఎంపీ అనుమానం వ్యక్తం చేశారు.
సచివాలయం ఎక్కడికీ పోదు
నూరు ఆరయినా, ఆరు నూరయినా ఏపీ సచివాలయం అమరావతిలోనే ఉంటుందని ఎంపీ రఘురామకృష్ణంరాజు చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం అత్యంత దారుణంగా డబ్బు వృథా ఖర్చులు చేస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు తన సొంత నియోజకవర్గం వెళ్లాలని ప్రయత్నిస్తే ఏడు కేసులు పెట్టారని ఆయన గుర్తు చేశారు. అమరావతి నుంచి విశాఖకు ముందుగా సీఎం దుకాణం సర్దివేస్తారని, తరవాత అన్ని కార్యాలయాలు తరలించాలని చూస్తున్నారని ఎంపీ చెప్పుకొచ్చారు.
Must Read ;- కొమ్ముల్లేని దున్నపోతు రఘురామకృష్ణంరాజు.. మంత్రి పెద్దిరెడ్డి











